5, మార్చి 2026, గురువారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 4 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

                *15వ భాగo*


*పరాశక్తి పరమేశ్వరులు, మూల చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భావం*```


అర్థనారీశ్వరుడు అంతర్ధాన మయ్యాక బ్రహ్మదేవుడు కన్నులు మూసుకుని తన త్రికాలజ్ఞానము ఉపయోగించి దివ్య దృష్టితో సావిత్రీదేవి గురించి తెలుసు కోవాలని పరబ్రహ్మ సృష్టి ఆరంభం నుంచి జరిగిన సంఘటనలు వీక్షిస్తున్నాడు.


పరబ్రహ్మ కృష్ణుడిగాఅవతరించిన తరువాత ఆయన వామభాగం నుండి స్త్రీ రూపంగా కృష్ణాదేవి అవతరించింది. కృష్ణుడు కృష్ణాదేవి కలయిక వలన ఒక మగ శిశువు జన్మించాడు. ఆ బాలుడే 

వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువు. కల్పాలు గర్భభారం భరించి జన్మించిన శిశువుని కృష్ణాదేవి వటపత్రం పై ఉంచి మహాజలథిలో వదిలివేసింది. ఇది నచ్చని కృష్ణుడు కృష్ణాదేవిని, ఆమె అంశతో జన్మించబోయే అప్సర సలని "వారికి సంతానం కలుగ దని" శపించాడు.


కృష్ణాదేవి తప్పు తెలుసుకుని కృష్ణుని క్షమించమని కోరింది. మన్నించిన కృష్ణుడు శాప ఫలంగా కృష్ణాదేవి సృష్టికి తోడ్పడదని తెలిసి ఆమె నుంచి ఇతర స్త్రీలను అవతరింప చేయాలని భావించాడు. ఫలితంగా కృష్ణాదేవి జిహ్వభాగం నుంచి సరస్వతీదేవి ఆవిర్భ వించింది. మహాసరస్వతి వామభాగం నుండి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుండి రాధాదేవి అవతరించారు.


లక్ష్మీదేవిని విష్ణువుకి సహధర్మ చారిణి చేసి కృష్ణుడు సరస్వతి, లక్ష్మీదేవితో గోలోకం చేరు కున్నాడు. గోలోకం చేరుకున్న కృష్ణుడు సృష్టి స్థితి లయ కార్యాన్ని ముందుకు సాగించడానికి వీలుగా తనను ద్విరూపునిగా చేసుకున్నాడు. దక్షిణభాగం కృష్ణుడు అయితే వామభాగం నుండి మరొక దివ్య పురుషుడు అవతరించాడు.


అతడు వ్యాఘ్ర చర్మం ధరించి శరీరమంతా భస్మం ధరించి ఉన్నాడు. జటాజూటంతో మూడు నేత్రాలు, పంచ

ముఖాలు కలిగి శుద్ధజ్ఞాన స్ఫటికంలా మెరసిపోతున్నాడు. హస్తంలో త్రిశూలం కలిగి పట్టీశం ధరించిన ఆ దివ్య పురుషుడు సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు. సర్వేశ్వరునికి జోడిగా ఉండటానికి కృష్ణుడి వామభాగం నుంచి కృష్ణప్రియ, విష్ణుమాయ, సర్వశక్తి స్వరూపిణి, దేవీ స్వరూపాలన్నింటికి బీజరూపిణి, మూల ప్రకృతి అయిన దుర్గాదేవి అవతరించింది.


కృష్ణుడు వారిద్దరిని ప్రసన్నంగా చూసి "మీరు పరబ్రహ్మ అయిన నా నుంచి అవతరించిన ప్రకృతి పురుషులైన పరాశక్తి - పరమేశ్వరులు. నా దేహం లోని వామభాగం నుండే మీరిద్దరు అవత రించారు. కనుక మీరు ఆర్థశరీరులై కలసిఉండి ఏక దేహులైన అర్థనారీ-ఈశ్వరులుగా విరాజిల్లుతారు.


దుర్గమమైన ఈ దుర్గా- శక్తి తోనే సమస్త జీవ చైతన్యం జరుగుతుంది. పరాశక్తి అనుగ్రహం ముగిసిన జీవులను లయం చేసే లయకారుడిగా పరమేశ్వరుడు ఉంటాడు.


పరాశక్తీ పరమేశ్వరులారా! జలథిలో వటపత్రము బాలునిగా శయనించి పూర్ణ రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు వామభాగం విష్ణుమాయగా దుర్గాదేవి, మహాదేవునిగా నీవు అవతరించి విష్ణువుకి సరిసమానులై సృష్టి కార్యంలో ఆయనకు సహకరించండి" అని దిశానిర్దేశనం చేశాడు. సరేనని పరాశక్తి పరమేశ్వరుడు అదృశ్య మయ్యారు.


అనంతరం కృష్ణుడి నాభి చతుర్ముఖుడు, చతుర్భుజుడు అయిన దివ్య పురుషుడు దండకమండలాలు ధరించి అవతరించి కృష్ణుని స్తుతించాడు. కృష్ణుడు సంతసించి "చతుర్ముఖా! మహాజలధిలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు నాభి కమలం నుంచి నువ్వు ఆవిర్భవించాలి.


శ్రీమహావిష్ణువు అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టించి, ప్రతి బ్రహ్మాండంలో విష్ణువుగా అవతరిస్తాడు. నీవు ఒక్కొక్క బ్రహ్మాండంలో గల విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మగా అవతరించి సృష్టికర్తగా బాధ్యత నిర్వర్తించుము. మూల బ్రహ్మవైన నీ ప్రతి (పార్షద) రూపాలే ఈ బ్రహ్మాండాల బ్రహ్మలందరు అవుతారు. అయినా వారికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు.


అలాగే ఇతర బ్రహ్మాండాలలో ఉన్న బ్రహ్మలలో కూడా ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అందరు తమకు జన్మనిచ్చిన మహావిష్ణువునే తమ తండ్రిగా, తమ జగత్ కర్తగా భావిస్తారు. నీవు వెంటనే వెళ్లి మహాజలథిలో శ్రీమహావిష్ణువు నాభి నుంచి ఉదయించే పద్మము నుండి అవతరించుము" అని ఆదేశించాడు. 


మరుక్షణం చతుర్ముఖుడు అదృశ్యుడై మహావిష్ణువు నాభి కమలం నుంచి అవతరించాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: