18, ఫిబ్రవరి 2026, బుధవారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*655 వ రోజు*

అన్నదమ్ముల విధులు

ధర్మరాజు " పితామహా ! ఈ లోకములో అన్నదమ్ములు ఎలా ప్రవర్తించాలో తెలియజెయ్యండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! చిన్న వాళ్ళయిన తమ్ములు పెద్ద వారైన అన్నల ఎడల భక్తి శ్రద్ధలతో మెలగాలి. అలాగే అన్నయ్యలు కూడా తమ తమ్ముల పట్ల వాత్సల్యముతో ప్రవర్తించాలి. తమ్ములలో ఒకడు బుద్ధిహీనుడైనా పరవాలేదు కాని అన్నమాత్రము బాధ్యతా యుతంగా ప్రవర్తించక ఉన్న ఆ కుంటుంబం నాశనం ఔతుంది. అన్నదమ్ములు తమలో తాము తగవులు వదిలి పెద్దలు ఇచ్చిన ఆస్తిని సమంగా పంచుకోవాలి. అలా చేసిన లోకము వారిని కీర్తిస్తుంది. అలా చేయక వారిలో ఏ ఒక్కడైనా స్వార్ధంతో అంతా స్వాధీనం చేసుకున్న ఆ కుంటుంబం చిన్నాభిన్నంమై అపకీర్తి పాలు ఔతుంది. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్నయ్య. ఆయన భార్య తల్లి తరువాత తల్లి వంటిది. తల్లి తండ్రుల మరణానంతరం అన్నవదిన తల్లి తండ్రులతో సమానము. అన్నదమ్ములు ఎవరైనా మిగిలిన అన్నదమ్ములకు ద్రోహం చేసిన అతడు శిక్షార్హుడు ఔతాడు. తల్లి తరువాత అక్క తల్లి వంటిది. చిన్నతనంలో తనకు పాలిచ్చి పెంచిన ఆయాలు దాదులు తల్లివంటి వారే. తండ్రి తొలి గురువు. తండ్రి గురువుకంటే పదింతలు పెద్ద. తండ్రి కంటే తల్లి పదింతలు పెద్దది. తల్లి తండ్రులు శరీరం ఇచ్చి ఈలోకలోకి తీసుకు వస్తారు. గురువు విద్యాబుద్ధులు నేర్పి మరుజన్మ ప్రసాదిస్తాడు. గురువు ఇచ్చినజన్మ అజరామరమైనది కనుక గురువు అధికంగా పూజించ అర్హుడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

ఉపవాస వ్రతము

ధర్మరాజు " పితామహా ! ఉపవాసవ్రతము బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే నిర్దేశింపబడింది. మిగిలిన వర్ణములకు కాదు అంటారు కదా ! పైగా ఎక్కువ ఉపవాసములు చెయ్యడం దోషము అంటారు కదా ! అసలు ఉపవాసము అంటే ఏమిటి ? దానికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటి ? ఉపవాసము వలన కలుగు ఫలితం ఏమిటి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నువ్వు అడిగినట్లే నేను అంగీరసుడు అనే మునీశ్వరుడిని అడిగాను. ఆయన చెప్పినది నీకు చెప్తాను విను. బ్రాహ్మణుడు, క్షత్రియుడు మూడు రాత్రులు ఉపవసించ వచ్చు. శరీరము సహకరించి అనారోగ్యము పాలుకాకున్న మరి కొన్ని రోజులు ఉపవశించ వచ్చు. వైశ్యులు, శూద్రులు నాలుగు పూటలు మించి ఉపవసించ రాదు. పౌర్ణమి, శుక్లపక్ష అష్టమి, చతుర్ధశి, శుక్లపక్ష పంచమి, షష్టి, అలాగే బహుళ పంచమి, షష్టి ఉపవాసముకు తగిన పర్వ దినములు. రోజుకు ఒక రోజు మాత్రమే తిని ఉపవాసము ఉండు బ్రాహ్మణుడికి అందమైన భార్య, సంతానం కలుగి ఐశ్వర్యవంతుడు ఔతాడు. ఇలా ఒక్క సంవత్సరము ఉపవాసము ఉన్న అతడికి ఈ లోకములోని సౌఖ్యములన్నీ పొందుతారు. ఎన్ని రోజులు ఉపవాసము ఉంటే అన్ని సౌఖ్యములు కలుగుతాయి. ఒక సంవత్సరములో 15 రోజులు ఉపవసించిన పుణ్యలోకప్రాప్తి కలిగుతుంది. ఒక మాసము ఉపవసించిన బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. కాని ఎవరూ సంవత్సరంలో ఒక మాసము మించి ఉపవసించ రాదు. యుగయుగానికి మనుష్యునికి ఉపవాస సామర్ధ్యము మారుతుంది కనుక వారి కాల ప్రమాణం అనుసరించి ఉపవాస దినముల సంఖ్య మారుతుంటుంది. తల్లిని మించిన గురువు, వేదముకు మించిన శాస్త్రము, ధర్మముకు మించిన లాభము లేదు. పవిత్రములైన వాటిలోక్లెల్లా బ్రాహ్మణుడు పవిత్రుడు. కనుక బ్రాహ్మణుడిని భక్తితో పూజించాలి. పూర్వము దేవతలు మునులు ఉపవాసధర్మము అనుసరించి గొప్పవాళ్ళు అయ్యారు. విశ్వామిత్రుడు తన జీవితమంతా ఏక భుక్త్వము చేసి బ్రాహ్మణత్వము పొందాడు. కనుక ఉపవాసముకు మించిన వ్రతము లేదు. ఉపవాసవ్రతము అనుసరించడం వలన మనసు శరీరము పవిత్రమౌతాయి. పైన చెప్పిన ఉపవాస ధర్మము లోకముకు అంగీరస మహర్షి అందించాడు. అంగీరసుడు చెప్పిన విధంగా వ్రతాచరణ చేసిన మానవుడికి పాపములు అంటవు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: