9, మార్చి 2021, మంగళవారం

_శివరాత్రి జాగారం , ఉపవాసం ఎందుకు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*🚩_శివరాత్రి జాగారం , ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?_🚩*


🕉🌻🕉🌻🕉🌻🕉🌻


శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు.  ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం.  వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి.  పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.  ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి,  భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు.  శివపార్వతుల కల్యాణం చేస్తారు.  రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో,  చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు.  శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.


*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు?  జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు?*  అంటే దానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు.  అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు.  లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు.  గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది.  ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు.  నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.


అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట.  అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు.  హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట.  ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట.  అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు.  ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.

సేకరణ: వాట్సాప్ సందేశం. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: