21, మే 2022, శనివారం

హనుమజ్జయంతి

 ॐ హనుమజ్జయంతి ప్రత్యేకం - 2

       (ఈ నెల 25వ తేదీ హనుమజ్జయంతి) 

  

2. హనుమ - వాయు పుత్రుడు.  


    రావణ వధకై, బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి, 

    విష్ణువు - దశరథుని తండ్రిగా చేసికోవడానికి ఇష్టపడ్డాడు. 

    అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో 

    "అవతరించే విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులూ కామరూపులూ అయి, మీ మీ శక్తులు కలిగియుండేలాగు పుత్రులను సృజింపుడు" అన్నాడు. 

   "ఎలుగుబంటులలో శ్రేష్థుడైన జాంబవంతుని తాను చాల క్రితమే సృజించాను" అని కూడా అన్నాడు. 


    అప్పుడు 

1, ఇంద్రుని వల్ల - వాలి,

2. సూర్యుని వలన - సుగ్రీవుడు, 

3. బృహస్పతి వల్ల - తారుడు, 

4. కుబేరుని వలన - గంధమాదనుడు, 

5. విశ్వకర్మ వలన - నలుడు, 

6, అగ్నీ వలన - నీలుడు, 

7, అశ్వినీ దేవతల వల్ల - మైంద ద్వివిదులు, 

8. వరుణుని వలన - సుషేణుడు,

9. పర్జన్యుడని వలన - శరభుడు, 

10. వాయువు వల్ల - హనుమ జన్మించారు. 


    పరాక్రమాలు గల అనేకమంది - గోలాంగూల (కొండముచ్ఫు) స్త్రీలయందూ, ఋక్ష స్త్రీల యందూ, కిన్నర స్త్రీలయందూ జన్మించారు. 


    ప్రధానంగా పైన పేర్కొన్న పదకొండు మందీ, పదకొండు విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులు కలిగి, ఆయావిభాగాలలో నిష్ణాతులు.  


    ఒక భారీ పథకము (Project) చేపట్టేటపుడు కావలసిన 11 ముఖ్య విభాగాలైన 


ప్రణాళిక(Planning), 

వ్యవస్థీకృత కార్మిక రంగం(Organised working sector), 

కుశాగ్రబుద్ధి కలిగిన పరిపాలన(Correct decisive administration), , 

మేధస్సు(Intellect), 

ఆర్థికం(Finance), 

నిర్మాణం(Archetech), 

చైతన్యం(Activeness), 

ఆరోగ్యం(Health), 

నీరు(Water), 

దాపరీకం(Secrecy), 

సర్వజ్ఞత(All round) అనేవి ప్రధాన విషయాలు. 


    అటువంటి వాటికి సంబంధించి వారు "రావణ వధ" అనే ప్రత్యేక ప్రణాళిక(Operation)కి గాను వచ్చిన కారణజన్ములు. 


    అందులో వాయుపుత్రుడు ఒక ప్రత్యేకమైన వాడు. 

    వాయువు సర్వత్ర వ్యాప్తిచెంది, అందరకీ ప్రాణమైనది. అదే విధంగా వాయుదేవుని వలన జన్మించిన హనుమ, అందఱితోనూ అన్ని పనులలోనూ నేర్పుతో (all round) పని చక్కబెట్టగల్గినవాడు. 


    అంతేకాక, వాయువు 


(అ) సప్త మండలాలలో సప్త వాతస్కంధాలుగా కనబడుతుంది. 

(EXTERNAL - AT THE SPACE)


అవి


(i) మేఘమండలం - ఆవహము, 

(ii) సూర్యమండలం - ప్రవహము, 

(iii) చంద్రమండలం - సంవహము, 

(iv) నక్షత్రమండలం - ఉద్వహము, 

(v) గ్రహమండలం - వివహము, 

(vi) సప్తర్షిమండలం - పరివహము, 

(vii) ధ్రువమండలం - పరావహము 

                - అని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అధిష్ఠానదేవతగా ఉంటుంది. 

    అందుకనే వాయుపుత్రుడైన హనుమ అంతరిక్ష సంచారాన్ని అలవోకగా చేస్తాడు. 

    ఆకాశమార్గంలో సముద్ర లంఘనం, సంజీవని పర్వతం పెకలించి తీసుకురావడం, తిరిగి యథాస్థానంలో ఉంచడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. 


(ఆ) శరీరంలో 

      (INTERNAL - WITH IN THE BODY) 


అవి


    హృదిలో - ప్రాణ, 

    గుదిలో - అపాన, 

    నాభి వద్ద - సమాన, 

    కంఠంవద్ద - ఉదాన, 

    సర్వశరీరమందు - వ్యాన 

                - అనే ఐదు వాయువులు అంతర్గతంగా అందరికీ జీవాధారంగా పనిచేస్తాయి. 

    వాయునందనుడు ఈ ఐదు వాయువులతోనూ శారీరకంగా అద్భుతాలు చేసినవాడు కదా!


    ఈ విధమైన కార్యాలవలనే, విభీషణునితో జాంబవంతుడు


      "హనుమ జీవించియున్నచో వానరసైన్యము హతమైననూ బ్రతికియున్నట్లే! 

       మారుతి ప్రాణాలు విడిస్తే, మనమందరమూ బ్రతికియున్ననూ మరణించినవారితో సమానమే!" 


                - అని వాయుపుత్రుడైన హనుమ గూర్చి అనగలిగాడు. 


వాయువు: 


    "గంధనం హింసనం యో వాతి చరాచరం జగద్ధరతి బలినాం బలిష్ఠః స వాయుః" - అని వాయు పదానికి నిర్వచనం. అంటే, 

  - చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపచేయువాడునూ, బలవంతులకంటే బలవంతుడునూ అవడం వల్ల దానికి "వాయువు" అని పేరు అని అర్థం. 


    వాయుపుత్రుడుగా హనుమ శ్రీరామునికి ప్రీతిపాత్రుడై, మనందరికీ ఇష్టమైన "ఇహలోక రక్షకుడు". 

                      


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: