🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*మహాభారత కాలం నాటి పాశుపతాస్త్రం:*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
అతిశక్తివంతమైన ఒక అస్త్రం ఇది. తపస్సుతో శివుని మెప్పించి అర్జునుడు పొందాడు దీన్ని. అర్జునునికి శివుడు ఈ అస్త్రాన్ని ఇస్తూ "పాశుపతానికి అసాధ్యమైనది ఏదీలేదని, అయితే దాన్ని శక్తిహీనులపై ప్రయోగిస్తే లోకాన్ని తగలబెడుతుందనీ, అది అన్నివేళలా అందరిమీదా ప్రయోగించేది కాదనీ" చెప్పాడు. అస్త్రంగా ఇది మారణహోమాన్ని సృష్టించగలదు. అంతేకాదు, దేనినైనా నిర్ణీతస్థానానికి చేర్చే 'మిస్సైల్'గా కూడా పనికొస్తుంది. ఇది టు- ఇన్- వన్ లాంటి ఆయుధం అన్నమాట. మారణాస్త్రంగా దీన్ని ప్రయోగిస్తే, బ్రహ్మశిరాస్త్రం మాదిరిగానే ప్రకృతి ఉత్పాతాల్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ పాశుపతాన్ని కూడా ఎప్పుడుపడితే అప్పుడు వాడరాదని ఆనాటి పెద్దలు (ఋషులు) ఆంక్ష విధించారు. కాబట్టే అర్జునుడు మారణాస్త్రంగా తన పాశుపతాన్ని కురుక్షేత్ర యుద్ధంలో వాడలేదు. మారణాయుధంగా దాన్ని కనుక ఉపయోగించి ఉంటే, అర్జునుడు కేవలం ఒక్కక్షణంలోనే కౌరవుల్ని నశింపజేసేవాడు. పాశుపతాస్త్రాన్ని మిస్సైల్గా మాత్రం ఒకసారి వాడాడు అర్జునుడు. ఆ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కౌరవులకూ, పాండవులకూ బావమరిది 'సైంధవుడు'. సైంధవుడికి అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడు, ఒక వరం ప్రసాదించాడు. “ఎవరివల్ల తన తనయుని తల నేలపై పడుతుందో, వారియొక్క శిరస్సు ముక్కముక్కలై పేలిపోవాలని” తన తపశ్శక్తితో శాసించాడు. ఈ విషయం కృష్ణునికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బాణంతో సైంధవుడి తలను తెగనరుకుతాడు. ఆ 'తల' క్రిందపడిందంటే, అర్జునుని శిరస్సు ప్రేలిపోయి ఉండేదే! ప్రమాదాన్ని పసిగట్టాడు శ్రీకృష్ణుడు. సైంధవుని తలను నేలపై పడనివ్వవద్దని అర్జునుడితో చెప్పాడు. అర్జునుడు తన బాణాలను ఉపయోగిస్తూ, సైంధవుడి తలతో బంతి ఆట ఆడసాగాడు. "ఈ తలను ఏం చెయ్యమంటావు? అయినా ఎందుకూ ఇదంతా?" అంటూ కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు అసలు విషయం చెప్పాడు. “అయితే ఏం చేద్దాం మరి?" అన్నాడు అర్జునుడు. "సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్నాడు. అతని తొడపై ఈ తలకాయ పడేలా చెయ్యి. ఆ పని ఒక్క పాశుపతాస్త్రం వల్లనే సాధ్యం" అని చెప్పాడు శ్రీకృష్ణుడు. పాశుపతాన్ని తీసి మంత్రించి వదిలాడు అర్జునుడు. ఆ అస్త్రం సైంధవుని తలను ఎక్కడోఉన్న శమంత పంచకానికి తీసుకొనిపోయి, వృద్ధక్షతుని తొడపై పడేసింది. దాన్ని తన కుమారుని శిరస్సుగా గుర్తించలేకపోయాడు వృద్ధక్షతుడు. ఉలిక్కిపడి క్రిందకు నెట్టేశాడు. సైంధవుని తల ఆ విధంగా నేలపై పడింది. ఆ తలను నేలపై పడగొట్టినవాడు వృద్ధక్షత్రుడు కాబట్టి, అతని తల ముక్కముక్కలుగా ప్రేలిపోయింది. తాను ఇచ్చిన వరానికి తానే బలి అయ్యాడు వృద్ధక్షత్రుడు. ఈ సందర్భంలో పాశుపతాస్త్రం ఒక “క్షిపణి" గా పనిచేయడం మనం గమనించవచ్చు.
పాశుపతాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం ఈ రెండూ కూడా జగత్ సంహారం చెయ్యగలవు. మారణాయుధాలుగా వీటిని ఉపయోగిస్తే అనేక లక్షల శూలాలూ, గదలూ, సర్పాల్లాంటి బాణాలూ వాటినుండి పుడతాయి. వీటిని మనుషులపై ప్రయోగిస్తే ఎన్నో ఆపదలు వస్తాయి. ఎంత ప్రమాదం వచ్చినా, ఇతరితర ఉపాయాలవల్లనే తప్పించుకోవాలి గాని, ఈ అస్త్రాల్ని ప్రయోగించకూడదు. మారణాయుధములుగా వీటిని ప్రయోగించడాన్ని నిషేధించారు నాటి విజ్ఞులు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి