11, ఫిబ్రవరి 2026, బుధవారం

శ్రీ లింగ మహాపురాణం

 అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - న్యాసపూర్వక పంచాక్షరి మంత్ర జపము - నూట ఎనిమిదవ భాగం

_________________________________________________

న్యాసము అనే ప్రక్రియ మంత్రం జపిస్తూ శరీర అంగములను, శరీరమును శుద్ది చేసుకోవడానికి , పవిత్రం చేసుకోవడానికి చేస్తారు. న్యాసము అంటే మంత్రాలు జపిస్తూ శరీర భాగాలను తాకుతూ దైవత్వాన్ని ఆ భాగాలకు కలుగచేయడం అని చెప్పవచ్చును.


బ్రహ్మచారులు, గృహస్థులకు, సన్యాసులు మంత్రములు పఠిస్తూ శరీరమును లేదా శరీరములోని నిర్ధిష్టమైన భాగాలను స్పర్శిస్తారు. ఉత్పత్తి న్యాసములో ఎడమ చేతి బొటనవ్రేలి నుంచి ప్రారంభించి కుడిచేతితో సమాప్తము చేసి వ్రేళ్ళను స్థిరముగా వుంచుతారు. సంహార న్యాసములో రెండు చేతి బొటనవ్రేళ్ళ నుంచి ప్రారంభించి చిటికెన వ్రేలితో సమాప్తం చేస్తారు.


మొదట కరన్యాసము తరువాత దేహన్యాసము చివరకు అంగన్యాసము చేస్తారు. సాధకుడు పంచాక్షరీ మంత్ర జపం ముందు ప్రతి శరీర అంగము యొక్క న్యాసము చేయడం అవసరం. ఒకటి తరువాత ఒకటి పూర్ణ మంత్రములు చదివిన తరువాత ఓంకార జపము చేయాలి. పాద ప్రక్షాళన చేసుకుని తూర్పు లేక ఉత్తరము వైపునకు తిరిగి న్యాసము అనుష్ఠించాలి.


భక్తుడు మనస్సును నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఋషి, ఛందము, అధిష్టాన దేవత, బీజము, శక్తి, పరమాత్మ, గురువుని స్మరించాలి. మంత్రాలను పునశ్చరణ చేస్తూ, చేతులు స్పర్శించుకుంటూ ఓంకారమును అరచేతితో పాటు ప్రతి మొదలు, చివర చేతి వ్రేళ్ళ కణుపులపై స్థిరపరచుకోవాలి. ఐదు వ్రేళ్ళ మధ్య కణుపులపై బిందు సహితంగా బీజములను స్థిరపరచుకోవాలి.


తమ వయస్సుని అనుసరించి ఉత్పత్తి న్యాసముతో మొదలు పెట్టి రెండు చేతుల నుండి, పాదముల నుండి ప్రారంభించి శిరస్సు వరకు చేసి పూర్తి చేయాలి. మంత్రము ఓంకార పూర్వకంగా ఉచ్ఛరిస్తూ శరీరమును శిరస్సు, ముఖము, కఠము, హృదయము, గుహ్యావయములు, రెండు పాదములను స్పృంశించాలి. తిరిగి గుహ్యావయములు, హృదయము, కంఠము, ముఖము, శిరస్సును పై చేతితో స్పృంశించాలి. మూడు విధాలైన న్యాసము ఈవిధంగా చేసిన తరువాత భక్తుడు శివధ్యానము చేయాలి.


న్యాసముతో పాటు నమః, స్వాహా, వషట్ హుం, వౌషట్, ఫట్ అనే శబ్దములను ఉచ్ఛరించాలి. ఓం నమః శివాయ లో ఓంకారము హృదయము అని , 'న' శిరస్సు అని , 'మః ' శిఖ అని, 'శి' కవచము అని, 'వా' నేత్రము అని, 'య' అస్త్రము అని చెప్పబడును. ఈ విధంగా అంగములందు అక్షరములను స్థిరపరచి దిక్కులను బంధించాలి.


ఆగ్నేయముతో ప్రారంభించి దిక్కుల అధిదేవతలను, వినాయకుడు, దుర్గాదేవి, క్షేత్రపాలకులను ప్రార్థించాలి. భక్తుడు తర్జని (చూపుడు వ్రేలు) మొదలైన వ్రేళ్ళతో, బొటన వ్రేలుతో న్యాసము చేయాలి. తరువాత కంఠ మధ్యభాగంలో న్యాసము చేయాలి. శుభ మంత్రముల చేత న్యాసము చేసిన భక్తుడు శివుని సన్నిధిలో ఉన్నవాడు అవుతాడు. పూర్వజన్మ పాపాలన్ని నశించి పోతాయి.


పార్వతీ! భక్తుడు శరీరము శుద్దిపరచుకుని ధృఢచిత్తంతో న్యాసము చేయాలి. తరువాత గురువు స్మరణ చేసి పంచాక్షరీ మంత్ర జపము చేయాలి. ఈవిధంగా అనుసరించి చేయకపోతే మంత్రజపము వ్యర్థమై పోతుంది. కనుక భక్తుడు మొదట గురువుని ఆశ్రయించి మంత్రము యొక్క నిజమైన అర్థము తెలుసుకుని పూర్ణ జ్ఞానము పొందాలి. శిష్యుడిగా భక్తుడు తన పవిత్రమైన ఆచరణతో, ఆలోచనతో, మనస్సు, వాక్కుతో గురువుని సంతుష్టుడిని చేయాలి.


శిష్యుడు ఒక సంవత్సరం వరకు గర్వము అహంకారం లేకుండా నిర్మలమైన మనస్సుతో గురు సేవ చేయాలి. ఉపవాసాది క్రియలతో శరీరము శుద్దపరచుకోవాలి. 

పిదప గురువు నదీ సముద్ర తీరాలలో లేదా పవిత్రమైన ప్రదేశంలో శుభ తిథి ముహుర్తము నాడు మంత్రోపదేశం చేయాలి. గురువు నుంచి మంత్ర జ్ఞానము పొందిన శిష్యుడు సంకల్ప సహితంగా ప్రతిరోజు మంత్ర జపము చేయాలి.


మోక్షము కోరుకునేవారు పంచాక్షరి మంత్రమును లక్ష సార్లు జపము చేయాలి. తరువాత నాలుగు సార్లు పునశ్చరణ చేయాలి. శీఘ్రముగా ముక్తి కోరుకునేవాడు నిత్యము పంచాక్షరి మంత్ర జపము చేస్తూ నిత్యజపి అవ్వాలి. నిత్యజపి సిద్దుడు అవుతాడు.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

కామెంట్‌లు లేవు: