9, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఇండియన్ రైల్వే:

*ఇండియన్ రైల్వే: కొత్త సర్వీస్*

ఎవరైనా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఒకటీ లేదా రెండు బ్యాగుల లగేజీని తమతో తీసుకెళ్తుంటారు. కొంత మందికి మాత్రం నాలుగైదు లగేజీ బ్యాగులు ఉంటాయి. వాటిని మొయ్యలేక, తీసుకెళ్లలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే శాఖ కొత్త సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. 


ఇందుకోసం రైల్వే శాఖ... బుక్‌బ్యాగేజ్ ( *Book Baggage* ) అనే App తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఈ సర్వీసును ప్రయాణికులు పొందవచ్చు. దీని వల్ల మీరు ఇంట్లో ఉండి... మీ లగేజీని ఇంటి నుంచి ఎక్కడికి పంపాలో డిసైడ్ చేయవచ్చు. మీరు కోరుకున్నట్లే లగేజీని తీసుకొని... దాన్ని శానిటైజ్ చేసి... మీరు చెప్పిన చోటికి రైల్వే శాఖ తరలిస్తుంది. అంటే... మీరు రైల్వేస్టేషన్‌కి లగేజీని మీతోపాటూ తెచ్చుకోవాల్సిన పనిలేదు. దాని దారిన అది మీరు వెళ్లాలనుకున్నచోటికి యాప్ సర్వీస్ ద్వారా వెళ్లిపోతుంది. 


నిజానికి మీరు బుక్ బ్యాగేజ్ ద్వారా అప్లై చేసుకుంటే... మీ ఇంటి నుంచి తీసుకెళ్లే లగేజీని... రైల్లోనే ప్రత్యేక బోగీలో ఉంచుతారు. అది మీరు ఎక్కే రైలు కావచ్చు లేదో మరో రైలు కావచ్చు. ఏదైతేనేం... మీ ప్రయాణం ఎంత వేగంగా జరుగుతుందో, మీ సామాన్లు కూడా అంతే వేగంగా డెస్టినేషన్ చేరుకుంటాయి. మీరు రైలు దిగి... మీ గమ్యానికి చేరుకోగానే... మీ లగేజీని... అక్కడకు తెచ్చేస్తారు. ఇందుకోసం ప్రయాణికులు ఒక్కో బ్యాగుకీ రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఇతరత్రా ఎన్ని ఖర్చులున్నా... వాటితో ప్రయాణికులకు సంబంధం లేదు. రైల్వే శాఖ ఆ యాప్ ద్వారా ఈ సర్వీసును మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ట్రావెలర్స్‌కి ఈ సదుపాయం బాగా ఉపయోగపడగలదు. 


డెలివరీ ఇలా ఉంటుంది. ముందుగా మీరు లగేజీ ఇవ్వగానే దాన్ని రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లి... 360 డిగ్రీల్లో అంటే... మొత్తం శానిటైజ్ చేస్తారు. ఇందుకోసం ఫస్ట్ అల్ట్రావయలెట్ లైట్ వాడుతారు. తర్వాత లగేజీని ప్యాక్ చేస్తారు. అందువల్ల మీ లగేజీ పాడవ్వదు. మీరు యాప్ సర్వీస్ ద్వారా... మీ లగేజీ ఎక్కడుందో ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లగేజీకి ఎలాంటి సమస్యలూ రాకుండా పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని రైల్వే శాఖ తెలిపింది.


ఈ సర్వీస్ పొందేందుకు మీరు ముందుగా బుక్ బ్యాగేజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 గంటల తరవాత నుంచి మీకు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. 3 గంటల తర్వాత మీ లగేజ్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు హోమ్ నుంచి లగేజీ డెలివరీకి ఆర్డర్ ఇస్తే... మీరు ఎక్కే రైలు బయలుదేరే 3 గంటల ముందే లగేజీని తీసుకుపోతారు. తద్వారా మీరు ఎక్కే రైలులోనే లగేజీ కూడా ఉండేలా చేస్తారు. 


లగేజీ డెలివరీకి ముందే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రైలు స్టేషన్ నుంచి బయలుదేరే పావు గంట ముందే రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని బ్యాగులు ఉంటే... అన్ని రూ.125లు చెల్లించాల్సి ఉంటుంది. ట్రైన్ గమ్యానికి చేరుకున్న తర్వాత 3 గంటల్లో మీ లగేజీ మీరు కోరుకున్న చోటికి తెస్తారు. 


ఈ సర్వీసు చాలా బాగుందని ప్రయాణికులు చెబుతున్నారు. కొంత మంది ముసలివారు సామాన్లు మోయలేరు. అలాంటి వారికి ఈ సర్వీస్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులు, ఫిల్మ్ షూటింగ్ వారు... భారీ ఎత్తున లగేజీని తమతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఈ సర్వీస్ ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: