శ్రీరామ (2)
( మన జీవితగమ్యం )
శ్లో // ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ
ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను. మరల మరల నమస్కరిస్తున్నాను).
--------
ఇహలోకంలోను, పరలోకంలోను, సుఖములు అనుభవించాలంటే ధర్మమార్గాన్ని ఆశ్రయించాలి.
జనన మరణములతో కూడిన సంసారంనుండి బయటపడి శాశ్వతసుఖమైన మోక్షం కావాలనుకుంటే భగవంతుని ఆశ్రయించాలి.
పాపాత్ములు వారు చేసినట్టి పాపకర్మలచేత భక్షింపబడుతు, చచ్చుచు, బుట్టుచు,మరల జచ్చుచు, జన్మ పరంపరలను బొందుచున్నారు.
పేలు, నల్లులు, మొదలగు క్రిములను మన మేతీరున హింసించుచున్నామో, ఆ ప్రకారమే పాపాత్ములను దేవతలు హింసించుచుందురు.
(మృత్వా పునర్మృత్యు మాపద్యంతే /అద్యమానా స్స్వకర్మభిః/ఆశాతికాః క్రిమయ ఇవ/ తతః పూయన్తే వాసవైః - అరుణం)
"తగు పురుషప్రయత్నం చేసి ఇటువంటి స్థితినుండి బయటపడకుండా, మనం అతి దుర్లభమైన మానవజన్మను వ్యర్థం చేసుకుంటున్నాము" అంటున్నారు భర్తృహరి మహాయోగి.
శ్లో//న ధ్యాతం పద మీశ్వరస్య విధివత్ సంసార విచ్ఛిత్తయే/
స్వర్గద్వార కవాట పాటన పటు:ధర్మోపి నోపార్జితః/
నారీ పీన పయోధరోరు యుగళం స్వప్నేపి నాలింగితం/
మాతు: కేవలమేవ యౌవ్వన వనచ్ఛేదే కుఠారావయం//
( భర్తృహరి )
(సృష్టి, స్థితి, లయములు చేయడం అనే తటస్థ లక్షణము కలవాడు ఈశ్వరుడు.
సత్యము, జ్ఞానము, అనంతత్వము, భగవంతుని స్వరూప లక్షణము.
అటువంటి భగవంతుని తత్వాన్ని శుశ్రూష, సేవల ద్వారా గురువును సంతోషపెట్టి, వారినుండి తెలుసుకోవాలి.
వినయంతో ప్రశ్నించి సందేహాలన్నీ తీర్చుకోవాలి.
వారు చెప్పిన విధంగా సాధన చేసి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందాలి.
సద్గురువు నుండి జ్ఞానం పొందే ఈవిధానం శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశించాడు.
(తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా)
ఈ విధంగా గురువు ఉపదేశించిన పద్ధతిలో ఈశ్వరుని ఆరాధిస్తే, గర్భ నరక బాధలు పడుతూ జన్మించడం, జన్మించిన తరువాత జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ, ఆధులు,వ్యాధుల బారిన పడుతూ ఉండటం,
సమస్త అవయవములను,శరీరమును క్షీణింపజేసే వార్ధక్యం బారి పడటము,
తాను సంపాదించిన ధనము, గృహము, తన భార్యాపిల్లలు, బంధు మిత్రులు మొదలైన వారి వియోగానికి రోదిస్తూ మరణించడం,
తిరిగి జన్మించడం,
తిరిగి మరణించడం,
అనే అంతులేని సంసార చక్రం నుండి విముక్తి లభిస్తుంది.
అటువంటి ఈశ్వర ఆరాధన మేము చెయ్యలేదు.
సంసారసుఖాలను, ఉత్తమోత్తమ జన్మలను, స్వర్గాది లోకాలను, ఇహ పర సుఖాలనన్నింటిని సంపాదించి పెట్టే శాస్త్రోక్త ధర్మాచరణ కూడా మేము చెయ్యలేదు.
స్థిమితమైన మనస్సుతో, స్వప్నంలో నైనా స్త్రీ సంభోగాది కామ సౌఖ్యములను తృప్తిగా ఎన్నడూ అనుభవించలేదు.
జీవితంలో మేము ఏదీ సాధించలేదు.
మా జన్మ కేవలము మా తల్లి యొక్క యౌవ్వనమనే చెట్టును నరకడానికి ఉపయోగించే గొడ్డలి లాంటి దయిపోయింది.
అంటే వ్యర్థులమైన మమ్మల్ని కని మా తల్లి యౌవనాన్ని కోల్పోయింది. మమ్మల్ని పెంచి మా తండ్రి ధనాన్ని కోల్పోయాడు).
అతి విలువైన మానవ జన్మను వ్యర్థం చేసుకోకుండా పరమార్ధాన్ని సాధించేందుకు తగు పురుషప్రయత్నం చేయాలని చెప్పడమే పై శ్లోకం యొక్క తాత్పర్యం.
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
5-3-'26.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి