5, జనవరి 2022, బుధవారం

_వాడపల్లి వెంకన్న

 *_వాడపల్లి వెంకన్న విజయగాథ..._*


*_ఒకప్పుడు జీతాలు లేవు..._*


*_నేడు కోట్ల రూపాయల అభివృద్ధి..._*


*_దేశం నలుమూలల నుంచి భక్తజనం..._*


వాడపల్లి వెంకన్న.. ఈ పేరు తెలియనివారు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. స్వామి వారి మహత్యం అటువంటిది. ఒకప్పుడు ఇక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఉండేవి కాదు.నేడు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా స్వామి మహిమే అని చెబుతారు. వివరాల్లోకి వెళితే..   

   ..తూర్పుగోదావరి జిల్లా కొనసీమలోని వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి స్వయంభు స్వయంభు. కలియుగంలో 4 చోట్ల మాత్రమే వెంకన్న స్వయంభూగా వెలిశారు. ఒకటి తిరుమల తిరుపతి. రెండవది ద్వారకాతిరుమల. మూడు విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని ఉపమాక .ఈ మూడు చోట్ల స్వామివారు రాతి విగ్రహ రూపంలో ఉంటారు. నాలుగవది వాడపల్లి ఇక్కడ స్వామివారి విగ్రహం ఎర్రచందనం లో ఉంటుంది .అందుకే స్వామివారికి పంచామృత అభిషేకంలు చేయరు. కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు.ఇది ఇక్కడ మరో మహత్యం .2000 సంవత్సరం వరకు సామాన్యంగా భక్తులు వచ్చేవారు. వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే వారు. అయితే 2000 సంవత్సరంలో ప్రతి శనివారం వచ్చే ఓ భక్తుడును చూసి ఆలయంలో పనిచేసే సూపరిండెంట్ రాధాకృష్ణ అతడిని ప్రతివారం ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నించగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ సిద్ధాంతి ఉన్నారు. ఆయన దగ్గరికి వెడితే ఈతి బాధలు పోవడానికి కోనసీమలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని ఏడు శనివారాలు దర్శించుకుని ,ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేయాలని చెప్పారని దానితో తన బాధలు తీరి పోవడంతో ప్రతివారం వస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం ఆ గ్రామస్తులు ఆఅందరికి తెలిసింది. గ్రామస్థులు కూడా ప్రతి శనివారం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకునే వారు. వారి కోరికలు నెరవేరాయి. దీంతో ఆనోటా ఈనోటా ప్రపంచవ్యాప్తంగా వాడపల్లి వెంకన్న మహత్యం అందరికీ తెలిసింది. 2001 నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. స్వామివారికి గతంలో పెద్దాపురం మహారాజా 250 ఎకరాల భూమిని ఇచ్చారు. కొన్ని మాన్యాల కింద వెళ్ళిపోయాయి. అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం 150 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవి కాక హుండీ ద్వారా, టికెట్ల అమ్మకాలు, ప్రసాద విక్రయాలు, అన్నదానాలు కింద కోట్ల రూపాయలు వస్తున్నాయి. గత ఏడాది స్వామివారి వార్షిక ఆదాయం 7 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం ఆలయంలో రూ 13 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సతీష్ రాజు వెల్లడించారు .చైర్మన్ రమేషు రాజు సహకారంతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. 4,5 ఏళ్ల క్రితం ఈ ఆలయానికి వచ్చిన వారు ఇప్పుడు ఈ ఆలయానికి వస్తే గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది . పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తిరుమల, అన్నవరం , శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు భక్తులు దర్శనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలు తీసుకెళ్తారు .అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రస్తుతం వాడపల్లి దర్శనం కోసం ప్రతి శనివారం సిఫార్సు లేఖలు వస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. సిఫార్సుతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఉదయం ఒక గంట సమయం కేటాయించి న ట్లు ఈవో సతీష్ రాజు వెల్లడించారు. కొందరు భక్తులు మూడు, నాలుగు వారాలు దర్శనం అయిన తర్వాత తమ కోరికలు నెరవేరాయని ఆనందంతో వెల్లడించి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతోందని ఆయన తెలిపారు. వాడపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి 54 లక్షల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా స్వామివారి కళ్యాణానికి అధునాతన కల్యాణమండపం నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ముక్కోటి ఏకాదశి కి పూర్తవుతాయని వెల్లడించారు. స్వామి మహత్యం గురించి మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ప్రచారం చేసిందని దీంతో ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని తెలిపారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాటీజీల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు వివో వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగమాంబ నిత్యాన్నదాన భవనం లో ఎలా అన్నదానం నిర్వహిస్తారు

 నిర్వహిస్తారో అదే స్థాయిలో ఇక్కడ ఒకేసారి 15వేల మందికి అన్నదానం జరపడం విశేషం. స్వామి వారి ఆలయం చెంతనే గోదావరి నది ఉంది. భక్తులు అక్కడ స్నానం చేసి ,మరి కొందరు అక్కడే తలనీలాలు సమర్పించి స్వామివారి ప్రదక్షిణ లో పాల్గొంటారు. ప్రదక్షిణలు పూర్తయ్యాక స్వామి దర్శనం చేసుకుని, అన్నదానం స్వీకరించి నిండుమనసుతో తిరిగి వెళతారు. కొందరైతే శుక్రవారం సాయంత్రానికి అక్కడకు చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రపోయి తెల్లవారుజామునే లేచి గోదావరి స్నాన మాచరించి ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. అయితే ఇంత పెద్ద దివ్యక్షేత్రంలో బస చేసేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. అందుకోసమే ఎమ్మెల్యే సహకారం తీసుకుని టీటీడీ ద్వారా రెండు కోట్ల రూపాయలతో కాటేజీలు నిర్మిస్తున్నారు. స్వామివారి కల్యాణానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు .రాష్ట్ర ప్రభుత్వం అన్నవరం, అంతర్వేది, కోటిపల్లి కళ్యాణo లను స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించింది .తాజాగా వాడపల్లి కళ్యాణo ని కూడా నోటిఫై చేయడంతో ఈ కళ్యాణo కోసం వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి కోట్ల రూపాయల నిధులు డిపాజిట్ చేసుకునే స్థాయికి ఎదిగింది. శనివారం 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు వస్తారు. మిగిలిన రోజుల్లో 10 వేల మంది వరకు భక్తులు ఉంటారు. నేడు సమాజంలో భక్తి పెరిగింది .దేవుడు మహత్యంకు భక్తులు వస్తున్నారు. అలాంటిది ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ మార్మోగి పోవడంతో లక్షలాదిగా భక్తులు వాడపల్లికి వస్తున్నారు ఈ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల గా ప్రసిద్ధి గాంచింది. స్వామి వారి మహత్యం ప్రపంచానికి తెలియడం లో మీడియా ముఖ్యంగా డిజిటల్ మీడియా పాత్ర ఎంతో ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు లేవు: