7, జనవరి 2023, శనివారం

పరమాచార్య

 ఆచార్య - పరమాచార్య


శతాబ్దాలుగా మన పుణ్యభూమి భారతదేశం ఎందఱో ఆచార్యులకు, సాధువులకు, సన్యాసులకు, మహాత్ములకు జన్మను ఇచ్చింది. అటువంటి వారి పాద రజస్సు చేత, లోతైన జ్ఞనము చేత, తపస్సు చేత, పాండిత్యము చేత దశాబ్దాల పాటు ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారందరికీ నా సాష్టాంగ ప్రణామాలు.


ఈ ప్రపంచం కాని, మన భారతదేశం కాని ఎన్నడూ చూడని గొప్ప సాధు సత్పురుషులు పూజ్య జగద్గురు శంకరాచార్య పరంపరలో వచ్చిన కంచి కామకోటి పీఠం 68వ పీఠాదిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు. మనకు తెలిసినంతలో 87 సంవత్సరాల పాటు పీఠాదిపతిగా ఉన్నవారు బహుశా ఎవరూ లేరు. అతి చిరు ప్రాయంలో 13 సంవత్సరాల వయస్సులో సన్యసించి జగద్గురు స్థానాన్ని అలంకరించి, 87 చాతుర్మాస్యాలను చేసి తమ నూరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న వారు కూడా ఎవరూ లేరు.


దాదాపు 25 శాతబ్దాలకు పూర్వం సాక్షాత్ శంకరుడే కేరళలోని కాలడిలో శ్రీ ఆది శంకర భగవత్పాదులుగా ఈ భూమిపై వెలసి, 72 అవైదిక మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిస్తాపించి, సనాతన మతమును ఉద్ధరించారని మనకు చెరిత్ర తెలుపుచున్నది. శతాబ్దాల తరువాత మరలా వైదిక మత స్థితిని, సమసిపోతున్న మానవతా విలువలను చూసి, ఆదిశంకరులే మరొక్కసారి అవతరించాలని నిర్ణయించుకున్నారు. మన పరమాచార్యుల వారి జీవితము, బోధలూ కూడా భగవాన్ ఆది శంకరులకు సమము. మన అదృష్టం ఏమిటంటే మనం జీవించిన కాలము శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీపాదుల కాలము.


పరమాచార్యుల వారు నడిచే దైవం, జీవన్ముక్తులు, త్రికాలవేదులు. కేవలం భారతియులనే కాక, విశ్వ మానవాళిని అనుగ్రహించిన ఇరవైవ శతాబ్దపు అవతారం. విశ్వ ప్రజల బాధలను, ఆర్తిని తీర్చడానికి వచ్చిన సమతామూర్తి. వారిపై వచ్చిన గ్రంథాలు అనేకం. కానీ అవన్నీ ఎప్పటికి అసంపూర్ణములే, ఎందుకంటే ఒక శతాబ్దపు జీవితాన్ని, బోధలను వ్రాయడానికి ఆ శతాబ్దపు జీవితాలన్నీ కూడా సరిపోవు.


మా తాతముత్తాతల ఆశీస్సుల వల్ల 1954లో కలవైలో నాకు వారి ప్రథమ సందర్శనం కలిగింది. అప్పటినుండి నలభై ఏళ్లుగా ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జివితపాఠాలు నాకు ప్రసాదించారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో వేలసార్లు స్వామిదర్శనం చేసుకున్నాను. వాటిలో ఎన్నో మరపులేని మరపురాని మధురస్మృతులు.


1967లో పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని ఏలూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు. మేము ఒక యాభై మందిమి కలకత్తా నుండి స్వామివారికి భిక్షావందనం సమర్పించడానికి వచ్చాము. మాతో రావడం కుదరక కలకత్తాలో ఉన్న భక్తులకోసమై మహాస్వామివారి సందేశాన్ని రికార్డ్ చేసి సాయింత్రం వెళ్ళే కలకత్తా రైలుకి నాతో తీసుకుని తిసుకునివేళ్ళాలని భిక్షావందనం రోజు తెల్లవారుఝామున ఒక సేవకునితో చెప్పాను.


మద్యాహ్నం మూడున్నర ప్రాంతంలో నను శ్రీవారు రమ్మన్నారు. కాని ఐదు ముప్పావు తరువాత కాని నాకు స్వామివారి పిలుపు రాలేదు. మిగిలినవారందరినీ సాయింత్రం రైలుకు కలకత్తా వెళ్ళమని చెప్పి, నేను నా భార్య మరుసటిరోజు వెళ్దామని అక్కడే ఉండిపోయాము.

అపార కరుణాసముద్రులైన స్వామివారు మాకోర్కే మన్నించి టేప్ రికార్డర్ లో రికార్డు చేయబడిన సందేశాన్ని మాకు అనుగ్రహించారు.


కలకత్తాలో మా అందరి గురించి అడిగారు. దాదాపు 6-45 గంటలప్పుడు “కలకత్తాకి ఎప్పుడు వెళ్తున్నారు?” అని మమ్మల్ని అడిగారు. ఆరోజు 6-30 ట్రైనుకే మేము కలకత్తా వెళ్ళవలసి ఉందని, కాని ఆ ప్రయాణం కంటే మాకు స్వామివారి సందేశం చాలా ముఖ్యమని, మా ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నామని వినయంతో స్వామివారికి చెప్పాను.


మహాస్వామివారు సన్నటి నవ్వుతో, “వెళ్ళు, వెళ్లి ప్రయత్నించు. బహుశా ఈరోజు రైలు ఆలస్యంగా రావచ్చు” అని అన్నారు. వెంటనే నా భార్యతో కలిసి పరుగు పరుగున స్టేషనుకు చేరుకుంటే, ఆరోజు మేము వెళ్ళవలసిన రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది. ఆ రోజు రైలు ఆలస్యంగా నడుస్తోందని ఆ జివన్ముక్తులకు తెలుసు. కాని అలా చెప్పక “వెళ్ళు, దొరకవచ్చేమో” అని అన్నారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “కైంకర్య శిరోమణి” డా. యస్.వి. నరసింహన్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: