23, ఫిబ్రవరి 2026, సోమవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

        *శ్రీ మహావిష్ణు పురాణం*

               ➖➖➖✍️ 

                  3 వ భాగం 

 

*పరాశర మహర్షి కథ:*```

వసిష్ట మహర్షికి అరుంధతిలకు నూరుగురు కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడు శక్తి మహర్షి. అతనికి అదృశ్యంతి అర్ధాంగి అయ్యింది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాకముందు ‘గాధిరాజు కుమారుడు కౌశికుడు’ అనే నామంతో రాజు అయ్యాడు. 


ఒకసారి సేనలతో వేటకు వెళ్లి అలసి వసిష్ట మహర్షి ఆశ్రమానికి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు.


వసిష్టుడు కౌశికుని, అతని సేనలను ఆహ్వానించి ఆదరించి “విందుభోజనం ఏర్పాటు చేస్తాను, ఆరగించండి” అని అన్నాడు. 


రాజు అనే అహంకారం, గర్వం కలిగిన కౌశికుడు “నాకు,నా అపార సైన్యానికి విందుభోజనం అడవిలో ఎలా ఏర్పాటు చేయగలరు? చేయలేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను” అన్నాడు. 


సరేనన్న వసిష్ట మహర్షి “మీరు సమీపంలో గల నదిలో స్నానాదులు చేసి రండి. విందుభోజనం సిద్ధం అవుతుంది” అని వారిని నది వద్దకు పంపాడు.  


కౌశికుడు,అతని సైనికులు స్నానాదులు చేసి రాగానే షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టాడు. అందరూ కడుపు నిండా తిని తృప్తి చెందారు.


కౌశికుడు ఆశ్చర్యం చెంది “కారడవిలో ఇంతమందికి విందు భోజనం ఎలా ఏర్పాటు చేయగలిగారు” అని వసిష్టుని అడిగాడు. 


తన వద్ద గల శబల అనే కామధేనువు కుమార్తె అయిన గోమాతను వసిష్టుడు చూపించి, “నా తపస్సుకి మెచ్చి దేవతలు ఈ గోవుని ఇచ్చారు. ఈ గోమాత కోరినవన్ని ప్రసాదిస్తుంది” అని చెప్పగానే కౌశికునికి అసూయ జనించింది. 


“ఇటువంటి గోవు రాజుల వద్ద ఉండాలి. సకల ప్రజలకు, రాజ్యానికి ఉపయోగపడుతుంది. నాకు ఇవ్వండి” అని అడిగాడు.


వసిష్టుడు నిరాకరిస్తూ “గోమాత తనంత తానుగా నా దగ్గర ఉంటోంది. తనకు నచ్చినవారి వద్దనే ఉంటుంది. బలవంతాన ఎవరూ తీసుకెళ్లలేరు” అనగానే అహంకారం, గర్వం కలిగిన కౌశికుడు “నేను ఈ దేశరాజుని. నా సేనలతో ఈ శబల గోవుని తీసుకెళ్లే అధికారం నాకుంది” అని సైనికులను గోవుని, దూడని తమ వెంట తీసుకు రమ్మని ఆదేశించాడు. 


వసిష్టుడు శబలకు నమస్కరించి మౌనంగా ఉన్నాడు.


శబల శరీరం నుండి అశేష సైన్యం పుట్టుకు వచ్చి కౌశికుని సేనలను క్షణాలలో నాశనం చేసింది. 


కౌశికుడు అవమానం పొంది అనేక అస్త్రశస్త్రాలను వసిష్టుడిపై ప్రయోగించాడు. 


అవి అన్ని వసిష్టుడి తేజస్సులో కలసిపోయాయి. వసిష్టుడి తపశక్తి ముందు తన రాజశక్తి పనికిరాదు అని కౌశికుడికి అర్ధం అయ్యింది. తాను వసిష్టుడి వలె బ్రహ్మర్షి అయ్యి తపశక్తి సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు.


రాజ్యం కుమారులకు అప్పగించి విశ్వామిత్రుడిగా మారి తపస్సుకి వెళ్లి పోయాడు. కానీ మనస్సులో వసిష్టుడి పై ద్వేషం, శత్రుత్వం పెంచుకున్నాడు. అవకాశం లభించినప్పుడల్లా వసిష్టుని ఓడించడానికి, పరాభవించడానికి ప్రయత్నించేవాడు. కానీ ప్రతిసారి విఫలమయ్యేవాడు. ద్వేషం పెరిగి పెరిగి వసిష్టుడు, వసిష్టుడి కుటుంబాన్ని నాశనం చేయాలనే పంతం పెంచుకున్నాడు.


కొంతకాలానికి శక్తి మహర్షి భార్య అదృశ్యంతి గర్భవతి అయ్యింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే పరాశరుడు తండ్రి, తాతల నుండి వేదశాస్త్రాలు, పూర్వ కల్పాలలో జరిగిన పురాణ కథలు విని ఆకళింపు చేసుకున్నాడు. “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రం అనుక్షణం జపించడం ఆరంభించాడు.


ఇక్ష్వాకు వంశ రాజైన కల్మషపాదుడు వేటకు వచ్చి తనకు అడ్డంగా పాదచారియై నడుస్తున్న శక్తి మహర్షి దారి ఇవ్వలేదు అన్న కోపంతో “యాచక బ్రాహ్మణా! దారి ఇవ్వు” అని అశ్వాన్ని పట్టుకున్న కళ్ళెంతో కొట్టి అదిలించాడు. 


శక్తికి కోపం వచ్చి “రాజు అనే అహంకారంతో బ్రాహ్మణుని అవమానించావు. కనుక బ్రహ్మరాక్షసుడివి అవ్వు!” అని శపించాడు.(ఈ శాపం వసిష్ట మహర్షి ఇచ్చాడు అని భారతంలో ఉంది).


కల్మషపాదుడు బ్రహ్మరాక్షసుడై నరమాంస భక్షణ చేస్తూ జీవించసాగాడు. 


ఈ సంగతి తెలిసిన విశ్వామిత్రుడు తన తపఃశక్తితో కల్మషపాదుని వశం చేసుకుని, వసిష్టుడు, అతని కుమారులపై దాడికి పంపాడు. 


వసిష్టుడు తపస్సుకి వెళ్లడంతో కల్మషపాదుడు శక్తితో సహా వసిష్టుని నూరుగురు కుమారులను చంపివేశాడు.  


వసిష్టుడు పుత్రుల మరణం పై దుఃఖపడినా విశ్వామిత్రుడి పై ప్రతీకార చర్యలకు పాల్పడలేదు.


అదృశ్యంతి మాత్రం తన భర్త శక్తిని చంపిన రాక్షస దానవ జాతిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని పట్టు పట్టింది. 

జన్మించిన పరాశరుడు ఇవేమి పట్టించుకోకుండా నారాయణ స్మరణలో ఉండటం చూసి ఆగ్రహం చెంది “కుమారా! భర్తను కోల్పోయిన తల్లిని పట్టించుకోకుండా పరమాత్మ ధ్యానంలో కాలం గడుపుతున్నావు” అని దుఃఖించసాగింది.


తల్లి దుఃఖానికి చలించిన పరాశరుడు అదృశ్యంతిని “ఏమి చేస్తే నీ దుఃఖం తీరుతుంది?” అని అడిగాడు.  


“నీవు పుట్టక ముందే నీ తండ్రిని, పినతండ్రులను చంపి నిన్ను అనాథను చేసిన దానవ జాతిని నాశనం చేసి నా పగ తీర్చి దుఃఖము తొలగించుము” అని చెప్పింది. 


తల్లి కోరిక తీర్చడానికి పరాశరుడు ఆశ్రమ ధర్మం వదిలి శత్రు సంహారాలైన అధర్వణ మంత్రాలతో యాగం చేయడం ఆరంభించాడు.


మంత్రాల మహిమకు దానవులందరూ వచ్చి యాగకుండపు అగ్నిజ్వాలలలో పడి బూడిదైపోసాగారు. 


దానవులు పరుగు పరుగున వసిష్ట మహర్షి వద్దకు వెళ్లి మనవడు పరాశరుడు చేసే యాగం నుంచి రక్షించి ప్రాణాలు కాపాడమని శరణు వేడారు. 


వసిష్టుడు పరాశరుడు వద్దకు వచ్చి “పరాశరా! నారాయణ నామంతో పునీతమైన నీ మదిలో పగలు- ప్రతీకారాలు ఉండకూడదు. నీ తండ్రి, పినతండ్రులు దానవుల చేతిలో మరణించడం విధి లిఖితం. శాంతించి యాగం ఆపివేయి” అని ప్రబోధించాడు.


తాత మాటకు అంగీకరించి పరాశరుడు యాగం ఆపివేశాడు. 


దానవ, రాక్షస వంశ మూల పురుషుడు, బ్రహ్మపుత్రుడు అయిన పులస్త్య బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై పరాశరుని వరం కోరుకోమన్నాడు. 


పరాశరుడు నమస్కరించి “మహాత్మా! శబ్దబ్రహ్మ అయిన పరమాత్మ విష్ణువు మహిమను స్మరణమాత్రం చేత గ్రహాంచగల దివ్య జ్ఞానాన్ని, భగవంతుని లీలా పురాణాలను మధురంగా వినిపించగల ప్రతిభా పాండిత్యాలను ప్రసాదించండి” అని కోరాడు.


పులస్త్య బ్రహ్మ సంతోషించి “పరాశరా! తల్లి గర్భంలో ఉండగానే నారాయణ మంత్రజపం చేశావు. నారాయణుని పరమ భక్తుడివి. నీవు కోరిన వరం ఇస్తున్నాను. జగదాధారుడైన విష్ణుమూర్తి లీలా విశేషాలను మొదట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి వివరించాడు. దక్ష ప్రజాపతి పురుకుత్సునికి, పురుకుత్సుడు నాకు ఉపదేశించాడు. ఈ పురాణ పాండిత్యం అంతా నీకు కరతలామలకం అవుతుంది.


నీవు ప్రవచనం, గానం ద్వారా లోక వ్యాప్తి చేసి కీర్తి పొందుతావు. నీ ఆరాధ్య దైవం విష్ణువు నీకు కుమారుడై జన్మించి కృష్ణద్వైపాయనుడు అనే నామం పొంది అష్టాదశ పురాణాలు గా రచించి లోకానికి అందిస్తాడు. నీకు అత్యంత ప్రీతిప్రాతమైన “మహావిష్ణు పురాణాన్ని” నీ గ్రాత మాధుర్యంతో, దివ్యజ్ఞానంతో లోకప్రచారం చేసి ధన్యత చెందుము” అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.✍️

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో-


-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు

```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: