3, నవంబర్ 2023, శుక్రవారం

మనలను రక్షించుగాక

 సంస్కృతసాహిత్యంలో రిపార్టీ కవితా ప్రక్రియ

                                 ( Repartee in Sanskrit Literature)

                                              డాక్తర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు


సంస్కృతసాహిత్యం ఆకాశం కంటే విశాలమై౦ది, సముద్రం కంటే లోతై౦ది . ఎ౦దుకంటే  సంస్కృతసాహిత్యం అన్ని ప్రాచీనసాహిత్య ప్రక్రియలకు నిధి అవడమే కాకుండా అన్ని ఆధునికసాహిత్యప్రక్రియలకు కూడ మాతృకగా కనిపిస్తోంది. అది ప్రాచీనంలో ప్రాచీనం ఆధునికంలో ఆధునికం . ఇక ఆంగ్ల సాహిత్యంలో Repartee అనే ఒక సాహిత్య ప్రక్రియ ఉంది . రిపార్టీ అంటే  Ready reply అని A witty reply అని Talk characterized by clever and witty replies. ‘అని నిర్వచిస్తారు .


సాధారణంగా మానవులలో ఇతరులను ఆక్షేపించే స్వభావం ఎక్కువగా కనిపిస్తుంది . ఏదో వంక పెట్టుకుని ఎక్కడో అక్కడ ఎవరో ఒకరిని ఆక్షేపిస్తూనే ఉంటారు . ఆక్షేపణలు  సహించలేని వాళ్ళు తగిన సమాధానం చెబుతూనే ఉంటారు .   

ఈ ఆక్షేపణ ముఖ్యంగా మూడు స్థాయిల్లో ఉంటుంది . కొంతమంది వేళాకోళంగా ఇతరులను ఆక్షేపిస్తూ ఉంటారు, వారి మనస్సుల్లో ఎటువంటి చెడు ఉద్దేశం ఉండదు. మరికొంత మంది మనస్సులో ఒకటి పెట్టుకుని ఇతరులను ఆక్షేపిస్తూ ఉంటారు. మరికొంతమంది సూటిగా కఠినంగా ఆక్షేపిస్తారు . ఎవరు ఏస్థాయిలో, ఎంత మోతాదులో , ఏ విధంగా ఆక్షేపిస్తే వారికి ఆ స్థాయిలో అంతే మోతాదులో ఆ విధంగా సమాధానం చెప్పడం Repartee అనుకోవచ్చు  . ఈ విధంగా మృదువు , కఠినం , అతికఠినంగా చేసే ఆక్షేపణలు దానికి తగిన సమాధానాలు సంస్కృత సాహిత్యంలో కోకొల్లలు . అవి ఎలా ఉంటాయో స్థాలీపులాక న్యాయంగా కొన్నిటిని పరిశీలిద్దాం .


                                ఆది దంపతులైన  పార్వతీ పరమేశ్వరుల చిలిపి సంభాషణలు , వేలాకోలాలు జగత్ప్రసిద్ధాలు . పార్వతి వాస్తవానికి అచలపుత్రికే అయినా చలచిత్తం కలది. చాల చిలిపిది. ఒకనాడు సరదాగా తన   భర్తను ఒక ఆటపట్టిద్దామనుకుంది . కాని ఆయన తనకంటే  తెలివైన వాడని మాత్రం ఊహించలేక పోయింది పాపం.  ఏమండి ! నాకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా మీకు అమ్మానాన్నలెక్కడున్నారో చూపించండి అంది కొంటెగా. శివుడు దానికి సమాధానంగా  ఓహో అదా ! నాకు అత్తా మామ ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా నీకు అత్తా మామలు ఎక్కడున్నారో చూపించు  అన్నాడు నవ్వుతూ. ఏ౦ చూపిస్తుంది ? వెంటనే ఉడుక్కుంటూ బుoగమూతి పెట్టి ఆయన ఒడిలోకి  వంగి వాలిపోయి ఉంటు౦దని ఊహిద్దాం. ఈ విధంగా పార్వతి కొంటె ప్రశ్నకు తగిన సమాధానం చెప్పిన ముక్కంటి మాటలు మనల్ని రక్షించుగాక


క్వ  తిష్ఠత: తే పితరౌ మమేవే త్యపర్ణయోక్తే పరిహాసపూర్వం

క్వ వా మమేవ శ్వశురౌ తవేతి తామీరయన్ సస్మితమీశ్వరోsవ్యాత్


ఇప్పుడు ఎంతో స్నేహం గల ఇద్దరు యువతులమధ్య వేళాకోళం (ఆక్షేపణ సమాధానం ) ఎంత అందంగా ఉంటుందో చూద్దాం.


                                                   ఒకసారి శివకేశవులిద్దరూ తమ భార్యలతో ఒక చోట సమావేశమయ్యారు. ఒక ప్రదేశంలో శివకేశవులులిద్దరూ కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. మరొక ప్రదేశంలో   లక్ష్మీపార్వతులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పార్వతి లక్ష్మితో  ఏమమ్మా! చంచలమైనదానా! నిన్నోమాటడుగుతాను సమాధానం చెబుతావా? అంది . సరే అడగవమ్మా! శివుని పెళ్ళామా! అoది లక్ష్మి . మీనాన్న ఎవరు? అంది పార్వతి . వెంటనే లక్ష్మి సముద్రుడు అని సమాధానం చెప్పింది. వెంటనే పార్వతి ఊరుకోవమ్మా! ఎవరు నమ్ముతారు. నీళ్లకెక్కడైన పిల్లలుపుడతారా! నేను నమ్మను గాక నమ్మను అంది. ఓహో! సరేలే!  నువ్వు నమ్మకపోతేమానెయ్యి. పర్వతాలకు పిల్లలు పుట్టగాలేంది సముద్రానికి మాత్రం పిల్లలు పుట్టరా ఏంటి? అంది . అది    ఎవరు నమ్ముతారో వాళ్లే ఇది  కూడా నమ్ముతారులే అని లక్ష్మి సమాధానం చెప్పింది . నువ్వు పర్వతం కూతురవైనప్పుడు నేను సముద్రం కూతుర్ని ఎందుకు కాకూడదు అని లక్ష్మి సమాధానం లోని అంతరార్థం.

ఈ విధంగా పరస్పరం వేళాకోళాలాడుకుoటున్న లక్ష్మీపార్వతుల సరససల్లాపాలను వింటూ హరిహరులు లోలోపల ఎంతో  ఆనందిస్తున్నారట . అటువంటి ఆ శివకేశవుల ఆనందం మన విఘ్నాలు పోగొట్టి మనలను రక్షించుగాక అని ఒక కవి అందమైన శ్లోకం వ్రాశాడు.


లోలే! బ్రూహి కపాలికామిని ! పితాకస్తే? పతి: పాథసాం

క: ప్రత్యేతి జలాదపత్యజననం? ప్రత్యేతి య: ప్రస్తరాత్

ఇత్థం పార్వతిసింధురాజసుతయోరాకర్ణ్యవాక్చాతురీo

సంస్మేరస్య  హరేర్హరస్య చ ముదో నిఘ్నంతు విఘ్నం తు వ:  

    

ఇవి కేవల వేలాకోలపు మాటలు వానికి తగిన సమాధానాలు .ఇపుడు కొంచె0 మోతాదు మించిన ఆక్షేపణలు దానికి తగిన సమాధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం


                                                                  మనం ఎంత గొప్ప వాళ్లమైనా కావొచ్చు గాని ఇతరుల్ని కించపరిస్తే అది మనకు ముప్పు తెచ్చి పెడుతుంది. ఒక్కొక్కప్పుడు మన అస్తిత్వానికే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఆత్మశ్లాఘ ఎంత ప్రమాదమో పరనింద అంతకంటే ఎక్కువ ప్రమాదం.అందువల్ల మనం ఎంత ఉన్నతంగా ఉన్నామో అంత అణకువగా కూడ ఉండడం నేర్చు కోవాలి. లేకపోతే సమాజమే మనకి గొప్ప గుణ పాఠం చెబుతుంది. ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి.

ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి, ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్శ్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు, డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మికి అనుకోకుందా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.

"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది.  శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది. పార్వతి కి ఈ ప్రశ్న చాల బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుందిగాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి. ఎంచెప్పాలి? కొంచెం ఆలోచించింది.

"సుతను బలిమఖే " అంది. 'బలి చక్రవర్తి  చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం. ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తలతిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు తనభర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే.  ' మా ఆయనే కాదు మీ ఆయన కూడా ముష్టివాడే, మా  ఆయనకన్నా మీ ఆయనే దారుణం. కేవలం మూడడుగుల నేలకోసం ముష్టివాడయ్యాడు ' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.

తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం. మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.

మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు మీఆయన కూడ నాట్యం చేస్తాడు. ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం. పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో సంబాళించుకుంది. ఈ సారి తనకు ఇబ్బంది లేని విధంగా మాట్లాడాలనుకుంది.

క్వనుచ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది. మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరంలేదు. ' మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం . పార్వతి చాల నొచ్చు కుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది.

నైవ జానే వరాహం అని .“ ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది.

బాలే! కచ్చిన్న దృష్ట : జరఠ వృషపతి: ? అనడిగింది. ' మీ వాహనం, అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. ' మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం. మీరు నేలపై తిరుగుతారు. మీ వాహనం ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే వెంటనే అందుకుంది.

"గోప ఏవాస్య వేత్తా " అంది. ' ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా? పో మీఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది. మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.

నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ. ఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు. వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడోకవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.


భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?

మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం

బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా

లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయో: త్రాయతాం న :



                                 పెళ్లంటే కొంతమందికి నూఱేళ్ల పంట. మరి కొంతమందికి నూఱేళ్ల వంట . ఇంకా కొంతమందికి నూఱేళ్ల  పెంట. ఒకాయన తన స్నేహితునితో ' ఒరేయ్! నేను ఇంటికి వెళ్లే దాక నా భార్యాపిల్లలు భోజనమేచెయ్యరు' అన్నాడట. ఆ స్నేహితుడు చాలసంబరపడిపోతూ ' అబ్బా! నువ్వంటే నీ భార్యాపిల్లలకు ఎంత ప్రేమరా! నువ్వు నిజంగా చాల అదృష్ట వంతుడివి' అని మెచ్చుకున్నాడట.  వెంటనే వాడు ప్రేమాకాదు దోమాకాదు. ఇంటికెళ్లి నేనే వంటచెయ్యాలి' అన్నాడట తాపీగా. నిజానికి మానవజీవితానికి వంటకి అవినాభావసంబంధం ఉంది.  కాబట్టి ఎంతటి బంగారు పళ్లేనికైనా గోడచేర్పు ఎలా అవసరమో ఎంతటి గొప్పమగాడికైనా వంట నేర్పు కూడ అంతే అవసరం

 ఒక విధంగా ఆలోచిస్తే దమయంతి  ఇంద్రాది దేవతలందర్ని త్రోసిరాజని సామాన్యుడైన నలమహారాజునే పెళ్లి చేసుకోడానికి ,  అలాగే ద్రౌపది పాండవుల్లో అందరికంటే భీముణ్ణే ఎక్కువగా ఇష్ట పడడానికి కారణం  వారికి గల  పాకశాస్త్ర ప్రావీణ్యమే అని అనిపించక మానదు.  ఏది ఏమైన she  లో he ఒదిగి నట్లుగా  woman లో  man  ఒదిగినట్లుగా వంటపనిలో  పురుషుడు భార్య వెనుక ఒదిగే ఉంటున్నాడు. వంట చెయ్యనంటే జీవితంలో మిగిలేది పెంటే.

వంట పేరుతో తమ  జీవితాల్ని పెంట పాలు చేసుకున్న ఒక జంట మధ్య  జరిగిన వాగ్వివాదం   ఇక్కడ పొందుపరచ బడింది.  సరదాగా చదువుకుని ఆనందించండి. ఇది చదివేక వంటరాని వారు కొద్దో గొప్పో వంట నేర్చుకోండి. కనీసం వంటచేసేవారికి సహాయసహకారాలు అందజెయ్యండి.


ఒకాయన  పాపం ఎప్పుడూ ఇంట్లో  ఆయనే వంట చేసేవాడు. అనుకోకుండా ఒకరోజు పొరుగూరు వెడుతూ ఆపని భార్యకు పురమాయించాడు. ఆమె అయిష్టంగానే తలూపింది

తిరిగి తిరిగి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు. కడుపు నకనక లాడుతోంది. వంటచేశావా? అన్నాడు. వెంటనే 'నో'' అంది. అసలే ఆకలితో ఉన్నాడేమో ఒళ్లు మండి పోయింది.

పాపాత్మురాలా! వంట ఎందుకుచెయ్యలేదే ? అన్నాడు.

ఏంటి నేను పాపాత్మురాలనా! కాదు మీనాన్నే పాపాత్ముడు అంది.

ఏమే తప్పుడుదానా ఏంటి వాగుతున్నావు అన్నాడు.

ఆ పదం  మీఅమ్మకి మీచెల్లి కి వర్తిస్తుంది నాక్కాదు అంది.

వెంటనే ఈ ఇంట్లోంచి బయటికి పోవే  అన్నాడు .

 ఇది నీ ఇల్లు కాదు పొమ్మనడానికి నీకు హక్కు లేదంది.

భగవంతుడా ! నాకు కనీసం చావునైన  ప్రసాదించవయ్యా అన్నాడు .

ఆవిడ కూడ తక్కువదేమీకాదు. 'మీలో తప్పుంటే మీరు పోతారు నాలో తప్పుంటే నా మాంగళ్యం పోతుంది ' అనేంతటి  గొప్ప ఇల్లాలు .   అందుకే  ఏమీ తడుముకోకుండా  నాకంత అదృ ష్టమా అంది.   ఇంతటి భీకరమైన వాగ్వివాదం తనలో పొందుపరచుకున్న ఈ మనోహర శ్లోకం చదవండి.


ఆ : పాకం న కరోషి పాపిని? కథం పాపీ త్వదీయ: పితా

రండే జల్పసి కిం? తవైవ జననీ రండా త్వదీయా స్వసా

 నిర్గచ్ఛ త్వరితం  గృహాద్బహిరితో నేదం త్వదీయం గృహం

హాహా ! నాథ ! మమాద్య  దేహి మరణం తావన్న  భాగ్యోదయ:


కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు వారిమనస్సు నొచ్చుకోకుండా

మాట్లాడగలగడం ఒక కళ. అది అందరు నేర్చుకోవాలి .                                     ............................

కామెంట్‌లు లేవు: