7, జులై 2024, ఆదివారం

మహా వాక్యాలు

 🙏మహా వాక్యాలు🙏

నాలుగు వేదాలలోనూ నాలుగు మహా వాక్యాలు చెప్పబడ్డాయి. వాటి గురించి సంక్షిప్త వివరణ ఇస్తున్నాను. ఈ మహా వాక్యాలు  మననం చేసుకోవాలి. ఇవే మోక్షదాయక మంత్రాలు 


ప్రజ్ఞానం బ్రహ్మ -- ఋగ్వేద మహావాక్యము

అహంబ్రహ్మస్మి -- యజుర్వేద మహావాక్యము

తత్త్వమసి -- సామవేద మహావాక్యము

అయమాత్మాబ్రహ్మ --  అథర్వణ మహావాక్యము


ప్రజ్ఞానం బ్రహ్మ


ఋగ్వేద మహావాక్యముగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రసిద్ధికెక్కినది.అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.


అహంబ్రహ్మాస్మి


యజుర్వేద మహావాక్యము ‘అహంబ్రహ్మాస్మి’.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.



తత్త్వమసి


సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’.

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చర్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.



అయమాత్మాబ్రహ్మ


నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యము ‘అయమాత్మాబ్రహ్మ’.

ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. 

ఈ నాలుగు వాక్యాలను నిత్యం మననం చేసుకోవాలి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: