26, మే 2024, ఆదివారం

వైశాఖ పురాణం - 18.

 వైశాఖ పురాణం - 18.


18వ అధ్యాయము - యమదుఃఖ నిరూపణము


నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.


వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.


స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యింటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభూ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాటించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగసాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరియింకను పెక్కు పాపములను చేసినవారు యిట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు, తల్లివైపువారు మొత్తము యిరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు. వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము యిరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించినవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము.

Panchaag


 

Veda vidyardhulu


 

వైశాఖ పురాణము - 17.

 VAISAKHA PURANAM - 17


వైశాఖ పురాణము - 17.


17వ అధ్యాయము - యముని పరాజయము


అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.


యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.


అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.


సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ

త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా

త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||

నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః

తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||


అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.


అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాసపురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.


ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని యితడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.


దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము? నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు 'అయ్యో' అని అతిదీనముగ బలికెను.


వైశాఖ పురాణం 17వ అధ్యాయం సమాప్తం.

_పరిస్థితులకు


*కం*

తలవంచుట నేర్చినచో

కలిగిన సామాన్య పటిమ ఘనకీర్తియగున్

తలవంచగనెంచనిచో

కలిగిన ప్రజ్ఞలు సహితము కల్లగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తలవంచడమొక్కటే నేర్చుకుంటే నీ సామాన్యమైన బలం కూడా గొప్పగా కీర్తించబడుతుంది. తలవంచడానికి సిధ్ధపడకపోతే కలిగి యున్న ప్రజ్ఞ లు కూడా నిరర్థకమగును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

: *_పరిస్థితులకు సర్దుకొనిపోతే తమను తాము తగ్గించుకున్నట్లేనన్న భావన చాలామందిలో ఉంది. అనవసరమైన 'అలకలకు' పోతే చివరకు నష్టపోయేది మనమే!_*


*_ఏటిలో తోటి జీవులతో పడటం లేదని, చేప అలిగి ఒడ్డుపైకెళితే ఒరిగేదేముంటుంది..? పైగా ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది._*


*_ఓపికతో మన వంతు వచ్చే వరకు వేచిచూసి, మన ఉనికిని చాటుకోవటం వేరు... ఒకింత అసహనంతో ఏటికి ఎదురీది మొదటికే మోసం కొనితెచ్చుకోవటం వేరు._* 


*_జీవితం రంగులరాట్నం లాంటిది. ఒకసారి ఒక కుర్చీపైనుంటే, మరోసారి మరోకుర్చీ పైనుంటుంది. స్థానమేదైనా సర్దుకుపోతేనే జీవనచక్రం సాఫీగా సాగిపోతుంది._*


*_నువ్వు జీవితంలో ఎప్పుడూ వైఫల్యాన్ని చూడలేదంటే, నీ లక్ష్యాలు అంత గొప్పవి కాదని అర్ధం. నీకు ఎన్నడూ సవాళ్లు ఎదురు కాలేదంటే నువ్వు అసలు లక్ష్య సాధనకు ప్రయత్నమే చేయలేదని అర్ధం. వైఫల్యాలు మన వృద్ధికి ఇంధనంగా పనిచేస్తాయి. సవాళ్ళు మన నైపుణ్యాలను సానబెడతాయి._*


*_ప్రయోగించినప్పుడే ఆయుధం ఎంత శక్తిమంతమైనదో తెలుస్తుంది. ఉపయోగించినప్పుడే నీ సామర్థ్యాల సత్తా ఏంటో అర్థమవుతుంది కాబట్టి కష్టం వచ్చిందని కుమిలిపోకుండా ఓర్పు నేర్పుతో ఎలా ముందుకు వెళ్ళాలో తెల్సుకుని అడుగు వేస్తే నీకు విజయం తధ్యం.☝️_*


     

🌹🪷🌹 💓🙇🏻💓 🌹🪷🌹

భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

మీకు తెలుసా... ఇలాంటి పుస్తక సంపద 90 లక్షల గ్రంథాలను భక్తియార్ ఖిల్జీ నలందలో తగులబెట్టాడని... అవి అన్నీ కాల్చేందుకు వారికి ఒక సంవత్సర కాలం పట్టిందట... అన్ని గ్రంథాలు.... విజ్ఞాన సంపద ఉన్నాయి.. మన భారతీయుల దగ్గర.. కానీ, ఐకమత్యం లేదు.!!


(ఇతని పేరు మీద ఇప్పుడు ఒక ఊరు భక్తియార్ పూర్ అని ఉంది.! వీడి పేరుమీద రేల్వేస్టేషన్ కూడా ఉన్నది)


దోపిడీదారులు, దురాక్రమణదారులు, విధ్వంసకారుల, పేర్ల మీద ఊర్లు, పట్టణాలు, నగరాలు, రైల్వేస్టేషన్లు ఇంకా వెలుగొందుతున్నాయి.! ఇది మన చేతకానితనం.!!


🙏 మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు 🙏*

🔹 నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వ గ్రంథ శాస్త్ర రాజములు: 🔹

🔹 నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండా పోయాయా అని ఆశ్చర్యం కలుగక మానదు.

🌷1.అక్షర లక్ష: ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము. రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణంలను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

🌷2. శబ్ద శాస్త్రం: రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి పిచ్(స్థాయి), వేగాలను కొలవడం వివరించారు.

🌷3. శిల్ప శాస్త్రం: రచయిత కశ్యప ముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. 307 రకాల శిల్పాల గురించి, 101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజ భవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంపై విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

🌷4. సూప శాస్త్రం: రచయిత సుకేశుడు. ఇది పాక శాస్త్రం, ఊర గాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాల గురించి, ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయాలు, వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

🌷5. మాలినీ శాస్త్రం: రచయిత ఋష్యశృంగ ముని. పూల మాలలను తయారు చేయడం, పూలగుత్తులు, పూలతో రకరకాల శిరోఅలంకరణలు, రహస్య భాషలో పూవుల రేకుల పైన ప్రేమ సందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

🌷6. ధాతు శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. సహజ, కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు. మిశ్రలోహాలు, లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

🌷7. విష శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. 32 రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

🌷8. చిత్ర కర్మ శాస్త్రం (చిత్ర లేఖన శాస్త్రం): రచయిత భీముడు. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్ర లేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తల వెంట్రుకలను గాని, గోటిని కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

🌷9. మల్ల శాస్త్రం: రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.

🌷10. రత్న పరీక్ష: రచయిత వాత్సాయన ఋషి. రత్నాలు కల్గి ఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి. వీటి శుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

🌷11. మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్య స్వామి స్వామి శిష్యుడైన వీర బాహువు రచయిత. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

🌷12.అర్థ శాస్త్రం: రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు 3. ధర్మ బద్ధమైన 82 ధన సంపాదనా విధానాలు ఇందులో వివరించారు.

🌷13. శక్తి తంత్రం: రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్య శక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

🌷14. సౌధామినీ కళ: రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయా చిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

🌷15. మేఘ శాస్త్రం: రచయిత అత్రి ముని. 12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

🌷16. స్థాపత్య విద్య: అదర్వణ వేదంలోనిది. ఇంజనీరింగ్, ఆర్కితెక్చర్, కట్టడాలు, నగర ప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

🌷ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వ శాస్త్రం, కుమారస్వామి రచించిన గజ శాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్ర శాస్త్రం మొదలగునవి, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

🌷నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.!!


భక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయం తగలబెట్టటానికి

వచ్చినప్పుడు, ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.!!

అక్కడున్న ఆచార్యులు, విద్యార్థులు కలసికట్టుగా చేతికి 

అందిన దానితో తిరగబడినా, గ్రంథాలనే ఆయుధాలనే చేసుకుని తిరగబడినా ఇంతటి దహనకాండ జరిగేది కాదేమో.!! 


జాజిశర్మ కీసర వారి సౌజన్యంతో..... #ధర్మపథం.!!


🙏🙏🙏 💐 

ధర్మాన్ని పాటిస్తే చాలు

 *శాస్త్రాలలోని ధర్మాలను పాటించి వాటి ప్రయోజనాలను పొందండి* 

మనిషి శాస్త్రాలలో పేర్కొన్న ధర్మాన్ని తూ.చ తప్పకుండా ఆచరించాలి. పూర్తిగా పాటించలేకపోయినా వీలైనంత వరకునైనా పాటించాలి. 

 ధర్మం యొక్క చిన్న సాధన కూడా వ్యక్తిని భయం నుండి రక్షిస్తుంది. ధర్మం నుంచి ప్రయోజనాలు పొందాలంటే మనిషి శాస్త్రాలలో పేర్కొన్న ధర్మాన్ని విధిగా ఆచరించాలి. 

 *గీతలో భగవంతుడు ఇలా అంటున్నాడు:* 

 భక్తితో భగవంతుని పూజించడం ముఖ్యం. అంటే ఎవరైతే నాకు ఆకు, పువ్వు, పండు లేదా నీటిని భక్తితో సమర్పిస్తారో, దానిని నా పూజా సామాగ్రిగా స్వీకరిస్తాను. 

 ఒకడు తనకు నిర్దేశించిన ధర్మాన్ని పాటిస్తే చాలు, అతనికి నిర్దేశించని ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అలాంటివి ఆచరించడం వ్యర్థం. 

 ఉదాహరణకు, ఎనిమిదో తరగతి విద్యార్థికి ఏదో ఒక ప్రశ్నాపత్రం అందుతుంది. 10వ తరగతి విద్యార్థికి వేరే రకం ప్రశ్నపత్రం ఇస్తారు. ఈ ఇద్దరు విద్యార్థులు ఎదుటివారి ప్రశ్నలకు ఎంత గట్టిగా సమాధానాలు చెప్పినా ఒక్క మార్కు కూడా రాలేదు. 

 మరొకరి ధర్మాన్ని బాగా ఆచరించడం కంటే తన ధర్మాన్ని అన్ని లోపాలతో ఆచరించడం మంచిదని భగవాన్ చెప్పారు. 

  శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో ఇలా చెప్పాడు.. *తన ధర్మంలో హృదయపూర్వకంగా నిమగ్నమైనవాడు దోషరహిత స్థితిని పొందుతాడు అని*..

 భగవంతుని యొక్క ఈ బోధనలను ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాలి,తద్వారా ప్రయోజనాలను పొందండి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

సూర్యాలయం నుంచే

 *ఈ సూర్యాలయం నుంచే ముల్తానిమట్టి వచ్చేది* 

🙏🌞🙏🌞🙏🌞🌞🙏🌞🙏🌞🙏



🙏🌞హైందవమతంలో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మనం నిత్యం జపించుకునే గాయత్రి సైతం సూర్యుని స్తుతించే మంత్రమే అన్న వాదనలు లేకపోలేదు. అలాంటి సూర్యుని కొలుచుకునేందుకు వేల ఏళ్ల క్రితమే ఓ ఆలయాన్ని నిర్మించారు. అదే పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్యదేవాలయం! దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్లోని కశ్యపపురం అనే నగరంలో ఓ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.


🙏🌞 ఆ నగరానికంతటికీ ఆ సూర్యదేవాలయమే ముఖ్య ఆకర్షణగా ఉండేదట. ఆ ఆలయాన్ని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారట. అందుకే ఆ నగరాన్ని మూలస్థానం అని పిలుచుకోసాగారు. క్రమేపీ ఆ పేరు ‘ముల్తాన్’గా మారిపోయింది.

 

🙏🌞ముల్తాన్లోని సూర్యదేవాలయాన్ని కృష్ణుని కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. అనుకోకుండా ఒక పాపకార్యం చేసిన సాంబుడిని, కుష్టు వ్యాధితో బాధపడమని కృష్ణుడు శపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 


🙏🌞అప్పటి నుండి మీదట ప్రజలంతా కూడా తమ రోగాలు, కష్టాల నుంచి విముక్తి పొందేందుకు ఈ ఆలయాన్ని దర్శించసాగారు. అక్కడి మట్టికి సైతం రోగాలను నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు. ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్లేవారు. అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది.

 

🙏🌞అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు, తలుపులు, స్తంభాలు, శిఖరాలు... అన్నీ కూడా వెండి, బంగారాలతో ధగధగలాడిపోతుండేవి. ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలు రాజ్యానికి ముఖ్య ఆదాయంగా ఉండేవి. ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలయినా కూడా ఆలయానికి ఏమాత్రం ఢోకా రాలేదు. క్రమేపీ ఆ పాలకుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఆ పోరులో ముల్తాను మీద పైచేయి సాధించినవారు తమ కసినంతా సూర్యదేవాలయం మీద చూపించారు. పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహమ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశాడు. ఇప్పుడైతే ఈ సూర్యదేవాలయం ఎక్కడుందో కూడా ఆనవాళ్లు లేవు.

 

🙏🌞ముల్తాన్లో సూర్యదేవాలయంతో పాటుగా మరో విశిష్టమైన దేవాలయం కూడా ఉండేది. అదే నరసింహస్వామి ఆలయం. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు పాలించిన రాజ్యం ఈ ప్రాంతమే అని భక్తుల నమ్మకం. అందుకనే ఈ ఊరికి హిరణ్యకశిపుని పేరు మీదుగా కశ్యపపురం అనే పేరు కూడా ఉంది. 


🙏🌞హిరణ్యకశిపుని వధ తర్వాత, స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామికి ఓ ఆలయాన్ని నిర్మించాడట. ఈ ఆలయాన్ని కూడా ఎప్పటికప్పుడు అల్లరిమూకలు ధ్వంసం చేస్తూ వచ్చాయి. అయినా కూడా స్థానిక హిందువులు ఆలయాన్ని పునర్నిర్మించుకునేవారు. 1992లో మన దేశంలో బాబ్రీ మసీదుని కూల్చివేసినందుకు నిరసనగా, ఈ ఆలయాన్ని దాదాపుగా నేలమట్టం చేసేశారు. ప్రస్తుతానికి ఆ ఆలయం తాలూకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి.

🙏🌞

ఒక సంఘటన

 ఒక సంఘటన 


చాలా సంవత్సరాల క్రితం అంటే 40 ఏళ్ళ పైబడే ఉండవచ్చు. నేను ఖమ్మం బస్టాండులో బస్సుకోసం 5వ నెంబర్ ప్లాటుఫామ్ మీద ఎదురుచుస్తూవున్నాను. సమయం 5-30 pm అయ్యింది. చాలా సేపటివరకు బస్సు రాలేదు దాదాపు 6 గంటల సమయంలో బస్సు వచ్చింది. నేను ఇల్లేందు వెళ్ళాలి అతి కష్టం మీద బస్సులోకి నా శరీరాన్ని చేర్చాను. ఆలా ఎందుకు అన్నానంటే అక్కడ చాలా సేపటివరకు బస్సు రానందు వల్ల రెండు బస్సులకు సరిపడా జనం వున్నారు. నేను గేటు దగ్గరే ఉండటంతో వెంటనే చాకచేక్యంగా బస్సులోకి దూరాను. అంతే వెనుకవాళ్ళ తోపుడుతో ముందుకు దూసుకొని వెళ్ళాను కానీ నాకు కూర్చోటానికి సీటు దొరకలేదు. అతి కష్టం మీద వెనక టైర్లు వుండే చోట నిలుచో గలిగాను. చుట్టూ చూసాను ఎక్కడైనా సీటు కాళిగా ఉందా అని కానీ ఒక్క సీటు కూడా కాళీ లేకపోగా నిలుచోవటమే అతి కష్టంగా అయ్యింది. లోపల గాలి ఆడటం లేదు. ఎప్పుడు బస్సు బయలుదేరుతుందా అని ఎదురు చూడసాగాను. కుడి ప్రక్క చిన్న తలుపు తీసుకొని డ్రైవరు లోపలి చొరబడ్డాడు. ఆ ఇక బస్సు బయలు దేరుతుంది అని నేను అనుకున్నాను. 


చిన్నగా డ్రైవరు వైర్లు కలిపి (ఆర్టీసీ బస్సులకు తాళం తీసి దాని వైర్లు ముడి వేసి పెట్టేవారు ఆ రెండు వైర్లు కలిపితే అప్పుడు స్టార్ట్ అయ్యేది)  బస్సును స్టార్టు చేసాడు.  అంతే ముందు ఆడవారి సీట్లలోంచి ఒక స్త్రీ పెద్దగా అరిచింది. అది నాకు పాము అన్నట్లు వినపడింది. నిజానికి ఆమె ఏమున్నదో నాకు తెలియదు. అరుపు మాత్రం ప్రాణం పోయినట్లు అరిచింది. అంతే కిటికీలలో పట్టిన వాళ్ళు అంతా ఒక్క క్షణంలో దూకారు. ముందు సీట్లలో వున్నవారు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లారు. ఒక్క క్షణంలో బస్సు మొత్తం కాళీ అయ్యింది. చుట్టూ చుస్తే బస్సులో నేను ఒక్కడినే వున్నాను. నేను కిటికీలోంచి దుకాణాల (అప్పుడు నేను చిన్నగా కిటికీలోంచి దుకే అంత సైజులోనే వుండే వాడిని) లేక బస్సు కాళీ అయింది కాబట్టి డోరులోంచి వెళదామా అని ఆలోచించిన తరువాత నాకు తట్టింది ఏమిటంటే ఆ అరచిన ఆమె పాము అన్నది కదా ముందు క్రింద ఎక్కడ పాము ఉందొ చూద్దాము అని సెట్ల మీద నిలుచొని చుట్టూ చూసాను. ఆ డిమ్ లైట్ల వెలుతురులో నాకు సెట్ల మధ్య ఏది కదిలినట్లు కనపడలేదు. 


అప్పుడు డ్రైవరు వచ్చి ముగ్గురు కూర్చునే ఆడవారి సెట్లలో మూడవ సీటు పైన సీటు తీసి క్రింద బ్యాటరీ వైరు గట్టిగా పిట్ చేస్తున్నాడు. నేను అడిగాను ఏమైందని. దానికి ఆయన లూసు కనెక్షన్ ఉండటం వలన బస్సు స్టార్ట్ చేసినప్పుడు బ్యాటరీ   వైరు దగ్గర స్పార్క్ వచ్చింది దానికి ఒక పల్లెటూరు ఆమె బస్సు తగలబడినట్లు అరిచింది అని అన్నాడు. ఆ మాటలకు నాకు ధైర్యం వచ్చింది నేను ముందరి రెండు సీటర్ సెట్లో కూర్చున్నాను. అక్కడ బయట వున్నవారిని డ్రైవరు లోపలికి రండి ఏమి ప్రమాదం లేదు అంటే జనం మళ్ళి  పుట్టలోని చీమలు వచ్చినట్లుగా వచ్చి బస్సునిండా చేరారు.  కాకపొతే ఇందాకటి సంఘటనకు కొంతమంది భయపడి వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని తెలిసింది.  నాకు తెలిసిన ఆమె ఒకామె ఈ విషయం గూర్చి తరువాత చెప్పి తనకు ఆ భయానికి బీపీ బాగా పెరిగి ఆస్పటలులో చేరినట్లు చెప్పింది. 


సామాన్య మానవులకు వస్తువులమీద అవగాహన లేకపోవటంతో వాళ్ళు బాధపడతారు ఇతరులను బాధపెడతారు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*26-05-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సమాజంలో పెద్దల  అనుగ్రహంతో   కీలకమైన   పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల  నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి  శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి  కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

వృషభం


వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ  ప్రయత్నాలు నిదానంగా  సాగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో  అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ  ప్రయత్నాలు కలసిరావు. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి.

---------------------------------------

మిధునం


మాతృ వర్గ బంధు మిత్రులతో  స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో  వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో  మార్గ అవరోధాలు కలుగుతాయి.   కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

---------------------------------------

కర్కాటకం


ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు  అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

సింహం


వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో  బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు  వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో  స్ధిరాస్తి  వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి   నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

కన్య


నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య  వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో  దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి  పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు.

---------------------------------------

తుల


కీలక  వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు  నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటాబయట సమస్యాత్మక  వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. 

---------------------------------------

వృశ్చికం


కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు  సంతృప్తి  కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన   ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా  సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


 దైవ  సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి  ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత  పెరుగుతుంది. మొండి  బాకీలు వసూలు అవుతాయి.  గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత  మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

మకరం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.  వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఇతరులతో  ఆలోచించి  మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ  కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

---------------------------------------

కుంభం


బంధు మిత్రుల నుండి  ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక  సమస్యలు  కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో  మాటపట్టింపులు కలుగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.

---------------------------------------

మీనం


చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై  పెద్దల  సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం  చేసుకుంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀