*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
* 607వ రోజు*
అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము
అధ్యాత్మము అదిభూతము అధిదైవతములు
చెవి అధ్యాత్మము అయితే శబ్ధము అదిభూతము. దిక్కులు అధిదైవతములు. చర్మము అధ్యాత్మము అయితే స్పర్శ అదిభూతము, గాలి దానికి అదిదైవతము. కళ్ళు అధ్యాత్మము అయితే రూపము అది భూతము సూర్యుడు దానికి అదిదైవతము. నాలుక ఆధ్యాత్మము అయితే రుచి దానికి అదిభూతము నీరు దానికి అదిదైవతము. ముక్కు అధ్యాత్మము అయితే వాసన దానికి అదిభూతము భూమి దానికి అదిదైవతము. వీటిని బుద్ధి ఇంద్రియత్రయము అంటారు. పాదములు, విసర్జకావయవము, జననేంద్రియము, చేతులు, నోరు కర్మేంద్రియములు అనునవి అధ్యాత్మికములు. పైన చెప్పిన అవయవములకు వరుసగా నడక, విసర్జనము, ఆనందము, పని, మాట అధిభూతములు. వాటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని అధిదైవతములు. అహంకారము, మనసు, బుద్ధి ఆధ్యాత్మకములు, వీటికి అభిమానము, సంకల్పము, నిశ్చయము అధిభూతములు. వాటికి మేధస్సు, చంద్రుడు, బ్రహ్మ అధిదైవతములు. ఇవన్నీ విష్ణువు నుండి పుట్టి లయమౌతాయి. అవ్యక్తము అంటే మూల ప్రకృతి. అందులో పురుష చైతన్యము చేరితే ఆ ప్రకృతి చైతన్యవంతమౌతుంది. అప్పుడు ఈ ప్రపంచమంతా అంతా వైభవంతో నడుస్తుంది. ఈ సృష్టికంతా ఆధారం విష్ణువు. పరమశివుడి అనుమతితో బ్రహ్మ జననమరణములు నిర్వహిస్తూ ఉంటాడు " అని సనత్సుజాతుడు నారదుడికి చెప్పాడు " అని చెప్పి భీష్ముడు " ధర్మజా ! ఈ సృష్టికంతకూ మూలము 25వ తత్వము అయిన పరమాత్మ. వేద వేదాంత పురాణ వేద్యుడైన ఆ పురుషుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు. అతడే కాలాంతకుడైన అచ్యుతుడు, అనంతుడు, యోగి జనముల హృదయములలో నివసించే వాడు, విష్ణువు, అద్వయుడు, అసంగుడు. అతడే పరమాత్మ " అని భీష్ముడు పలికాడు.
విష్ణుస్వరూపము
ధర్మరాజు " పితామహా ! మహానుభావులు అగ్నులను తమయందు సమాహితం చేసుకుంటారు కదా ! అటువంటి వారు విష్ణుమూర్తిని ఎటువంటి వాడిగా భావిస్తారు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! క్షీరసాగరమధనంలో అమృతం పుట్టగానే దేవతలు దానవులకు యుద్ధం జరిగింది అందులో దానవులు దేవతలను జయించి అమృతము కైవశము చేసుకున్నారు. దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు ఆకాశము నుండి " దేవతలారా ! నేను మిమ్ము గెలిపించడానికి వస్తున్నాను " అన్న మాటలు వినిపించాయి. అంతలో విష్ణుమూర్తి గరుఢారూడుడై శంఖ చక్ర గధా సహితుడై అసురుల మీదకు యుద్ధానికి వచ్చి వారిని జయించి వెంటనే అంతర్ధానం అయ్యాడు. అది చూసి ఆశ్చర్యచకితులైన దేవతలు " ఈ మహానుభావుడు ఎవరు ? " అని బ్రహ్మదేవుడిని అడిగారు. బ్రహ్మదేవుడు " దేవతలారా ! ఆయన విష్ణుమూర్తి వైకుంఠములో ఉంటాడు. ఆయన ఇలా ఉంటాడు అని నాకు వర్ణించడానికి శక్తిచాలదు. అయినా ఆయన రూపము తెలుసుకోవడానికి నేను ఒకకథ చెప్తాను.
మునులతో గరుత్మంతుడు
హిమాలయాలలో మునులు, సిద్ధులు తపసు చేసుకుంటున్న తరుణంలో అక్కడకు గరుడుడు వచ్చి వారికి నమస్కరించాడు. వారు అతడిని సుఖాసీనులను చేసి " గరుడా ! నిన్ను ఒక విషయం అడగాలని ఉంది " అని అడిగారు. అందుకు గరుడుడు " ధన్యుడను అడగండి చెప్తాను " అని అన్నాడు. మునులు సిద్ధులు " గరుడా ! విష్ణు భక్తుడవై సదా విష్ణువుకు సమీపంలో ఉండే నీవు మాకు విష్ణుతత్వము ఎరిగించగల సమర్ధుడవు. కనుక భక్త సులభుడైన విష్ణుతత్వము గురించి మాకు వివరించు " అని అడిగారు. మహానుభావులారా ! ఈ మూడు లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు అని మాత్రమే నాకు తెలుసు. అంతమాత్రాన నాకు అన్ని తెలుసునని అనుకోవడం కష్టం. మీకు నాకే కాదు ఎవరికైనా విష్ణుతత్వము గురించి చెప్పడము కష్టమే. నేను విన్న ఆయన కథలను కావాలంటే చెప్తాను. నేను దేంద్రుడిని జయించి అమృతభాంఢమును తీసుకు వెడుతున్న తరుణంలో ఆకాశం నుండి " గరుడా ! నీ పరాక్రమానికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో " అనే మాటలు వినిపించాయి. అప్పుడు నేను " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిపి వరాలను ఇవ్వండి " అన్నాను. ఆ మాటలకు బదులుగా ఒక నవ్వు వినిపించి తరువాత " కాలక్రమేణా నీకు నేనెవరో తెలుస్తుంది. నీవు నా వాహనముగా ఉండు. నీకు వ్యాధులు సోకవు మరణం ఉండదు. అసురులను జయిస్తావు " అన్న మాటాలు చెప్తూ ఒక కాంతిపుంజము నా ఎదుట నిలిచింది. నేను ఆకాంతి స్వరూపానికి చేతులెత్తి నమస్కరించి " మహానుభావా ! నేను నీకు వాహనమౌతాను. నీవు ఎక్కిన రధముకు నన్ను ధ్వజముగా నియమించమని నేను కోరుకుంటున్నాను " అని అడిగాను. " అలాగే జరుగుతుంది " అని చెప్పి ఆ కాంతి స్వరూపం మాయమయ్యింది. ఆ మాటలకు ఆశ్చర్యానందాలు కలిగాయి.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి