విదురుడు చెప్తున్నాడు. “రాజా! మోక్షవేత్తలు ఉదాహరించిన పోలిక ఇది. దీనిని గ్రహించటం వలన, మానవుడు పరలోకంలో సుకృత ఫలాన్ని పొందగలడు. ఆ అడవి అన్నది మహాసంసారమే. దుర్గమవన మన్నది సంసారం యొక్క నిగూఢ (క్లిష్ట) స్వరూపం. పాము లని చెప్పినవన్నీ రోగాలు. పెద్దశరీరంతో అక్కడ నిలిచిఉన్న స్త్రీ అంటే వార్ధక్యమే. అది రూపాన్నీ, రంగునూ నాశనం చేస్తుంది. రాజా! అక్కడ బావి అని చెప్పినది జీవి శరీరమే. అక్కడ బావిలో క్రింద ఉన్న ఆ మహాసర్పం కాలమే. అది సర్వప్రాణులనూ అంతం చేసేది. దేహధారుల సర్వస్వాన్నీ అపహరించేది. బావి మధ్యలో పెరిగిన తీగ దేహధారులకు గల జీవితాశ. దానిలో చిక్కుకొనే గదా ఆ మానవుడు వ్రేలాడుతున్నది. రాజా! ఆ బావిపై గట్టు దగ్గర ఆ చెట్టును సమీపిస్తున్న ఆరు ముఖాల ఏనుగు సంవత్సరం. దానిముఖాలు ఆరు ఋతువులు. పాదాలు పన్నెండు నెలలు. ఎప్పుడూ ఉద్యమిస్తూ, ఆ వృక్షాన్ని కొరుకుతున్న ఎలుకలు రాత్రింబవళ్ళు. ప్రాణివిచారణ చేసే పండితులు అలా చెప్పారు. అక్కడున్న తేనెటీగలు కోరికలుగా చెప్పబడుతున్నాయి. విరివిగా తేనె ధారలను స్రవిస్తున్న ఆ ధారలు, కామరసాలు అని గ్రహించాలి. మానవులు వాటిలోనే మునిగిపోతారు. పండితులు సంసార చక్ర గమనాన్ని ఈ విధంగా గ్రహిస్తారు. అందుకే ఆ బుధులు (వైరాగ్యంతో) సంసారచక్ర బంధాలను ఛేదిస్తారు.”
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి