29, డిసెంబర్ 2023, శుక్రవారం

నవగ్రహా పురాణం🪐*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *120వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*నవగ్రహాల పట్టాభిషేకం - 1*


దేవ మహాసభలో వైభవం తాండవిస్తోంది.


క్షీరసాగర తీరం -  మహాసభకు విచ్చేసిన దేవతలతో , వాళ్ళ పత్నులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కదేవ పురుషుడు , ఒక్కొక్కదేవ పురంధ్రీ ఒక్కొక్కదీపకళికలా వెలిగిపోతున్నారు ! క్షీరసాగర మధుర తరంగాల మీద నుంచి సాగి వస్తున్న శీతలపవనాలు అందర్నీ పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి !


శ్రీమహావిష్ణువు లక్ష్మీ ఉన్నతాసనాల మీద ఆసీనులై ఉన్నారు. ఆ దంపతులకు ఇరువైపులా బ్రహ్మా , సరస్వతీ , పరమేశ్వరుడూ , పార్వతీ కూర్చున్నారు. ఇంద్రాదిదేవతలూ పత్నీ సమేతంగా ఒక వైపున కూర్చున్నారు. బ్రహ్మ మానస పుత్రులూ , వాళ్ళ ధర్మపత్నులూ ఒకవైపునా , మహర్షులందరూ ఒకవైపునా ఉన్నారు.


ఆనాటి మహత్కార్యక్రమానికి నాయకులైన సూర్యుడూ , చంద్రుడూ , కుజుడూ , బుధుడూ , బృహస్పతీ , శుక్రుడూ , శనీ , రాహువు , కేతువూ ప్రత్యేమైన ఆసనాల మీద ఒక బృందంగా కొలువుదీరి ఉన్నారు. ఆ 'నవ నాయకుల' పత్నులు - సంజ్ఞ , అశ్విని మొదలు ఇరవై ఏడుగురు చంద్ర పత్నులూ , శక్తి దేవీ , ఇలా , తారా , ఊర్జస్వతీ , జ్యేష్ఠాదేవీ , సింహిదేవీ , చిత్రలేఖా - ఒక బృందంగా కూర్చుని తమ భర్తలను ఆనందంగా చూస్తున్నారు. త్రిమూర్తులకు దగ్గరగా తొమ్మిది నవరత్న స్వర్ణ సింహాసనాలున్నాయి... ఎవరి కోసమో ఎదురుచూస్తూ !


క్షణం సేపు ధ్యాన ముద్రలో మునిగి , బ్రహ్మ కళ్ళు తెరిచి తన ప్రక్కనే ఉన్న శ్రీమహావిష్ణువు ముఖంలోకి వినయంతో చూశాడు.


*"జనకా ! సుముహూర్తం ఆగమించింది ! ప్రారంభించండి !”*


శ్రీమహావిష్ణువు మహాసభను తన సుందర మందహాస కిరణాలతో స్పృశించాడు. పాలకడలి కెరటాల హోరును అణచి వేస్తూ , ఆయన గంభీర కంఠధ్వని సభాసదుల కర్ణపుటాలను కమనీయంగా తాకింది.


*"కల్పకల్పానికీ ఇతోధికంగా అభివృద్ధి చెందుతున్న మహాసృష్టి విన్యాసంలో 'నవగ్రహాల' సశరీర ఆవిర్భావం ఒక ప్రముఖ ఘట్టం ! లోకాలలోని ప్రాణులు ఆరాధించి , అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగిస్తూ - సూక్ష్మ రూపాలతో ఉన్న గ్రహ దేవతలు స్థూల తేజో రూపాలతో సశరీరంగా అవతరించడం అవసరమని సృష్టి ప్రారంభంలో నేను సంకల్పించాను ! ఆ సంకల్పం సాకారమై , నవ్యమైన నవ రూపాలతో మన ముందు సాక్షాత్కరించి ఉంది !"* అంటూ శ్రీమహావిష్ణువు తన దక్షిణ హస్తంతో సూర్యాదులను నిర్దేశించాడు. దేవతల మానస పుత్రుల , మహర్షుల శిరస్సులు ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగాయి. ఆ దేవతల , దేవతా పురంధ్రుల దృష్టి కిరణాలు వాళ్ళను మౌనంగా అభినందిస్తున్నాయి. సూర్యుడు , చంద్రుడూ మొదలైన తొమ్మండుగురూ చేతులు జోడించి సభకు నమస్కరించారు.


శ్రీమహావిష్ణువు కంఠం మళ్ళీ క్షీరసాగర తరంగ నినదాన్ని అవలీలగా అణచి వేసింది.


*“పరమేష్ఠీ , పరమేశ్వరుల సూచనలను అనుసరించి , నవగ్రహదేవతల వరుస క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ గ్రహాల ప్రాధాన్యతా నిర్ణయం వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రాతిపదికగా జరిగింది. ఆయా గ్రహాల శక్తి సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకుని - ఆధిపత్యాలనూ , కారకత్వాలనూ మేము ముగ్గురమూ నిర్ణయించాం ! నవగ్రహ బృందంలో వాళ్ళ స్థానమానాలను నిర్దేశించే వరుస క్రమంలో ఆహ్వానం పలుకుతాను ! ఆహ్వానాన్ని అనుసరిస్తూ గ్రహ దేవతలు వరుసగా ఆగమించి , స్వర్ణాసనాలను అలంకరిస్తారు !"*


ఆసక్తిగా చూస్తున్న సభాసదులను ఒకసారి కలయజూసి , విష్ణువు నవగ్రహాలను ఆహ్వానించడం ప్రారంభించాడు.


*“నవగ్రహాలలో ప్రథమ గ్రహదేవత సూర్యుడు !"*


మహాసభ సమధికోత్సాహంతో చేస్తున్న హర్షధ్వానాల నేపథ్య సంగీతంతో సూర్యుడు లేచి చేతులు జోడించి నడిచాడు. ప్రథమ సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు.


*"ద్వితీయ గ్రహం చంద్రుడు !"* శ్రీమహావిష్ణువు కంఠధ్వని సాగర తీరంలో ప్రతిధ్వనించింది.


*"తృతీయ గ్రహం కుజుడు !”*


*"చతుర్థ గ్రహం బుధుడు !"*


*"పంచమ గ్రహం బృహస్పతి !”*


*"షష్ట గ్రహం శుక్రుడు !"*


*"సప్తమ గ్రహం శనైశ్చరుడు !"*


*"అష్టమ గ్రహం రాహువు !”*


*"నవమ గ్రహం కేతువు !"*


విష్ణువు పిలిచిన క్రమంలో చంద్రుడి నుండి , కేతువు దాకా అందరూ ప్రత్యేక సింహాసనాల మీద ఆసీనులయ్యారు. నవరత్న సింహాసనాల మీద కూర్చున్న నవగ్రహాల మీదనే అందరి దృష్టులూ కేంద్రీకరించబడ్డాయి.


*"నవగ్రహాలలో ఒక్కడైన బృహస్పతి దేవతలకు గురువైన కారణం చేతా , మహాజ్ఞాని అయిన కారణం చేతా - తన నిజ నామధేయంతో కాకుండా 'గురువు' అనే సార్థకనామధేయంతో సుప్రసిద్ధుడవుతాడు !"* శ్రీమహావిష్ణువు హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.


*"సృష్టిలో నవధాన్యాలకూ , నవరత్నాలకూ అధిక ప్రాధాన్యం ఉంది. నవగ్రహ దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాన్యం మీదా , ఒక్కొక్క రత్నం మీదా ఆధిపత్యం ఉండేలా నిర్దేశించబడుతుంది. నవగ్రహాల ధాన్యాధిపత్యాన్ని సృష్టికర్త బ్రహ్మ , రత్నాధిపత్యాన్ని పరమేశ్వరుడూ వెల్లడిస్తారు !"* పరమేష్టి , పరమేశ్వరులను సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు శ్రీమహావిష్ణువు.


బ్రహ్మ ఆయనకు నమస్కరించి , ప్రారంభించాడు.


*"సూర్యుడికి గోధుమలూ , చంద్రుడికి వడ్లూ , కుజుడుకి కందులూ , బుధుడికి పెసలూ , గురువుకు శనగలూ , శుక్రుడికి అలసందలూ , శనైశ్చరుడికి నువ్వులూ , రాహుకేతువులకు మినుములూ , ఉలవలూ ఇష్టధాన్యాలుగా ఉంటాయి. ఇష్ట ధాన్యాల మీద వాళ్ళ ఆధిపత్యాలుంటాయి. ఇది త్రిమూర్తుల అనుశాసనం !"*


నవగ్రహ దేవతలు వినయంతో , కృతజ్ఞతతో నమస్కరించారు.


*"నవగ్రహాల ఆధిపత్యాలుండే నవరత్నాలను పేర్కొంటున్నాను..."* అంటూ పరమశివుడు ప్రారంభించాడు.


*"సూర్యుడు - మాణిక్యం , చంద్రుడు - ముత్యం , కుజుడు - పగడం , బుధుడు - మరకతం , గురువు - పుష్యరాగం , శుక్రుడు - వజ్రం , శనైశ్చరుడు - నీలం , రాహువు - గోమేధికం , కేతువు - వైడూర్యం !"* నవగ్రహాలు అభిమానించే నవరత్నాలను పేర్కొన్న పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు.


పరమేశ్వరుడి అనుశాసనం వెలువడిన మరుక్షణం జరిగిన దృశ్యం దేవతలను ఆశ్చర్యంలో ముంచివేసింది.


సూర్యుడి మీద మాణిక్యాలు వర్షిస్తున్నాయి ! చంద్రుడి మీద ముత్యాలూ , కుజుడి మీద పగడాలూ , బుధుడి మీద మరకతాలూ , గురువు మీద పుష్యరాగాలూ , శుక్రుడి మీద వజ్రాలూ , శనైశ్చరుడి మీద నీలాలూ , రాహువు మీద గోమేధికాలూ , కేతువు మీద వైడూర్యాలూ వర్షిస్తూ , అందరికీ కనువిందు చేస్తున్నాయి. హర్షధ్వానాలు అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: