24, జులై 2021, శనివారం

గురు పూర్ణిమ విశిష్టత

 గురు పూర్ణిమ విశిష్టత


వ్యాసుడు పుట్టిన పుణ్యతిథి ఆషాడ శుద్ద పౌర్ణమి. ఈ పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని పూజిస్తే, ద్యానించిన వారికి తన స్వరూప దర్శనంకలుగుతుందని వ్యాసుడే చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. అందుకే యావద్భారతదేశం పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భం గావ్యాసమహర్షిని పూజించి తరిస్తోంది. 


అపూర్వ, అద్భుత వేదవాజ్జ్గ్మయాన్ని అందించిన బ్రహ్మదేవుడు ఆయన, కాని ఆయనకు నాలుగు ముఖాలు ఉండవు. స్థిరచరాలన్నింటా వ్యాపించినవిష్ణుదేవుడు ఆయన, కాని ఆయనకు రెండు చేతులే ఉంటాయి. శిష్యుల అజ్ఞానాన్ని హరించే హరభగవానుడు ఆయన, కాని ఆయనకు నొసట నేత్రంలేదు. ఎవరైతే సత్యవతీ-పరాశరుల పంటగా, నది మధ్య ఉన్న దీవిలో నల్లటిరంగుతో జన్మించి క్రిష్ణ ద్వైపాయనుడుగా పేరు గడించాడో , ఎవరైతేపుడుతూనే వేదాలను వల్లించి, ఆ తరువాత చిక్కుముడులతో ఎకాకృతిగా ఉన్న వేదరాశిని సంస్కరించి, విభజించి, భోధించి, వ్యాప్తి చేసి వేదాంగభాస్కరుడుగా కీర్తి పొందాడో, ఎవరైతె పురానేతిహాసాల్లో సులభతరం చేసిన వేదసారాన్ని జొప్పించి పంచమ వేదమైన మహాభారతాన్ని,భక్తిరసప్రధానమైన భాగవతం మొదలైన పద్దెనిమిది పురాణాలనూ రచించి, అమూల్యమైన ఆర్ష సాహిత్యాన్ని లోకానికి అనుగ్రహించిన జ్ఞానమయప్రదీపుడుగా విశ్వవిఖ్యాతి చెందాడో, ఎవరైతే సనక సనందాదుల చెంత బ్రహ్మవిద్యను అభ్యసించి, న్యాయ ప్రస్థానమైన బ్రహ్మ సూత్రాలను రచించించి,బదరికావనం లో తపస్సు చేసినందు చేత బాదరాయణుడు అనిపించుకొని జగద్గురువైన శ్రీకృష్ణ స్వరూపిడిగా ప్రకటితమయ్యాడో ఆ మహానుభావుడేవ్యాస భగవానుడు…..


విష్ణు పాదాల నుండి జనించి, ఉదృతం గా కిందకు దుమికిన గంగా ప్రవాహం, శివుడి జటాజూటం నుంచి జాలువారి భూలోకాన్ని పవిత్రం చేసింది. పరమాత్మ నుంచి జనించిన జ్ఞాన గంగ కూడా వ్యాసుడి ముఖకమలం నుండి జాలువారి, గురుపరంపర ద్వారా ప్రవహించి లోకుల్ని లోకుల్ని పూనితంచేసింది, చేస్తోంది. గురువు తన జ్ఞాన భోధద్వారా శిష్యుడిలోని అజ్ఞానాన్ని పోగొట్టి, పూర్ణ స్వరూపుడిగా తీర్చిదిద్దే త్రిమూర్తి స్వరూపుడు. అజ్ఞానంనుంచి మేల్కొలిపే దేవుడే గురు దేవుడు. పాంచ భౌతికమైన శరీరం లో తెలియవచ్చే భగవానుడే గురుదేవుడు. ఇటువంటి గురుశిష్య సంప్రదాయాన్నిఏర్పరిచిన గురువులకు గురువే వ్యాస భగవానుడు. ఈయన వల్లనే ఆధ్యాత్మిక గురువుకు ఆర్ష సంస్కృతి లో ఎనలేని గౌరవస్థానం దక్కింది. అందుకేగురు పరంపరలో నిలిచినా గురు మహాత్ములందరినీ జ్ఞాన ప్రదాతలుగా సంస్మరించుకొని , తమతమ గురువుల్లో వ్యాసాదులను దర్శించి, ఏటేటా వారినికృతజ్ఞతతో ప్రత్యేకంగా పూజించే పండుగే గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ.

కామెంట్‌లు లేవు: