*మూక పంచశతి*
*ఉపోద్ఘాతము*
*ఆయన మూకశంకరేంద్ర సరస్వతీ స్వామి. ఆయనే (మూగవాడైన ) మూకశంకరులు. కామాక్షీమాత దివ్యానుగ్రహంతో మాటలు వచ్చి మహాకవియై ఆశువుగా 500 శ్లోకాలను అమ్మవారిపై అనర్గళంగా చెప్పి “మూక పంచశతి” అనే స్తుతి కావ్యానికి తెరదీసిన యోగీశ్వరుడు. కంచికామకోటి పీఠానికి 20వ పీఠాధిపతిగా పనిచేసి, అమ్మవారిలో ఐక్యత నొందిన దివ్యపురుషుడు మూకశంకరులు.*
*మనకున్న శక్తిపీఠాలలో ప్రసిద్ధమైంది కాంచీపురం. ఇక్కడ శక్తిపీఠం ఇతర శక్తిపీఠాలకు శక్తి, దీప్తి, స్పూర్తులను సదా అందిస్తోందని ప్రతీతి. కాంచీపురం మోక్షపురిగా ప్రసిద్ది. ఇక్కడున్న మహాశక్తి అమ్మవారు కామాక్షీ మాత. స్వామి ఏకామ్రేశ్వరుడు. కామేశ్వరునే కనులలో దాచుకున్న తల్లి కామాక్షి. సకల కామితాలకు సాక్షియై అనుగ్రహించే తల్లి కామాక్షి. త్రిమూర్తులే త్రినయనాలుగా కల్గిన తల్లి కామాక్షీ మాత అని అంటారు. కామునకు పునర్జన్మనిచ్చి, అనంగునిగా మార్చి, రతీదేవికి సంతృప్తిని కల్గించిన తల్లి కామాక్షి అనికూడా పండితులు సెలవిస్తున్నారు. ఆ కామకోటి పీఠానికి గురుపరంపరలో 20వ పీఠాధిపతి మూకశంకర సరస్వతీస్వామి పుంభావ వాగ్దేవీ మాత. క్రీ.శ. 398 నుండి క్రీ.శ 437 వరకు 39 సం||లు కంచిపీఠమును నిర్వహించిన మహాయోగి మూకశంకరులు.*
*ఖగోళ శాస్త్ర పండితులైన శ్రీ విద్యాపతికి జన్మించినవారు మూకశంకరులు. పుట్టుకతో మూగతనం, చెవుడు ఉన్నాయి. అయినా ఆదినుండి అమ్మవారి ధ్యానంతో పెరిగాడు. ఒకమారు తన మిత్రునితో కంచికి పోయి, అమ్మవారి ఎదుట ధ్యానంలో మూకశంకరులు నిమగ్నమైనారు. ఇంతలో కాంచీపుర పీఠ శిఖాధిరూఢయైన ఆదిమశక్తి కామాక్షీమాత సామాన్యకాంతగా, పండు ముత్తైదువగా ఆలయంలోనికి వచ్చి మూకశంకరులను సమీపించింది. తాను నములుతున్న తాంబూలం ఎంగిలి పిడచను నోటినుండి తీసి ఎదురుగా ఉన్న శంకరుల మిత్రునకివ్వబోయింది. అమ్మవారిని గుర్తించలేని ఆ సాధకుడు, ఆ ముత్తైదువ ఎంగిలిని తిరస్కరించాడు. అప్పుడు ఆ తల్లి ప్రక్కన ఉన్న మూకశంకరులకిచ్చింది. మూకశంకరులు భక్తితో తీసుకుని, కళ్ళకద్దుకుని, ఎదురుగా ఉన్న అమ్మకు (పండు ముత్తైదువకు ) నమస్కరించి నోటిలో వేసుకొని నమిలినాడు. అంతే శంకరుల మూగతనం మాయమైంది. మాటల ప్రవాహం పెల్లుబికి వచ్చాయి. కనులు వర్షించాయి. ఒళ్ళు పులకరించింది. భావావేశం, సాహిత్యాభినివేశం, భక్త్యార్ద్రతలు సమ్మిళితమై అతని నోట ఆశువుగా ఛందోబద్దమైన శ్లోకాల జలపాతం ప్రారంభమైంది. 500 శ్లోకాలు ఆలపిస్తే గాని మూకశంకరుల భావావేశం శాంతించలేదు. ఇంతలో అమ్మ “నాయనా! ఏమైనా వరం కోరుకో. అనుగ్రహిస్తా”నంది. అప్పుడు మూకశంకరులు “అమ్మా! నీ నామ మహిమ, నీ పాద మహిమ, నీ కటాక్ష వైభవం, నీ మందస్మితం, నీ దివ్యత్వాలను సంస్తుతించిన నోటితో లౌకికాలు మాట్లాడలేను. కనుక అమ్మా! తిరిగి నాకు మూగతనాన్ని అనుగ్రహించ”మని కోరినాడు. అమ్మ “తథాస్తు" అంది. పారలౌకికం మాత్రమే కోరిన భక్తుడు మూకశంకరులు. ఇది తెలిసి కంచిపీఠం స్వామి శ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి, మూకశంకరులను పిలిపించి, ఆయన తల్లితండ్రుల అనుమతితో సన్యాసదీక్ష, ఉత్తరాధికారిగా చేయడం, అనంతరం మూకశంకరులు కంచిపీఠం అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.మూక పంచశతి గురించి ఎందరో పెద్దలు వివరించారు, ఐతే ముఖ్యంగా మూక శంకరుల పరంపరనుంచీ ఎందరో పెద్దలు చెప్పే విషయం ఒకటున్నది. మూక పంచశతి వైభవం అంతలా ఎందుకున్నదో ప్రతిపాదిస్తూ పండితులు ఉపాసకులు చెప్పే మాట అది. శివానందలహరి పారాయణ చేస్తే (బయటికి కానీ లోపల కానీ) ప్రత్యక్షంగా శంకరులే శబ్దరూపంలో ఎదురునిలుస్తారు అని అంటారు. అలాగే సౌందర్యలహరి పారాయణ చేస్తే జగదంబ శబ్దరూపంలో ప్రకటితమౌతుందనీ అంటారు. అందుకే తగిన శౌచం, కనీసం అంతశ్శౌచంలేకుండా ఈ పారాయణ చేయరు. పెద్దలైనవారు బాగా చదవడం వచ్చినవారి దగ్గరే చదవడం నేర్చుకోమని చెప్పడానికి కారణం అదే. దీనిలో ఆదిశంకరులు మంత్ర శాస్త్ర రహస్యాలను కథారూపంలో దాచేయడం వల్ల వీటికీ యంత్రాలు అధిదైవతం ఉపాసన ఉపదేశాలున్నాయి.*
*అలాగే "మూక పంచశతి" విషయంలో, మూకమహాశయుడు అంతకు పూర్వం పండితుడూ, విద్వత్తున్నవాడూ అని చెప్పడం క్లిష్టం. ఒకవేళ అలా అయ్యుంటే మూక మహాశయులు దీనికన్నా ముందే స్తోత్రాలో గ్రంథాలో రచించి ఉండేవారు,అవి లభ్యంలోనూ ఉండేవి. చరిత్రలోనూ అలా లేదు.*
*మూకమహాకవి అమ్మవారి వైభవాన్ని కొలుస్తు 'ఆర్యా శతకం', పాదాలను దర్శించి 'పాదారవింద శతకం', అమ్మప్రేమను పొందిన ఆనందంలో అమ్మవారి హృదయంలోని కరుణను తలుస్తూ 'స్తుతి శతకం', అమ్మవారి క్రీగంటి చూపు మహిమను తెలిపే 'కటాక్ష శతకం', అమ్మవారి సన్నని తెల్లని నవ్వును చూసి చెప్పిన 'మందస్మిత శతకం' అనే ఐదు స్తుతి ఝరులు ప్రవహించాయి.*
*ఈ ఐదు శతకాలూ అమ్మ వలననే, అమ్మ నోటి తాంబూలపు పిడచ మహిమ వలననే ప్రకటించబడ్డాయి కాబట్టి, ఈ స్తోత్రాలు ఎక్కడ చదివినా, విన్నా, ఆ గ్రంథం ఏ ఇంట ఉన్నా శాబ్దిక స్వరూపంలో కామాక్షి ప్రత్యక్షమైనట్టే అని పెద్దల ప్రతిపాదన.*
🙏🙏🙏
సేకరణ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి