14, ఆగస్టు 2023, సోమవారం

*ప్రాచీన భారతంలో మజ్జిగ వాడకం.*

 *ప్రాచీన భారతంలో మజ్జిగ వాడకం.*


*ఒకనాడు ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు, గేదెలు, పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్నా ఇంటినిండా కుండలనిండా ఎంత పెరుగు ఉన్నా ఆనాటి కుటుంబసభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడేవారు కాదు. ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగును చిలికి పూర్తిగా వెన్న తీసి తగినన్ని మంచినీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించేవారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.*


*కాని కమ్మని గడ్డ పెరుగును వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగను తాగడంలో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు. ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం.*


*ఆధునిక భావ బానిస భారతంలో - పెరుగు వాడకం*


*ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. రోజూ రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు. పెరుగును చిలికి వెన్న తీసి మజ్జిగను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి. కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నములో పెరుగును కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసిపోతున్నారు.* 


*అయితే పెరుగు ఆయుక్షీణం*. 


*ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు. అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాతరోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు. అయినా రోజరోజుకు కష్టపడి పనిచేసే స్వభావం కోల్పోతూ, బద్ధకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగను తయారుచేసి వాడడం కన్నా పెరుగును వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.*


*మజ్జిగ  5 రకాలు* 


*1. మధితము అనే మజ్జిగ: పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగను మధిత మజ్జిగ అంటారు. ఇది చిక్కగా జిడ్డుగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారంలో వాడుతూ ఉంటే నీరసం , ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుకకు రుచి తెలియక పోవడం, మూత్రము ఆగిపోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఈ రకమైన మజ్జిగను గ్రీష్మ, శరత్, హేమంత, శిశిర బుుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు.*


*2. మిళితమను మజ్జిగ : పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిళిత మజ్జిగ అనబడుతుంది. ఇది శరీరంలో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది. ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది.*


*3. గోళము అను మజ్జిగ : ఒకవంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది. ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మంచి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని విష దోషాలు మేహము ప్రమేహము కఫరోగము ఆమరోగము పోగొడుతుంది. ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ, వర్ష బుుతువులయందు తీసుకోవాలి.*


*4. షాడభము అను మజ్జిగ : ఒకవంతు పెరుగు అయిదువంతుల నీళ్ళు కలిపి తయారుచేసింది . ఇది శ్లేష్మరోగాలను , గుల్మరోగాలను, రక్తమూలవ్యాధిని పోగొడుతుంది. తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది.*


*5. కాలశేయము అను మజ్జిగ: ఒకవంతు పెరుగు రెండువంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది. ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూలవ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది.*

కామెంట్‌లు లేవు: