1, జులై 2020, బుధవారం

విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చింది ఎవరు

విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చిందెవరో తెలుసా?

శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రం చాలా శక్తివంతమైందని పురాణాల్లో పేర్కొన్నారు. శివుడి చేతిలో శూలం, విష్ణువు చేతిలో చక్రం రెండూ శక్తివంతమైనవి. శ్రీహరి కుడిచేతి చూపుడు వేలికి ఉండే చక్రానికి అద్భుతమైన శక్తులున్నాయి. దీని గురించి విష్ణు పురాణంలో చాలా ఆసక్తికరమైన కథనాలను తెలిపారు. శ్రీమహావిష్ణువుకు ఈ ఆయుధం మధ్యలోనే వచ్చిందట. వెయ్యి సంవత్సరాలు కఠోర తపస్సు చేసి దీన్ని వరంగా పొందారని వివరించారు.

సుదర్శన చక్రంలో బ్లేడును పోలిన పదునైన ఆకారాలు 108 ఉంటాయి. రెప్పపాటులో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుంది. ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు.

చక్రాన్ని కేవలం శత్రువుల మీద మాత్రమే ప్రయోగించాలి. శత్రువు ఎంత శక్తివంతమైనవాడైనా దీని ముందు నిలబడలేడు. ఒకసారి చేతి నుంచి బయటపడితే శత్రువును వేటాడిగానీ తిరిగి రాదు. లక్ష్యం పూర్తయిన తర్వాతే వెనక్కు మళ్లుతుంది. సుదర్శన చక్రం దాడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. పరిగెత్తడం ఆపేసి శ్రీహరిని శరణు వేడితే ఆగిపోతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు.

ఎనిమిదో అవతారమైన ద్వాపర యుగంలోని కృష్ణావతారంలో అగ్ని దేవుడి నుంచి ఈ చక్రాన్ని పొందాడని కొందరంటారు. కేవలం పరశురాముడికి మాత్రమే సుదర్శన చక్ర ప్రావీణ్యత గురించి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు.

పురాణాల ప్రకారం శివుడి గురించి మహావిష్ణువు వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని శ్రీహరి కోరడంతో పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అందించాడు. అప్పటి నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడిచేతి చూపుడి వేలికి చక్రం ఉంటుంది.

కామెంట్‌లు లేవు: