27, మే 2026, బుధవారం

కైవల్య ప్రాప్తి:

 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

🍎🥭🍍శుభోదయం 🍎🥭🍍

💐💐💐💐💐💐💐💐💐💐


కైవల్య ప్రాప్తి:


అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. బంగారాన్ని ఏదీ ఆకర్షించలేదు. బంగారమే అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రకృతి మానవుడికి చెప్పే గొప్ప గుణపాఠం ఇది. అన్ని జీవుల్లోకీ మానవ జన్మ అపూర్వం. ఈ విషయం తెలుసుకోవడం గొప్ప కాదు, జన్మ సార్థకతను పొందడం ముఖ్యం. ఇనుము లాంటి మనసును పుటం పెట్టి బంగారం చేసుకోవడమే కైవల్య ప్రాప్తి. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనే అవయవాలు- శబ్ద, స్పర్శ, దృశ్యం, రుచి, వాసనల జ్ఞానాన్ని మెదడుకు అందిస్తాయి. అందువల్ల ఇవి జ్ఞానేంద్రియ పంచకాలు. పనిచేసే అవయవాలైన నోరు, చేతులు, కాళ్లు వంటివి కర్మేంద్రియ పంచకాలు. దేహం లోపల ఉండి నడిపించే అవయవాన్ని అంతఃకరణం అంటారు. ఇది నాలుగు విధాలు. మనసు- బహిర్‌ ప్రపంచంలోని పలు విషయాలను గ్రహిస్తూ, పరిపరి విధాల ఆలోచించేది. బుద్ధి- విచక్షణ చేసేది. అహంకారం- నేను, నాది అనే భావాన్ని కలిగించేది. చిత్తం- పూర్వ జన్మ కర్మ సంస్కారాల భోషాణం. శరీరంలో స్వేచ్ఛగా సంచరించే గాలిని అది నిర్వహించే కార్యాలను బట్టి వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కారణమైనప్పుడు ప్రాణం అని, విసర్జనలో సహాయపడుతున్నప్పుడు అపానం అని, ఆహారం ద్వారా అందే శక్తిని శరీరమంతటికీ అందజేసేటప్పుడు వ్యానం అని, కంఠం నుంచి ఉదరం వరకు వాయు సంచారానికి తోడ్పడుతున్నప్పుడు ఉదానం అని, జీర్ణ వ్యవస్థలో భాగమైనప్పుడు సమానం అని అంటారు. ఇంద్రియాలను ఆకర్షించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో ఏర్పడే విశేష అనురాగం వల్ల బహిరంగ బంధాలేర్పడతాయి. వినడం వల్ల వేటగాడికి చిక్కే లేడి, ఆడ ఏనుగు స్పర్శ చేత ఏనుగు, మంటను చూసి ఆకర్షితమైన మిడుత, రుచితో చేప, పరిమళాన్ని ఆఘ్రాణించి తుమ్మెద ప్రమాదాన్ని కొని తెచ్చుకుని మృత్యువాత పడతాయి. ఒక్కో ఇంద్రియ చపలత్వానికి ఒక్కో ప్రాణి బలైపోతే, ఈ అయిదు ఇంద్రియాల ఇంద్రజాలానికి లోబడే మనిషి గతి చెప్పనలవి కాదు.


ఈ సృష్టిలో జన్మించిన జీవులన్నీ సుఖాలనే కోరుకుంటాయి. సుఖాలు ఐహికం, ఆముష్మికం, కైవల్యం అని మూడు రకాలు. ఈ లోకంలో ధన కనక వస్తు వాహనాల ద్వారా పొందే సుఖం, పుత్ర మిత్ర కళత్ర సంబంధ బాంధవ్యాల వల్ల కలిగే సంతోషం- ఐహిక సుఖాలు. యజ్ఞయాగాది కార్యాల వల్ల కలిగే స్వర్గతుల్య భోగాలు ఆముష్మికాలు. ఆత్మ సాక్షాత్కారంతో కలిగే పరమోత్కృష్ట సుఖం- కైవల్యం.


మనిషి డబ్బు సంపాదనలో తలమునకలు కావడానికి కారణం- ఆ ధనంతో పంచేంద్రియాలను సంతృప్తిపరచే వాటిని సాధించవచ్చని. డబ్బు సంపాదించే యావలో తానేమిటో, తన జన్మకు అర్థమేమిటో తెలుసుకోలేకపోతున్నాడు.


విషయ భోగాలను విషంలా విసర్జించి అమృతోపమాన తోషం (సంతోషం), దయ, క్షమ, ఆర్జవం (రుజుభావం), ప్రశాంతి అనే గుణాలను పెంపొందించుకుంటే మనిషికి కైవల్యం సులువుగా సంప్రాప్తిస్తుందంటారు పెద్దలు. తోషం- దుఃఖాన్ని దరి చేరనీయకుండా, సదా సంతోషంగా ఉండటం. దయ- సమస్త జీవరాశిపట్ల ఉదారత ప్రదర్శించడం. క్షమ- ఓరిమిని కలిగి ఉండటం. ఆర్జవం- కపటానికి ఆస్కారం లేని రుజువర్తన. ప్రశాంతి- అరిషడ్వర్గాలను విడిచిపెట్టడం వల్ల కలిగే చిత్తశాంతి.


ఇన్ని మంచి విషయాలు- ఎన్నో జీవజాతులున్నా... ఒక్క మనిషి చెవినే పడతాయి, అతడి మనసు మాత్రమే విచక్షణ, సద్బుద్ధులతో అర్థం చేసుకుని, గురువును ఆశ్రయించి, అజ్ఞానాన్ని జయించి తద్వారా శరీరాన్ని కైవల్య పథంలో ముందుకు సాగేలా చేస్తుంది. ప్రక్షాళిత శరీరం ద్వారా ఆత్మ పొందే సుఖానుభూతే కైవల్య ప్రాప్తి.


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: