🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శుక్రవారం 20 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *31వ భాగం*``
*మత్స్యావతార కథ*
*జలప్రళయం -వేదాల అపహరణ సప్తఋషుల నావను సత్య వత్రుడు అధిరోహించుట:*```
సత్యవ్రతుడు మహావిష్ణువు చెప్పినట్లు ధాన్య ఫల ఆహార పదార్థాల విత్తనాలు ఒక పెద్ద భాండంలో సేకరించి, ఆ భాండంతో మహాసముద్ర తీరానికి చేరుకున్నాడు. దర్భలతో ఒక దర్భాశయనం చేసుకుని తూర్పు దిశగా తల ఉంచి కూర్చున్నాడు. విత్తనాల భాండం పక్కన పెట్టుకుని మనస్సులో అష్టాక్షరి మంత్రం జపం చేస్తూ జల ప్రళయం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు.
శ్రీహరి చెప్పినట్టు ఏడురోజులు భూకాలమానం ప్రకారం గడిచింది. బ్రహ్మకు పగటికాలం పూర్తి అయ్యి రాత్రి రాగానే నిద్రాదేవత బ్రహ్మదేవుని ఆవహించింది. సృష్టి కార్యం ఆపి పద్మం మీదనే చేయి తలగడగా చేసుకుని నిదురించసాగాడు. భూమి పై కుంభవృష్టిగా ఏడు రోజుల నుండి కురిసే వర్షం వలన సముద్రాలు పొంగిభూమిని ముంచేస్తూ జలప్రళయం ఏర్పడింది.
నిద్రిస్తున్న బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు బయటకు వచ్చాయి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న సోమకాసురుడు అనే రాక్షసుడు నీటి నుంచి బయటకు వచ్చి వేదాలు సంగ్రహించి నీటిలోకి వెళ్లి పోయాడు.
దేవలోకాలు అన్ని కంపించాయి. బ్రహ్మ నిదురలోకి వెళ్లిన సమయంలో వేద ప్రక్రియల వలన దేవతలు సురక్షితంగా ఉంటారు.
దేవతలందరు విష్ణువుని రక్షించమని శరణు వేడతూ ప్రార్థించారు. భక్తవత్సలుడైన మహావిష్ణువు మహాజలథిలో వేల యోజనాలు పరిమాణం గల మత్స్యరూపంలో ప్రత్యక్ష మైనాడు. దేవతలు స్తుతించి వేదాలను సోమకాసురుని నుండి రక్షించమని ప్రార్ధించారు.
మత్స్యావతారుడు దేవతలకు అభయం ఇస్తూ “దేవతలారా! సోమకాసురుడు రాక్షసరాజైన పులస్త్య బ్రహ్మ మనవడు, విశ్రవసు కుమారుడు. విశ్రవసు సంధ్యాసమయంలో సోమరసం త్రాగి భార్యతో కలవడం వలన సోమకాసురుడు పుట్టాడు. పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టడం వలన అమేయ బలవంతుడై ముత్తాత అయిన బ్రహ్మదేవుని ముఖాల నుంచి వెలువడిన వేదాలు అపహరించాడు. నేను ఆ అసురుని సంహరించి వేదాలను కాపాడుతాను” అని జలర్ణావంలో ఈదుతూ ముందుకు వెళ్ళాడు.
భూమి అంతా నీటిలో మునిగి సత్యవత్రుడు కూర్చున్న దర్భాసనం తేలుతూ ప్రవాహముతో పాటు ముందుకు పయనించసాగింది. ఆకాశానికి చిల్లు పడినట్లు వాన పడుతోంది. మేఘాలు దట్టంగా కమ్మటం వలన జగత్తంతా అంధకార మయం అయ్యింది. భయానక వాతావరణంలో కూడా సత్యవత్రుడు నారాయణ మంత్రం జపిస్తున్నాడు. చీకటిలో దర్భాసనం నీటి పైన ఎటువైపు వెళుతోందో తెలియడం లేదు.
గాఢాంధకారంలో ఒక దివ్య కాంతి పుంజం దూరాన కనిపించింది. సత్యవ్రతుడు ఆ కాంతిపుంజం తనవైపు రావడం గమనించాడు. విష్ణువు చెప్పి నట్లు అది సప్త ఋషుల తేజస్సు యొక్క ప్రకాశము అని అర్థం చేసుకున్నాడు. కాంతిపుంజం కంటిచూపు దగ్గరకు రాగానే పెద్ద నావ ఆవెలుగులో కనిపించింది. నావలో కూర్చున్న సప్తఋషుల తేజస్సే కాంతిలాగా ప్రసరిస్తోంది అని గ్రహించాడు.
నావ దగ్గరకు వచ్చింది. దివ్య తేజస్సుతో వెలుగుతున్న సప్త ఋషులకి సత్యవ్రతుడు నమస్కరించాడు. నావని చుట్టుకుని ఒక మహాసర్పం కనిపించింది. ఆ మహాసర్పం భూమిని ప్రళయానంతరం తలమీద మోసే నారాయణాంశుడైన అనంతుడు (ఆదిశేషుడు) అని గ్రహించి నమస్కారం చేశాడు.
మీనావతారుడైన నారాయణుడు నీటి నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. సత్యవ్రతుడు నమస్కరించి శరణు కోరుతూ స్తుతించాడు. మీనావతారుడు సంతసించి “సత్యవ్రతా! పేరుకు తగ్గట్టు సత్యాన్నే జీవిత ధర్మము గా పాటిస్తూ,నా నామము జపిస్తూ ప్రియ భక్తుడవి అయ్యావు. అందుకే చేపపిల్లగా కనిపించి నీకు మార్గదర్శనం చేసాను. నిన్ను జల ప్రళయం నుండి రక్షించడానికి సంకల్పించాను.
నీ భక్తికి మెచ్చి వరము ఇస్తున్నాను. వచ్చే శ్వేతవరాహ కల్పములో నీవు సూర్యుడికి వైవస్వత నామముతో పుత్రుడిగా జన్మిస్తావు. సప్తమ మన్వంతరానికి మనువు అయ్యి ప్రసిద్దుడివి అవుతావు. నీ కీర్తి ప్రతిష్టలు వర్ధిల్లుతాయి” అని సత్యవ్రతునికి సాంఖ్యయోగ ప్రక్రియతో పురాణ సంహిత ఉపదేశించాడు.
అనంతరం సత్యవత్రుడు నారాయణుని ఆదేశం పాటించి బీజ విత్తన భాండాన్ని నావలోకి చేర్చి తాను నావను అధిరోహించాడు. మత్స్యావతారుడు తన చేప కొమ్ముని నావను చుట్టుకున్న సర్పరాజు శరీరానికి, నావకు మధ్యన చేర్చి తన యోజనాల శరీరం పై నావను అటుఇటూ పడకుండా చేసి ముందుకు ఈదుతూ వేగంగా వెళ్ళ సాగాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి