25, జూన్ 2023, ఆదివారం

వేదాద్రి

 🕉  మన గుడి :


🔆 కృష్ణా జిల్లా : " వేదాద్రి "






👉 శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం


💠'  వేదాద్రి ' వేదాలని నిక్షిప్త్రం చేసిన పర్వత పర్వత ప్రదేశం కాబట్టి .. వేదాద్రిగా ప్రాచూర్యం పొందింది ..


💠 ప్రశాంతమైన అరణ్య మధ్యమున, కృష్ణవేణి తరంగ నాదములతో ప్రకృతి సహజసిద్ధ సౌందర్యములను నిండుగా అలంకరించుకొని భక్తకోటి ముక్తియే 'వేదాద్రి'గా అలరారుతోంది.

క్రిష్ణా నది తీరంలో  కొలువు దీరిన

అత్యంత మహిమలు గల ఈ దేవాలయం ... విజయవాడకు 60 కిలో మీటర్ల దూరం లో ఉంది .

ఒక్కసారి ఇక్కడి నర్సింహా స్వామిని దర్శించికుంటే మానసిక 

ప్రశాంతత చేకూరుతుంది


💠 కృష్ణా నదీ తీరాన వున్న పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి వేదాద్రి.  ఇది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకి సమీపంలో వున్నది.  

మిగతా నాలుగూ వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, మంగళగిరి. 


🔔 స్థలపురాణం 🔔


💠 క్షేత్రం వెనక ఉన్న పురాణ గాధ

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. 

పూర్వకాలంలో బ్రహ్మదేవుని నుండి వేదాలను సోమకారసుడను రాక్షసుడు తస్కరించి సముద్రమందు దాక్కున్నాడు. 

బ్రహ్మ తన జనకుడైన శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్ళి, జరిగింది వివరించి, వేదాలను తిరిగి అనుగ్రహించాలని ప్రార్థించాడు. భక్తవత్సలుడైన నారాయణుడు మత్స్యావతారం ధరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను కాపాడాడు. 

వేదాలు పురుష రూపం ధరించి "దేవా! మమ్ము కరుణించి తరింప జేయుము” అని ప్రార్థించగా, నేను హిరణ్య కశపుణ్ణి సంహరించడానికై నృసింహావతారం ధరిస్తాను. అప్పుడు మీ శిరస్సులపై నేను పంచమూర్తియై మీ శిరస్సులపై నివసిస్తాను. అప్పటి వరకు మీరు కృష్ణవేణి గర్భంలో సాలగ్రామ స్వరూపంలో ఉండండి. మీవలెనే కృష్ణవేణి కూడా ప్రతిరోజు నన్ను అభిషేకించాలని ప్రార్థిస్తోంది. 

ఆమె కోరిక కూడా ఈ విధంగా తీరుతుంది". అని అనుగ్రహించగా వేదాలు ఎంతో సంతోషించి, సాలగ్రామ రూపంలో కృష్ణా నదిలో వుండసాగాయి.


💠 అనంతరం నారాయణుడు నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని 

 సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.

ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వామి. ఈ క్షేత్రం పంచనారసింహ 

(జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనృసింహామూర్తుల) క్షేత్రమైన వేదాద్రిగా పిలువబడుచున్నది.


🔅 1. శ్రీ జ్వాలా నరసింహస్వామి -- స్వయంభూ -- శిఖర స్ధితి (ఆలయం పక్కనుంచి మెట్లు కనబడతాయి)


🔅2. శ్రీ సాలిగ్రామ నృసింహ స్వామి --

 బ్రహ్మ ప్రతిష్ఠ -- కృష్ణానదిలో (ఆలయంలో నుంచి కూడా చూడవచ్చు)


🔅3. శ్రీ వీర నృసింహ స్వామి -- 

స్వయంభూ -- గరుడాచలం (ఇక్కడికి 5 కి.మీ.ల దూరంలో)


🔅4. శ్రీ యోగానంద స్వామి – త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించినది --మూలవిరాట్, గర్భాలయం


🔅5. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి -- 

మూలవిరాట్ పీఠం – లోక కళ్యాణార్ధం ప్రతిష్ఠింపబడ్డది.


 

💠 యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడినది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.


💠 గుడిలో స్వామితోబాటు చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక మందిరాలు వున్నాయి. క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామికి మరియు నవగ్రహాలకు కూడా ఉపాలయములు ఉన్నాయి.


💠 కలియుగ ప్రారంభంలో కరువుకాటకాలు ఏర్పడటంతో ఋషులంతా వ్యాసుడి బోధతో కృష్ణానదీ తీరమున పంచనారసింహ క్షేత్రం కలదని, అక్కడ తపస్సు చేస్తే ముక్తి సాధ్యమవుతుందని విని, అక్కడికి వస్తుండగా, దారిలో నదీతీరం వెంబడి సుస్వరోచ్చారణమున వేదమంత్రాలు వినబడ్డాయి. ప్రకృతే ఆవిధంగా వేదాలను పఠిస్తోందని తెలుసుకుని, ఆశ్చర్యపోయారు. సమీపంలోని ఒక పర్వతం నుండే ఈ ధ్వని వినిపిస్తోందని నిశ్చయించుకొని, ఆ పర్వతానికి ప్రదక్షిణలు చేసారు. “ఋషులారా! ఇదే వేదగిరి. ఇందు శ్రీమన్నారాయణుడు నృసింహరూపంలో ఆర్చామూర్తియై వెలసినాడు. వెళ్ళి వారిని సేవించండి” అనే అశరీరవాణి మాటలు వినబడ్డాయి. వారు అట్లే వెళ్ళి స్వామివారిని కనుగొని, సేవించి తరించారు.


💠 ఈ దేవాలయాన్ని ఎఱ్ఱాప్రగడ, శ్రీనాథుడు, నారాయణతీర్థులు తదితర మహానుభావులు దర్శించి. పునీతులయ్యారు.



💠 ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది.

విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.


💠 ఈ స్వామిని సేవిస్తే గ్రహబాధలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయట. 


💠ఇక్కడ సౌకర్యాలు ఎక్కువ వుండవు.  

బస, భోజనం జగ్గయ్యపేటలో అయితే ఇబ్బందిలేకుండా వుంటుంది. 

దేవుడికి పూలమాలలు సమర్పించాలనుకుంటే జగ్గయ్యపేటనుంచి

తీసుకువెళ్ళండి. అలంకరిస్తారు. గుడి దగ్గర దొరకవు.

కామెంట్‌లు లేవు: