26, మార్చి 2025, బుధవారం

తెలుగు భాష ఆవిర్భావము

 🙏తెలుగు భాష ఆవిర్భావము🙏 

భాష అంటే ఏమిటి? అది ఎలా పుట్టింది? తెలుగు భాష ఎలా పుట్టినది? ప్రశ్నకు సమాధానం 

సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏమిటి ? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. ముందుగా….


భాష అంటే ఏంటి?

మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం  కూడా భాషే అవుతుంది. మాట వినబడనంత దూరంలో ఉంటే మనం సంజ్ఞలు చేస్తాము కాబట్టి అదికూడా భాషయేకదా. భదిరులకు ఉన్న భాష సంజ్ఞలేకదా ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవునికీ భాషలో చాలా మార్పు వచ్చింది. మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూత మయ్యింది.

విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.


భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.


తెలుగు భాష విషయానికి వస్తే 

సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాకృత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాకృతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని “తెలుగు” శబ్దం ఏర్పడి ఉండవచ్చని గంటి జోగి సొమయాజి గారు తెలిపారు. “తెలుగు” దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.

“తలైంగు” జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. “తలైంగు” అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.

“తెలుంగు” అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. “తెన్ను” అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.

“తెన్” నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. “తెన్” అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి “తెనుగు” అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.

ఐతే “త్రినగ” నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా “త్రినగ” శబ్దం ఏర్పడిందంటారు.

మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.

విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా “త్రిలింగ” పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గారు, తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.

ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.

పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ “వడుగ”, “వడగ”, “తెలింగ”, తెలుంగు” అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: