18, ఫిబ్రవరి 2026, బుధవారం

పుణ్య,పాపకర్మలు

  


 ( పూర్వజన్మలో చేసిన పుణ్య,పాపకర్మలు, ఈజన్మలో సుఖ, దుఃఖాలను కలిగిస్తాయి - 

మహాభారతం, అనుశాసనిక పర్వంలోని "ఉమామహేశ్వర సంవాదం" )

                    

శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).

                            -----------------


పూర్వజన్మలో చేసిన ధర్మాధర్మములు, ఈ జన్మలో ఏ సుఖ, దుఃఖాలను కలిగిస్తాయో, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇలా తెలియజేస్తున్నాడు.


పార్వతీ దేవి: ఈశ్వరా! కొంతమంది గొప్ప విద్యావంతులు గాను, మేధా సంపన్నులుగాను ఉంటున్నారు.

కొంతమందికి ఎంత ప్రయత్నంచినా చదువు రావటము లేదు.

దీనికి కారణం ఏమిటి?


పరమేశ్వరుడు: పార్వతీ! పూర్వజన్మలో ఆచార్యునికి ఎంతో అడకువతో పరిచర్యలు చేస్తూ, విద్యా సముపార్జన చేసినవారు, 

తాము నేర్చిన విద్య యోగ్యులైన శిష్యులకు బోధించుటకు ఆత్ర పడిన మహితాత్ములు,

ఈ జన్మలో విద్యావంతులు, మేధావులు అగుచున్నారు.

పూర్వజన్మలో విద్యాగర్వంతో మదించి,సభలలో సాధువులను, విద్వాంసులను అవమానించిన అహంకారులు, ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా చదువు రానివారుగా ఉండిపోతున్నారు.


పార్వతి: కొంతమంది చక్కని ఆరోగ్యంతోను, అనుకూలంగా ఉండే భార్యా,పిల్లలతోను, ఐశ్వర్యంతోను సుఖిస్తున్నారు.

కొంతమంది దుష్టులైన పత్నీ పుత్రులతో, సదా "లేమి" తో, అనారోగ్యంతో, నిరంతరం దుఃఖిస్తున్నారు.

మహేశ్వరా! దయచేసి దీనికి కారణం తెలుపవలసింది?


పరమేశ్వరుడు: పూర్వజన్మలో ఎంతోమంది సత్పురుషులను మిక్కిలి ఆత్మీయతతో ఎన్నో విధములుగా ఆదరించిన మహనీయుడు ఈ జన్మలో ఆయురారోగ్య ధనసంపత్తితోను,అనుకూల దాంపత్యం తోను సుఖిస్తున్నాడు.

కామ,క్రోధ,లోభ,నాస్తికత్వములతో పరులను ఇనుమిక్కిలిగా పీడించిన దుర్మార్గుడు,ఈ జన్మలో దారిద్ర్యం, వ్యాధి, తనను ద్వేషించే భార్యా, పిల్లలతో దుఃఖిస్తున్నాడు.


పార్వతి: నాథా! పుట్టుగుడ్డి గాను,కర్ణ రోగములతోను,ఉదర రుగ్మతలతోను, మనిషి ఎందువల్ల బాధపడుతున్నాడు?


పరమేశ్వరుడు: సాధ్వీ! పూర్వజన్మలో అందగాడై, ఇతరుల పత్నులను ఆకర్షించి వ్యభిచరించిన పాపి పుట్టుగుడ్డిగా జన్మిస్తున్నాడు.

కటు వాక్యములతో సత్పురుషులకు మానసిక వ్యధ కలిగించినవాడు చెముడు మొదలైన కర్ణరోగములతో బాధపడుతున్నాడు.

విషభోజనం పెట్టి, ఇతరులకు హాని చేసినవాడు ఉదర రుగ్మతలతో దుఃఖిస్తున్నాడు.


పార్వతి: పరమేశ్వరా! మానవులనుభవిస్తున్న ఇతర దుఃఖములకు కూడా కారణములు తెలుపగలరు.


పరమేశ్వరుడు: మానినీ! పరదారలనుగాని, కన్యకను గాని, గేదె, గోవు, ఆడుగుఱ్ఱము, అనే జంతువులను గాని మదనాతురుడై అనుభవించిన దుర్మార్గుడు, నీరు పట్టిన శరీరముతో గాని,మధుమేహముతో గాని ఇనుమిక్కిలిగా దుఃఖించగలడు.

ఇతరులు కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని దొంగిలించిన వాడు ఆర్చుకు పోవడం అనే ఎండు రోగముతో అలమటించగలడు.

ఇతరుల శరీరములకు బంధనములతో గాని,దారుణాఘాతములతో గాని ,వికృతత్వం కలిగించిన దుర్మార్గుడు "కుష్టు"రోగముతో పీడింపబడుతాడు.

ఇతరుల కాళ్లు, చేతులు, విరిచి సహించరాని యాతన కలుగజేసిన పాపి, ఆయా అవయవ లోపములతో జన్మించి తీరని దుఃఖంతో అలమటించ గలడు.

ఇతరులను కాలితో తన్నినా,పరిశుభ్రత లేని పాదములతో దేవాలయములలో ప్రవేశించినా,తప్పక చరణ రుగ్మతలు ఏర్పడగలవు.

ఆహార పదార్థములను కల్తీ చేసి విక్రయించే వారు, తప్పుడు తూకములతో వ్యాపారంలో లాభాలు ఆర్జించిన పాపాత్ములు,

 'గూని' 'మరుగుజ్జుతనము' ' 'కాళ్లవ్యాధులు' మొదలైన రోగములతో అలమటించ గలరు.

విధాతకు ఎవరి యెడల ఆగ్రహం కాని, అనుగ్రహం కానీ లేవు.

మానవులు పూర్వజన్మలో ఆచరించిన పుణ్య పాపములనే ఈ జన్మలో సుఖ దుఃఖాలుగా తగు సమయంలో అనుభవిస్తున్నారు.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

18-2-'26

కామెంట్‌లు లేవు: