24, సెప్టెంబర్ 2024, మంగళవారం

ఉద్ధవ గీత*

 249d4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                       *ఉద్ధవ గీత*

                       ➖➖➖✍️


ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా. కాని, తను చేసే సేవలకు ఎప్పుడూ 

ఏ ప్రతిఫలము ఆశించలేదు.


ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి , “ఉద్ధవా! నా అవతార కాలంలో ఎంతో మంది నా నుంచి ఎన్నో వరాలను, బహుమతులను పొందారు. కాని, నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు . కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది ఏమి కావాలో కోరుకోL” అని ప్రేమగా అడిగాడు.


అప్పుడు ఉద్ధవుడు, “దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు, నాకు ఏ వరము వద్దు కాని, నిన్ను ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నా, అడుగవచ్చునా?” అని వినయంగా ఇలా అడిగాడు.


“కృష్ణా! నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి.   కాని నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధములో, నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమి అర్ధం కాలేదు. దయచేసి నా సందేహములను తీర్చి నన్నుఅనుగ్రహించండి.” అని కోరుకున్నాడు.


దానికి కృష్ణుడు  “ఉద్ధవా! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ‘ఉద్ధవ గీత’ను బోధించటానికి ఈఅవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలని అనుకుంటున్నావో తప్పకుండా అడుగు.”  అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు.


ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు… “కృష్ణా పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా! నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నువ్వు వారి వర్తమానము, భవిష్యత్తు తెలిసినవాడివి. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు?  మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా?   పోని, ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి      ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండ కూడదా? అది కూడా చెయ్యలేదు. 


ధర్మజుడు ఆస్తంతా పోగొట్టుకుని వీధినపడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళని కాపాడుండవచ్చు కదా? కౌరవులు దుర్బుద్ధితో   పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు 

నీ మహిమతో పాండవులని గెలిపించలేదు…   ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు

ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని 

గొప్ప పేరుపొందావు. కాని ముందే నీవు కలుగచేసుకుని ఉంటే ఆమెకి

నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా! సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడని పించుకుంటాడు. నీవు చేసినదేమిటి స్వామి?” అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుడిని తన ఆంతర్యమేటో తెలుపమని ప్రార్ధించాడు.


నిజానికి ఈ సందేహములు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. 


కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఈ క్రింది విధంగా బోధించాడు…


“ఉద్ధవా! ప్రకృతి ధర్మం ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడుతూ తగిన చర్యలను తీసుకునే వాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా ఆస్తిపరుడు.  కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు.


ధర్మరాజు మాత్రం, పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు. నా సహాయమును కోరలేదు. శకుని, నేను ఆడి ఉంటే జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే చెప్పు?     సరే ఇదిలా ఉంచు, ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, ‘నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను, కృష్ణుడికి ఈసంగతి తెలియకూడదు, ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణుడు రాకూడదు’  అని ప్రార్ధించాడు.  దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకుని, తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను.

ధర్మజుడు సరే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారేకాని ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా.  దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది.


చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది, సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని ఆ నాడు రక్షించలేదా?” అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.


కృష్ణుడి సమాధానములకి ఉద్ధవుడు భక్తితో చలించి,   “కృష్ణా!  అలాగైతే మాలాంటి సామాన్యులు సంగతి ఏంటి? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడుతావా?” అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు.


దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ “ఉద్ధవా! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను అదే భగవంతుని ధర్మము.“  అని వివరించాడు.


ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడై  “అయితే కృష్ణా! మేము తప్పుదారి పట్టి పాపములను మూట కట్టుకుంటుంటే నువ్వలా దగ్గిరుండి చూస్తూఉంటావా  మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మము?” అని ప్రశ్నించాడు. 


దానికి కృష్ణుడు  “ఉద్ధవా ! నీ మాటలను నీవే జాగ్రత్తగాగమనించు. నీకే అర్ధమవుతుంది భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గిరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు?” ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పు దారి పడతాడు, అనర్ధాలని కొని తెచ్చుకుంటాడు.


ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోక పోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది“ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు.


కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో కృష్ణుడికి నమస్కరించాడు.



##నీతి:


పూజలు, ప్రార్థనలు భగవంతుడి సహాయమును కోరటానికి చేసే కర్మలే కదా! కాని, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్ గీతలో కూడా 

శ్రీ కృష్ణుడు ఇదే బోధించాడు.


యుద్ధములో అర్జునుడికి కృష్ణుడు రథ సారధిలా వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేసాడే కాని, అతని బదులు స్వయంగా యుద్ధము చేయలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవిన రథసారధి చేసుకుంటే మనకి కూడా అర్జునిడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది.

మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనని అన్ని వేళలా కాపాడుతుంది!✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: