13, ఫిబ్రవరి 2023, సోమవారం

నాడుల పేర్లు - వాటి స్థానములు .

: అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3 . 


 నాడి చూడకూడని వారు  - 


      అప్పుడే స్నానం చేసినవారికి , భుజించిన వారికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవారికి నాడిని పరీక్షించిన ఫలితం స్పష్టముగా తెలియదు . కావున ఆ సమయములలో నాడిని పరీక్షించరాదు . 


  నాడుల పేర్లు - వాటి స్థానములు . 


    నాభికందము నందు ఉండు నాడి సుషుమ్న . ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉండును . మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్ని కలసి మొత్తం 3 1/2 కోట్లు . ఇవి అన్నియు నాభికూర్మము నుంచి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించుచున్నవి . 


           ఈ సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు ఇ ళ , పింగళ నాడులచే తృప్తి కలుగుచుండును . వాటికి సరస్సులు అని పేరు . శరీరమునందు త్రిదోషములు ఎలా ప్రధానమో అదే విధముగా  ఈ నాడులు కూడా ప్రధానములు . మన ఉచ్చ్వాస నిశ్వాసమునకు హంస యని పేరు . 


       ఈ మూడు నాడులు వేణి బంధము వలే కలిసిమెలిసి త్రివేణి సంగమము పేరుతో లలాటం నందు కలిసి ఉండును . నాడి యందలి హంస యొక్క  గతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులుగా ఉండు సంచారములను తెలుసుకోగలము . 


              సుషమ్న నాడి వెన్నుపూసలో నుండి మెడమార్గములో బ్రహ్మ రంధ్రము చేరును . వెన్నుపూసకు బ్రహ్మదండము అని పేరు కలదు . అందులో ఉండు సుషమ్న నాటికి బ్రహ్మ నాడి  అని పేరు కలదు . బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతూ ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును . 


     ఇళ నాడి నాభికూర్మము నుండి హృదయము వద్దకు వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకు వచ్చును . అదేవిధముగా పింగళ నాడి కుడి ముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును . పంచభూతాలు , లోకములు , నదులు , కులములు , గుణములు మొదలగునవన్ని సుషమ్న నాడి యందు ప్రతిష్ఠములు అయి ఉన్నవి . 


                        తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  : రక్తహీనత గురించి సంపూర్ణ వివరణ  -


     మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తి బలహీనం అవుతారు . ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉండును.  ఇప్పుడు దీని గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.


 *  ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది.


 *  ఆయాసం , ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం , మతిమరుపు ఎక్కువుగా ఉండును. నాలుక మంటగా ఉండును.


 *  ఐరన్ లోపించటం వలన వచ్చే రక్తహీనత ఎక్కువుగా ఉండును.


 *  సరైన ఆహారం తీసుకోకపోవటం , సరైన వ్యాయామం చేయకపోవటం వలన కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవును .


 *  వ్యాధినిరోధక శక్తి తగ్గటం వలన అంటువ్యాధులు వీరికి త్వరగా వచ్చే అవకాశం కలదు. అందువలన ఆహారం నందు ఐరన్ ఎక్కువుగా ఉన్నవి తీసికొనవలెను.


 *  శరీరానికి కావలసిన ఐరన్ లభించుటకు పండ్లు , పుట్టగొడుగులు , ఆకుకూరలు , తీగకు కాసే కాయగూరలు , ఖర్జురము , తేనె , సోయాబీన్స్ , బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి .


 *  వైట్ బ్రెడ్ , స్వీట్స్ , పంచదార , వేపుళ్లు , నిల్వపచ్చళ్ళు , మైదాపిండి మొదలగునవి వాడరాదు.


 *  కూరలలో నిమ్మకాయ పిండుకోవాలి. ఐరన్ శరీరం గ్రహించాలి అంటే C విటమిన్ అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం ఉత్తమం .


 *  తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురములో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.


 *  రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి వస్తుంది.


 *  మద్యపానం , ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువుగా చేస్తాయి .


 రక్తహీనత కొరకు నేను ప్రయోగించిన అనుభవయోగం  -


        ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు ఇవ్వడం జరిగింది . ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్ పండు తినిపించడం చేశాను . కేవలం నలభై రోజులలోనే శరీరం నందు సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యినది.  దానిమ్మ జ్యూస్ కొరకు ఉపయోగించే కాయలు తియ్యగా పెద్ద సైజు తో ఉండేవి తీసుకోండి . దానిమ్మ జ్యూస్ తాగలేనివారు ఆపిల్ జ్యూస్ నందు కూడా గోధుమగడ్డి చూర్ణం కలుపుకుని తాగవచ్చు .


   శారీరక బలాన్ని పెంచే సులభ ఆయుర్వేద యోగం - 


    ఇప్పుడు నేను చెప్పబోవు ఈ ఆయుర్వేద యోగం శరీరానికి అమితమైన బలాన్ని చేకూర్చును . బూస్ట్ , హార్లిక్స్ వంటి వాటిని పిల్లలకు పాలల్లో కలిపి ఇచ్చినను ఎటువంటి ఉపయోగము లేదు . 


      నేను వివరించబోయే ఈ ఆయుర్వేద చిట్కా మీకు , మీ పిల్లలకు ,వృద్దులకు అత్యంత ఉపయోగకారిగా ఉండును . 


  బాదం 250 గ్రాములు .

 

  సోంపు 250 గ్రాములు .


 పటికబెల్లం 250 గ్రాములు చిప్స్ 


  బాదం రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి ఎండించాలి . బాగా ఎండిన తరువాత మెత్తటి పౌడర్ కొట్టవలెను.


  సోంపు కొంచం వేయించి మెత్తగా పౌడర్ కొట్టవలెను.


 పటికబెల్లం మెత్తటి పౌడర్ కొట్టవలెను.


   మూడింటిని కలిపి ఉదయం , సాయంత్రం ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగవలెను. 


  చిన్నపిల్లలకి 1 స్పూన్ , పెద్దవారికి 2 స్పూన్స్ చొప్పున వాడవలెను. 


  షుగర్ లేనివారు పటికబెల్లం 50 గ్రాములు పెంచుకొన్నా పర్వాలేదు .


      శరీరంలో  నీరసం, నిస్సత్తువ పోయి శరీరానికి చాలా బలం కలుగును . 6 నెలలు విడవకుండా వాడిన అద్భుత ఫలితాలు వస్తాయి. ఇది నా అనుభవ యోగం 


   ఇటువంటి మరిన్ని అద్భుత యోగాలు నా గ్రంథాలలో కలవు . 


  .

కామెంట్‌లు లేవు: