18, జూన్ 2021, శుక్రవారం

అమ్మ అనుగ్రహం*

 *అమ్మ అనుగ్రహం* 

*****************

"డాక్టర్ గారు ఫోన్ చేసారు బ్లడ్ రిపోర్ట్ వచ్చిందిట "టైఫాయిడ్"అని చెప్పారు. అన్నారు "రామనాధం గారు.


"టైఫాయిడా!?.....అంది కంగారుగా శకుంతలమ్మ.


" ఓ పది రోజులు బాగా రెస్ట్ తీసుకుని.... జాగర్త గా మందులు వాడితే తగ్గిపోతుంది కంగారు పడకు" అన్నారు రామనాధం గారు.


"నా భయం,......కంగారు,.... జ్వరం గురించి కాదు.....జరుగుబాటు గురించి"....అంది నీరసంగా శకుంతలమ్మ.


"ఏదో తంటాలు పడాలి....తప్పదు మరి" అన్నారాయన.


"పెద్దమ్మాయి కి ఫోన్ చేసి చూస్తాను" అంటూ రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసారు.


"హలో..హలో....వసంతా!...ఆ...ఆ...నేనే నమ్మా!.....అమ్మ బ్లెడ్ రిపోర్ట్ లు వచ్చాయి,. టైఫాయిడ్...అని చెప్పారు....బాగా జ్వరం, ...ఒళ్ళు నెప్పులూ....బాగా నీరసంగా ఉంది."


"అయ్యో!! ఇప్పుడెలా నాన్నా! నేను వద్దామంటే మీ మనవడికి సెమిస్టర్ పరీక్షలు,....ఆయన కూడా ఉండటంలేదు, ఆయన ప్రోజెక్ట్ పనిమీద రేపు సింగపూర్ వెడుతున్నారు. నెల రోజుల వరకూ రారు.


మీరేమో అక్కడ ఒక్కళ్ళూ ఉండద్దంటే వినరు.వీలైతే ఎవరినైనా సాయం తీసుకుని ఫ్లైట్ లో వచ్చెయ్యండి" అంది.


"సరే.....చూస్తాం వసంతా! "అని స్పీకర్ ఆపి ఫోన్ పెట్టేసారు.


"పోనీ.....చిన్నదానికి ఫోన్ చేస్తారా!?.....అది రాగలదేమో".....అంది శకుంతలమ్మ ఆశగా!


సరేనంటూ, ఫోన్ రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసారు.


"హలో....హలో.... సుజాతా!...ఆ...ఆ...నేనే....అమ్మకి టైఫాయిడ్ అని చెప్పారు.ఓ పది రోజులు నువ్వు రాగలవేమోనని"......


"రేపటి నుండి నాకు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఉంది నాన్నా!.....లేకపోతే తప్పకుండా వచ్చేదాన్ని. మీకు కూడా స్పాండిలైటిస్, బేక్ పెయిన్ ఉన్నాయి కదా! అమ్మకి బాగా తగ్గేవరకూ ఏదైనా ఏజెన్సీ నుంచి అన్ని పనులకీ ఓ మనిషిని పెట్టుకుంటే మంచిది" అంది


"విన్నావుగా.....అదీ సంగతి" అన్నారు ఫోన్ ఆఫ్ చేసి.


"ఏంచేస్తాం ......ఎవరి ఇబ్బందులు వాళ్ళవి......మన తిప్పలేవో మనం పడవలసిందే"... అంది శకుంతలమ్మ.


శకుంతలమ్మ కి జ్వరం బాధ కంటె కూడా, మర్నాటి నుండి మొదలయ్యే "దేవీ నవరాత్రి పూజలు" గురించే ఎక్కువ బాధగా ఉంది. ప్రతి సంవత్సరం పది రోజులు కలశ పెట్టి నవావతారాలనూ, ప్రతి రోజూ పూజించి, ప్రత్యేక నివేదనలు చేసి, ప్రతిరోజు సువాసినులకి వాయన తాంబూలాలు, పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం అలవాటు ఆవిడకి.


ఈ సంవత్సరం పూజ మాట అటుంచి, కనీసం దీపం పెట్టుకునే భాగ్యం కూడా లేదని బాధగా ఉంది.


"ఎదురుగా గోడ మీద కలకలలాడుతూ అభయ హస్తం తో, కరుణా పూరిత దృక్కులతో , దివ్య మందహాసం తో ఉన్న అమ్మవారి పటానికి నమస్కారం చేసి దీనంగా మనసులోనే వేడుకుంది "ఎప్పుడూ నిన్నే భక్తి శ్రద్ధలతో కొలుస్తూ, నీవు తప్ప వేరు దిక్కు లేదని నమ్మిన దాన్ని , నువ్వే నాకు ఏదో దారి చూపి సహాయ పడు తల్లీ!" అని పదే పదే వేడుకుంది.


రామనాధం గారికి ఏం చెయ్యాలో తోచట్లేదు....'ఈ అవసర సమయంలో సహాయం ఎవరిని అడగాలా, ఎవరు సహాయ పడతారని ' ఆలోచిస్తున్నారు.


**********


కాలింగ్ బెల్ మోగింది,....... మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీశారు రామనాధం గారు.


ఎదురుగా.....గౌరి.... నవ్వుతూ......"నమస్తే అంకుల్" అంది.


"గౌరీ........నువ్వా!!?.....ఎలా ఉన్నావమ్మా!?.... రా..... లోపలికి.... అంటూ , హాస్టల్ నుంచి ఎప్పుడొచ్చావు?" అన్నారు కూర్చోమని సోఫా చూపిస్తూ!


"నిన్న రాత్రి వచ్చానంకుల్..... ఇప్పుడు దసరా శెలవులు. పండగయ్యేవరకూ ఉంటాను. మిమ్మల్ని,. ఆంటీనీ చూసి వెళదామని వచ్చాను" అంది.


రవణమ్మ గారి కూతురు గౌరి. ఇంటరు రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే పోయాడు. రవణమ్మ గారు కొందరి ఇంట్లో వాడుకగా వంటలు చెయ్యడం, పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు, తయారు చేసి అమ్మడం చేస్తూ ఉంటుంది. గౌరి చాలా తెలివైన పిల్ల......చురుకు కూడా, తల్లికి పనిలో సహాయ పడుతూనే, చదువులో ముందుంటుంది. టెంత్ క్లాసు 90% మార్కులతో పాసైంది . రవణమ్మ గారు ఇంక చదివించలేనంటే ..


రామనాధం గారు, గౌరిని" దీనదయాళ్ చారిటబుల్ ట్రస్ట్ వారి బాలికల హాస్టల్ "లో చేర్పించారు. అక్కడ ఆర్ధికంగా వెనుక బడ్డ తెలివైన విద్యార్ధులకి, ఉచిత విద్య , వసతి కల్పిస్తారు. వారు కనపరిచే ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు.


రామనాధం గారు రవణమ్మ గారి కుటుంబానికి అప్పుడప్పుడు, ఆర్ధిక సహాయం కూడా చేసారు. అందుకే గౌరి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళని కలిసి వెడుతూ ఉంటుంది.


"అంకుల్!... ఆంటీ లేరా?....కనిపించలేదు" అంది లోపలికి చూస్తూ!.


"ఉందమ్మా! పడుకుంది..... నాలుగు రోజుల నుండి జ్వరం..... టైఫాయిడ్ అన్నారు డాక్టర్"


"అయ్యో!... .మరి మీకు సహాయం. ఎవరు!?"


"మా అమ్మాయిలిద్దరూ రాలేని పరిస్ధితిలో ఉన్నారు. అదే ఏం తోచట్లేదు! "అన్నారు దిగులుగా.


"అంకుల్ మీకు అభ్యంతరం లేకపోతే నేను వచ్చి మీకు,...... ఆంటీకీ సహాయంగా ఉంటాను"


"నువ్వా!!??........ ఎందుకమ్మా!......నీకు శ్రమ"


"నాకు శ్రమేం లేదు అంకుల్, ఇంటికెళ్ళి అమ్మ తో చెప్పి,. నా బట్టలు, పుస్తకాలు తెచ్చుకుని వస్తాను. నాకిప్పుడు ఎలాగా శెలవలే కదా! మీరు నాకు చేసిన సహాయానికి, ఇది నాకో అవకాశం మీ ఋణం తీర్చుకోవడానికి. ఒక గంటలో వస్తాను అంకుల్" అంటూ లేచింది.

**********


దేవుడు పంపినట్టు "దేవత" లా వచ్చిన గౌరి రాకతో సగం భారం తీరింది రామనాధం దంపతులకి.


శకుంతలమ్మ గారి మనసు తెలిసిన గౌరి,. ఉదయాన్నే లేచి, దేవుడి గది శుభ్రం చేసి, పూజా సామాగ్రి తోమి, .... స్నానం చేసి ఆరేసిన బట్టలు కట్టుకుని,. అమ్మవారికి ధూప దీపాలతో పాటు, , శకుంతలమ్మ గారి ని అడిగి..... ప్రసాదం కూడా చేసి నివేదించేది.


రామనాధం గారికి కూడా ఇబ్బంది లేకుండా సమయానికి,....బ్రేక్ఫాష్ట్, భోజనం ఏర్పాటు చేసేది.


శకుంతలమ్మ గారికి, సమయానికి మందులు వెయ్యడం , డాక్టర్ గారి సలహా అనుసరించి ఆహారం, పళ్ళరసాలు, తయారు చేసి సమయానికి ఇవ్వడం, స్పాంజి బాత్ చేయించి, బట్టలు మార్పించడం.......కన్నకూతురిలా ప్రేమగా, అభిమానంగా చేసేది.


పనంతా అయ్యాక,. కొంచెం సేపు తన పాఠాలు చదువుకునేది.


గౌరి సేవలతో , శకుంతలమ్మ గారి జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టింది.విజయ దశమి రానే వచ్చింది. శకుంతలమ్మ మెల్లగా లేచి గౌరి సాయంతో దీపం పెట్టింది దేవుడికి. పూజ పూర్తయిన తరువాత ఒక పళ్ళెంలో చక్కని చీర ,పసుపు కుంకుమ, పూలు పెట్టి అమ్మవారికి సమర్పించింది. ప్రతి సంవత్సరం అలా సమర్పించిన చీర గుడిలో అమ్మవారి కి ఇస్తుంది


ఈసారి ఆలా చెయ్యలేదు. "కులమత, వర్ణ, వయో, బేధాలెంచకుండా,....ప్రతి జీవిలో భగవంతుని చూడమన్న ఆర్యోక్తి ని స్మరించుకుని, మనిషి రూపంలో సమయానికి వచ్చి ఆదుకున్న "దేవత"లాంటి గౌరికే ఆ వాయినం తీసుకునే అర్హత ఉందని" భావించింది


గౌరిని కూర్చోపెట్టి, పసుపురాసి, బొట్టు పెట్టి, గంధం పూసింది, చేతికి అక్షింతలు ఇచ్చి, అమ్మవారికి సమర్పించిన చీర, పసుపు కుంకుమ, పూలు ఉన్న పళ్ళెం గౌరి చేతికిచ్చి "నువ్వే ఈ సంవత్సరం నేను సమర్పించే వాయినం అందుకుంటున్న అమ్మవారివి" అంది భక్తిగా కాళ్ళకి నమస్కరించి.


గౌరి కంగారు పడిపోయింది "నాకు నమస్కరించడం ఏంటి ఆంటీ" అని.


"తప్పులేదమ్మా! అమ్మవారి స్ధానం లో నిన్ను భావించి వాయినం ఇచ్చాను కనుక నమస్కరించవచ్చు" అంది శకుంతలమ్మ మనస్ఫూర్తిగా!


**********

శకుంతలమ్మ బాగా కోలుకుంది. దగ్గరలోని అమ్మవారి గుడికి వెళ్ళింది.


గుడిలో రవణమ్మ గారు కనిపించింది. కుశల ప్రశ్నలు అయ్యాక......"దసరాల్లో మీకు ఒంట్లో బాగులేదని

విన్నాను.....ఈసారి దసరాకి నేను మా గౌరి....మా తమ్ముడి ఊరు వెళ్ళాం".........


"ఆవిడ ఇంకా ఏమో చెప్తోంది శకుంతలకి అవేం వినిపించడం లేదు...... అమ్మవారి మూల విరాట్ కి తాను విజయ దశమినాడు గౌరికి వాయనంలో ఇచ్చిన చీర కట్టి ఉంది.......అమ్మవారి మూల విరాట్.....కరుణా మయ దృక్కులతో, మధుర మందహాసం తో...అభయ హస్తమిస్తూ.... కళ్ళముందు కదలాడుతోందంతే".....!?!


సమాప్తం.

కామెంట్‌లు లేవు: