11, ఫిబ్రవరి 2026, బుధవారం

శ్రీ లింగ మహాపురాణం

  అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - ఉమామహేశ్వర వ్రతము - నూట నాలుగవ భాగం

_________________________________________________

శౌనకాది మునులారా! ఇప్పుడు మీకు ఉమామహేశ్వర వ్రత విధానము గురించి చెబుతాను. శివుడు స్వయంగా ఈ వ్రతము గురించి వివరించి, . పురుషులు, స్త్రీలు మరియు ఇతర ప్రాణులను క్షేమము, పుణ్యప్రాప్తి కోసం ఈ వ్రతము ఆచరించాలని చెప్పాడు.


ఉమామహేశ్వర వ్రతము చేయ సంకల్పించిన భక్తుడు లేక భక్తురాలు ఒక సంవత్సరం పాటు ప్రతి నెలలో రెండు పక్షములలో వచ్చే అష్టమి, చతుర్దశితో పాటు పూర్ణిమ, అమావాస్య నాడు రాత్రి పూట హవిష్య పదార్థాలు సిద్దం చేసి శివుని అర్చించాలి. సంవత్సరం ముగిసిన తరువాత బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసి దాన దక్షిణలు సమర్పించాలి.


ఉమాదేవి మహేశ్వరుల సుందర ప్రతిమలు బంగారంతో గానీ వెండితో గాని చేయించి విధి పూర్వకంగా ప్రతిష్ఠించాలి. విగ్రహములకు ఆభరణములు చేత అలంకరించి ఛత్రయుక్త రథములో శివాలయము నకు తీసుకు వెళ్ళి సమర్పించాలి. ఇలా చేసిన భక్తుడు పురుషుడైతే శివసాయిజ్యం, స్త్రీ అయితే ఉమాదేవి సాయిజ్యం పొందుతాడు.


భక్తుడు/భక్తురాలు కన్య లేదా విధవ అయితే ఒక సంవత్సరం పాటు అష్టమి, చతుర్దశిల నాడు రాత్రి పూట భోజనం చేసి బ్రహ్మచారిణిగా ఉండాలి. సంవత్సరాంతంలో ఉమామహేశ్వర విగ్రహము తయారు చేయించి శివాలయములలో ప్రతిష్టింపచేసి శివాలయమునకు ఇచ్చివేయాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇలా చేసిన వారు ఉమాదేవి సానిధ్యం పొంది సుఖసంతోషాలు అనుభవిస్తారు.


ఒక స్త్రీ కేవలం కృష్ణ పక్ష చతుర్దశి నాడు ఈ వ్రతము చేసి సంవత్సరం చివర ఏ పదార్థముతో నైనా శివుని ప్రతిమ చేయించి పూజించి శివాలయమునకు సమర్పిస్తే భవానీదేవితో ఉండి ఆనందము అనుభవించ గలదు స్త్రీ భక్తురాలు అయితే అమావాస్య నాడు భోజనం చేయకూడదు. అన్ని నియమాలు పాటిస్తూ సంవత్సరమంతా నిగ్రహంతో నియంత్రణలో ఉండాలి.


సంవత్సరం చివర్లో త్రిశూలం చేయించి శివునికి సమర్పించాలి. శివునికి అభిషేకం చేసి వేయి శ్వేత కమలాలతో పూజించాలి. రజత కమలం సువర్ణ కాడతో తయారు చేసి సమర్పించాలి. పురుషుడు రుద్ర సాయిజ్యం, స్త్రీ భవానీదేవి సాయిజ్యం పొందుతారు


భార్యాభర్తలు కలసి ఈ వ్రతము చేయాలని సంకల్పం చేసుకుంటే, వారు సంవత్సరమంతా పూర్ణిమ, అమావాస్య తిథుల నాడు ఉపవాసం చేయాలి. ఈ పవిత్ర వ్రతము, జపము, తపము మొదలైనవి స్త్రీ తన పతి ఆజ్ఞతో చేయాలి. ప్రతి మాసంలో భక్తుడు సుగంధ విగ్రహం దానము ఇవ్వాలి. ఇలా చేసిన స్త్రీ ఉమాదేవి సన్నిధి, సాయిజ్యం పొందుతుంది.


సంవత్సరమంతా చేయలేని శివభక్తులైన స్త్రీ కార్తీక మాసంలో పూర్ణిమ తిథి నాడు ఒక పూట మాత్రమే భోజనము చేసి వ్రతము ఆచరించాలి. క్షమ, అహింస పాటిస్తూ బ్రహ్మచారిణిగా ఉండాలి. నేయి, పాలు కలిపి వండిన పాయసము నివేదించి భుజించాలి. నల్ల నువ్వులు శివునికి నమస్కరించి తమ శక్తానుసారం బ్రాహ్మణునకు దానమివ్వాలి. ఇట్టి స్త్రీ ఉమామహేశ్వర సాయిజ్యం పొందుతారు.


అష్టమి, చతుర్దశి నాడు ఉపవాసం చేయు స్త్రీ భవానీదేవితో కలిగే సాయిజ్యం పొంది ఆనందము అనుభవిస్తుంది. పైన చెప్పిన అన్నీ వ్రతములు చేయువారు సత్యము, శాంతము, క్షమ, దయ, దానము, శౌచము (శుభ్రత), ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ నియమ నిష్టలతో శివుని పూజించాలి. నియమ నిష్టలు లేకుండా వ్రతము చేస్తే ఫలం లభించదు.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

కామెంట్‌లు లేవు: