అల్లసాని పెద్దన :
సాహితి సమరాంగణ చక్రవర్తి కృష్ణరాయని ఆస్థానకవియు, ఆంతరంగికుడునై మసలినవాడు. ఈతడు అష్టదిగ్గజములలో నొకడని ప్రతీతి. కృష్ణరాయని కంకితమిచ్చిన మనుచరిత్రము ఒక రసవత్తర ప్రబంధము. భువనవిజయము నందీతనికి జరిగిన మర్యాదలు, మన్ననలు ఏ కవియును నోచుకొనలేదు.
“భువనవిజయ” మందొకనాడు కృష్ణరాయడు బంగారు పళ్లెరమున గండపెండెరము ఒకటి తెప్పించి సంస్కృతాంధ్రములందు సమముగా కవిత్వము చెప్పగలవారందు కొమ్మనినాడు. సభ్యులందరు మిన్నకుండిరట. దీనికి కృష్ణరాయ లాశ్చర్యము చెంది
*ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగా*
*నొద్దిక “నాకొసంగు'మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?*
యని సగము పద్యము చెప్పగా పెద్దనలేచి,
*పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే?*
*పెద్దన కీదలంచినను, బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!*
యని మిగిలిన సగమును జవాబుగా పూరించినాడు. కృష్ణరాయడు పెద్దనకీయ తలంపు మనసు నందుంచుకొనినాడో యేమో ప్రాసస్థానమున పెద్దన వచ్చునట్లే ముద్దుగాయని ద్విత్వ "ద" కారముతో ప్రారంభించినాడు.
〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి