22, మే 2021, శనివారం

దక్షయజ్ఞనాశము

 _*వైశాఖ పురాణం - 10 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*దక్షయజ్ఞనాశము కామదహనము*




☘☘☘☘☘☘☘☘☘



రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను.


ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు , వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు , రాక్షసులు , మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి.


బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రతికింపజేసెను , శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రతికించెను , మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు.


యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి.


యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను.


దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను.


ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును ?  కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను , సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను , తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను.


దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా ! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి యెవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షునియజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను.


దేవతలందరును యఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును , మనధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.


ఇంద్రుడు - నారదుని జూచి నారదమహర్షీ ! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను.


నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనముపోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను.


మన్మధుడును ఇంద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను , భార్యయగు రతీదేవితోను , మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను.


అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము , మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను.

బాణప్రయోగమొనర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను.


తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు , మన్మధుని భార్య రతి - శివుడు తమను కూడ శిక్షించునేమో ? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంత్ర్దాన మయ్యెను.


మన్మధుడు చేసినపని దేవతలకు , శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో యెవరు చెప్పగలరు ?


కావున శ్రుతకీర్తి మహారాజు ! ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని , అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను.


పరమపుణ్యప్రదమైన ఈ కధను , రాత్రిగాని , పగలుగాని యెవరు విన్నను , జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదులవలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను.



*వైశాఖ పురాణం  పదవ అధ్యాయం  సంపూర్ణం*


_*వైశాఖ పురాణం - 11 వ అధ్యాయము*_ 



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*రతి దుఃఖము - దేవతల ఊరడింపు*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది ? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని , పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను , శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి.


కల్యాణీ ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును ? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా !



*వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం*

_*వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




 *కుమారజననము*




☘☘☘☘☘☘☘☘☘




మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను ఇంటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును , ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.


పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.


శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని  యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.


హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఈయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.


లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు , విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు , మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు , మునులు , షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.


హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని ఇంటను , రాత్రులయందు సరస్తీరముల యందు , పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.


ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.


వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా ! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి శివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.


శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.


అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును , ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.


బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.


ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా ! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము , పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.


పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.


రాజా ! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను , వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున *వైశాఖమాస వ్రతము* అన్ని పాపములను పోగొట్టును , మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను , పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు , భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి , దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.



*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం*

కామెంట్‌లు లేవు: