25, జులై 2021, ఆదివారం

పంచేంద్రియాల్లో

 పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.


మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.


మనసూ అంతే! మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే!

నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి.


మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.


పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది- తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.


ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా లోకం అతణ్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్న లాంటిది. దానధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్ళించడంతో లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది!


🚩 హరహర మహాదేవ శంభోశంకర 🚩


🙏🚩 సర్వేజనా సుఖినోభవంతు

సమస్త సన్మంగళాని భవంతు 🚩🙏


🚩🚩 హరి నామ స్మరణం 

సమస్త పాప హరణం 🚩🚩


🐄🐄గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

గోశాలలను నిర్మించండి🐄🐄


🚩జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩

కామెంట్‌లు లేవు: