23, ఫిబ్రవరి 2021, మంగళవారం

మన మహర్షులు - 31

 మన మహర్షులు - 31


 మైత్రేయ మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మైత్రేయుడు ఎంత గొప్పవాడంటే తల్లి గర్భంలో వుండగానే ధర్మశాస్త్రాలు, వేదవేదాంగాలు అన్నీ నేర్చేసుకున్నాడు.


 చిన్నతనంలోనే రాక్షసులందర్నీ నాశనం చేసే యజ్ఞం చేశాడు. పులస్త్య బ్రహ్మర్షి దగ్గర దివ్యజ్ఞానసిద్ధి పొందాడు.


ఒకసారి గురువు పరాశర మహర్షిని మీ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను. విష్ణుమూర్తె  తత్త్వాన్ని నాకు వివరించండని అడిగాడు మైత్రేయ మహర్షి -


ఇవే కాకుండా భూమి మొదలైన భూత ప్రమాణాలు, సప్తసాగరాలు, సప్తద్వీపాలు సప్తకులపర్వతాలు, సూర్యగ్రహం మొదలైన వాటి సంచారాలు, చతుర్విధ భూత నిర్మాణం, చతుర్ధశ మన్వంతరాలు, చతుర్యుగ ప్రమాణాలు, కల్పకల్ప విభాగం, యుగధర్మాలు, దేవర్షి చరిత్రలు, బ్రాహ్మణ వర్ణధర్మాలు, బ్రహ్మచర్యం మొదలైన వాటి గురించి కూడ చెప్పమన్నాడు


పరాశరుడు ఆనందంతో విష్ణుతత్త్వం గురించి చక్కగా వివరంగా చెప్పాడు మైత్రేయుడికి.  అదే విష్ణు పురాణం..

--- పుట్టడం, చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఇవన్నీ ఏ జీవికి ఒకే చోట జరగదు. ఎవరి కర్మని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది.


ధనం సంపాదించడం, దాచడం, ఖర్చు పెట్టడం, ఇదంతా దుఃఖానికే, కాని, ఎవరికేనా చాలా డబ్బుంది అంటే అది సంతోషపడే విషయం కాదు స్త్రీలు, స్నేహితులు, చుట్టాలు, పిల్లలు, ఇళ్ళు, పొలాలు ఇవన్నీ పోవడం రావడం

వల్ల కష్టమే గాని సుఖముండదు.


అసలు దుఃఖానికి కారణం మనం చేసే పని. అది విత్తనం. అదే చెట్టులాగ పెరిగి పెద్దదవుతుంది.


పుడుతూ ఉండడం, రోగాలు, వృద్ధాప్యంతో బాధపడుతూ ఉండడం ఇవన్నీ లేకుండా భగవన్నామం చేసుకుని మోక్షానికి ప్రయత్నించడమే మంచిదని జ్ఞానులు చెప్తున్నారని అన్నీ వివరంగా పరాశరుడు మైత్రేయ మహర్షికి చెప్పాడు..


మైత్రేయుడు అన్ని తీర్థాలు తిరుగుతూ కామ్యకవనంలో పాండవుల్ని చూసి బాధపడి దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలని వాళ్ళదగ్గరకి వెళ్ళాడు.


 ధృతరాష్ట్రుడు మహర్షిని సత్కరించి పాండవులెలా వున్నారని అడిగాడు. 


మహామునుల దీవనలందుకుంటున్న పాండవులకి కష్టాలెందుకుంటాయి? వాళ్ళు ధర్మం తప్పితే సూర్యచంద్రులు గతులు తప్పుతారు. బలంలో ఒక్కక్కడు నూరేసి ఏనుగులకి సమానమని చెప్పాడు మైత్రేయుడు


మైత్రేయ మహర్షి చెప్తుంటే దుర్యోధనుడు తొడలు కొట్టుకుంటూ కూర్చున్నాడు.


దుర్యోధనా! నా మాట లక్ష్యపెట్టక నన్ను గౌరవించని నువ్వు భీముడితో తొడమీద గదతో కొట్టించుకుని ఛస్తావ్! అని శపించాడు మైత్రేయుడు.


దృతరాష్ట్రుడు మైత్రేయుడి కాళ్ళమీదపడి క్షమించమన్నాడు.


 మైత్రేయుడు వినకుండా కోపంతో వెళ్ళిపోయాడు


కొంతకాలం తర్వాత విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి గంగానది దగ్గర ఇసుక మీద పద్మాసనం వేసుకుని ఇంద్రియాల్ని అరికట్టి ఆచార, వ్రతాల, ఉపవాసాల్లో కృశించిపోయిన పుణ్యపురుషుడయిన మైత్రేయ మహర్షి పాదాలకి నమస్కారం చేసి మహర్షీ భగవంతుడు స్వతంత్రుడైనా ఎన్నో అవతారాలెత్తుతాడు కదా.... ఏ పన్లు చేశాడు? సవివరంగా తెలియజేయండి...అంటూ అడిగాడు.


మైత్రేయ మహర్షి విదురుడితో లోకానికంతకి ఈశ్వరుడు హరి. జీవుడు భగవంతుడి మీద ఆధారపడ్డాడు. నారాయణుడు అన్నింటికీ తాను ఆధారమవుతాడు కానీ, తాను ఆధారపడడు. హరి భజన వల్ల సమస్త కష్టాలు పోతాయని చెప్పాడు. ఇంకా విష్ణుమూర్తి అవతారాలు అన్నింటి గురించి కూడా చెప్పించుకుని విని విదురుడు ఆనందంగా వెళ్ళిపోయాడు.


ఒకసారి మైత్రేయుడి ఆశ్రమానికి వ్యాసుడు చెప్పకుండా వచ్చాడు. మైత్రేయుడు భక్తితో పూజచేసి చక్కటి భోజనం పెట్టి స్వామీ! మీరాక నాకు చాలా ఆనందంగా వుంది మీరాకకు కారణం చెప్పండన్నాడు.


మహర్షీ! తపము, దానము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసా! దానమే గొప్పది. అలాగే దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పది


ఎందుకంటే ప్రాణం శరీరంలో ఉంటుంది. శరీరానికి బలం అన్నం వల్లనే వస్తుంది. జ్ఞానవంతులు అన్నదానం చేస్తారు. తపము, విద్య, దానము, ధర్మగుణాన్ని పెంచుతాయి ఉన్నతమైన విద్య భగవంతుణ్ణి చూపించే మార్గం. నువ్వు చేసిన అన్నదానం వల్ల నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి వ్యాసుడు మైత్రేయుణ్ణి అభినందించి

వెళ్ళిపోయాడు .


మైత్రేయ మహర్షి కధ చదవడం వల్ల మనం కూడా శ్రీహరితత్వాన్ని...అన్నదాన మహిమను..అహంకారం లేకుండా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాము..


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

కామెంట్‌లు లేవు: