13, ఏప్రిల్ 2022, బుధవారం

శనీశ్వరునికి పట్టిన శని*

 P*శనీశ్వరునికి పట్టిన శని*

🌹🌹🌹🌹🌹🌹


ఎవరి జాతకంలో నైనా శనీశ్వరుడు ఏడున్నర  సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని *ఏలిన నాటి శని* అంటారు. ఆ ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పని సరిగా వుంటుంది.


ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయంలో శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.


వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు ఆ బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు.


అప్పుడు శనీశ్వరుడు శ్రీరాముని వద్దకు వచ్చి "నేను హనుమంతుని పట్టుకొనే కాలం వచ్చింది" అని అనుమతి అడిగాడు. "నన్నెందుకు అనుమతి అడగడం. నీ విధిని నీవు చెయ్యి" అని అంటాడు శ్రీరాముడు.


నేరుగా హనుమంతుని వద్దకు వెళ్ళిన శని "నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండ బోతున్నాను" అన్నాడు. "నేను రామ కార్యంలో నిమగ్నమై యున్నాను. ఇపుడంత కాలం కుదరదు" అన్నాడు హనుమంతుడు.


"అయితే ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు వుంటాను.. సరేనా" అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. "ఏడున్నర వారాలు" అంటూ కాల ప్రమాణం తగ్గించాడు శనీశ్వరుడు.


హనుమ రామ నామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు గంటల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు. అదే అదనుగా శని "నీ కాళ్ళలో ప్రవేశించనా" అని అడిగాడు. 

హనుమంతుడు "వద్దు, సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి".


"సరి, నీ చేతులు పట్టుకోనా." రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు. "అయితే, నన్ను ఏం చెయ్యమంటావు? నీ భుజాల పైన ఎక్కమంటావా"...


"రామ లక్ష్మణులను నా భుజాల మీదనే కదా ఎక్కించుకుని తీసుకువెళ్ళేది, అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు" అన్నాడు హనుమంతుడు. "పోనీ.. నీ  హృదయం."


"హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయిన తల్లి సీతాదేవి, నా శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ వున్నారు. అక్కడ నీకు చోటు లేదు" అన్నాడు హనుమ.


"సరే.. చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను" అని హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు శని.


హనుమంతుడు పెద్ద పెద్ద బండ రాళ్లను తన శిరస్సుపై (అంటే శనీశ్వరుని మీద) పెట్టుకుని సముద్రంలో వేయడం మొదలెట్టాడు. ఆ బండ రాళ్ళ బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేసి, ఊపిరి సలపక గిలగిల లాడాడు.


మరుక్షణం హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకి "మారుతీ... నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు. నిన్ను నేను పట్టలేను" అంటూ  చేతులెత్తేసి వెనుతిరిగాడు శనీశ్వరుడు.

🌹🌹🌹🌹🌹🌹


*నిర్మల భక్తితో, నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై యున్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు.*


*పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామ నామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది.*

🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: