14, జులై 2020, మంగళవారం

అనగనగా ఒక శివుని దేవాలయం

ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలూ వస్తుంటారు

మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు...

తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతాడు

ఆ విధంగా అందరు దేవతలూ గుడిలోకి వెళతారు
వాహనాలు గుడి బయట ఉంటాయి...

అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరకు వచ్చి "యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం, అటువంటి యమధర్మరాజు గుడిలో కి వెళ్లేముందు నన్ను చూసి నవ్వాడు., నాకు భయంగా ఉంది నన్నెలాగైనా కాపాడు" అని గరుత్మంతుడిని వేడుకుంది.,

అప్పుడు గరుత్మంతుడు "నేను అన్నిటికన్నా వేగంగా పోగలను, మూడు ఘడియలలోపు నిన్ను ఏడు సముద్రాలకు అవతల వదిలి వస్తాను, అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు యముడు నిన్నేమీ చేయలేడు" అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకెళ్ళి ఏడు సముద్రాలకు
అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి
నీకేం కాదులే హాయిగా ఉండు' అని చెప్పి
అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు....,

కొంత సేపటికి దేవతలందరూ పూజ ముగించుకుని
బయటకు వస్తారు... అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో " యమధర్మరాజా నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట ఎందుకు" అని అడిగాడు...!

అప్పుడు యమధర్మరాజు " ఏం లేదు నాకు బ్రహ్మ దేవుడు రాసిన అందరి తలరాతలూ కనిపిస్తాయి...,ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది" అని అన్నాడు.

ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు..,

ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలో ఏడు సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతోంది అని రాసి ఉంది..., ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలోపు ఏడు సముద్రాలు దాటి వెళ్లలేదు.., ఆ పాము కూడా ఏడు సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు..

కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది....
ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది"
అన్నాడు యమధర్మరాజు

తానొకటి తలచిన దైవమొకటి తలచు విదిరాత కదా..

ప్రపంచంలో అన్ని దేశాలనూ ఆడించగల అమెరికా అన్నీసరిహద్దులు మూసుకుని ఉండాల్సి వస్తుందని
ఏనాడైనా ఊహించి ఉంటుందా...,

వేల కాంతి సంవత్సరాల దూరంలో ఏం జరుగుతున్నదో బిలియన్ల సంవత్సరాల ముందు ఏం జరిగిందో చెప్పగలిగిన టెక్నాలజీ ఉన్న మానవజాతి
ఒక చిన్న కంటికి కనిపించని పురుగును చూసి ఇంత భయపడాల్సి వస్తుందని
ఊహించి ఉంటుందా..

పరమేశ్వరా..!
ఈ సృష్టిలో ఉన్న ప్రతీ జీవరాశి నీయొక్క కింకరులమే,
నీ ఆజ్ఞానుసారం నడవవలసిన వాళ్ళమే కదా తండ్రి..
నీవే స్వయంగా కాపాడుకునే సమయం ఆసన్నమైంది.

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 

కామెంట్‌లు లేవు: