🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*ఆదివారం 12 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *55వ భాగం*``
*దత్తాత్రేయ అవతారం*```
బాల దత్తాత్రేయుడు మునులకు
గురువుగా ఉండటానికి తిరస్కరిస్తూ మునులకు దూరంగా వెళ్లిపోసాగాడు. మునులు వదలకుండా వెంటపడ్డారు. దత్తుడు వారికి దొరకకుండా చాలా దూరం వెళ్లి ఒక సరస్సు పైకి నడచుకుంటూ వెళ్లి మధ్యలో నీటిపై నిలుచున్నాడు.
వెంటపడ్డ మునులు సరస్సు తీరానికి చేరి సరస్సు మధ్యలో నీటిపై నిలిచిన బాల దత్తాత్రేయుని లీల చూసి ఆశ్చర్యంతో కీర్తించసాగారు. ఈత వచ్చిన కొందరు ఋషులు వదలకుండా నీటిలో దిగి ఈదుతూ దత్తాత్రేయుని చేరుకోవడానికి సరస్సు మధ్యకి వెళ్లారు. వారు సమీపానికి రాగానే దత్తుడు మెరుపు మెరసినట్లు అదృశ్యమయ్యి నీటిలోకి వెళ్లిపోయాడు.
అక్కడకి చేరిన మునులు నీటిలో ఎంత వెదికినా దత్తుడి దర్శనం లభించలేదు. తీరానికి తిరిగి వచ్చి ఎలాగైనా దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవాలి అని అక్కడే ధ్యానంలో కూర్చున్నారు. కొంతమంది మునులు దత్తాత్రేయుడిని అన్వేషిస్తు భూమండలమంతా పర్యటించటానికి వెళ్లారు. కానీ దత్తాత్రేయుడి జాడ తెలుసు కోలేకపోయారు.
సరోవరం ఒడ్డున ధ్యానం చేస్తున్న మునులకు తపస్సులో నూరు సంవత్సరాలు గడచిపోయాయి. సరోవరం లోపల అడుగున సమాధి స్థితిలో ఉన్న దత్తాత్రేయుడు సమాధి స్థితి నుండి బయటకు వచ్చి నీటిపైకి వచ్చారు. తన శరీరంలో మూలాధార చక్రంనుండి సహస్రార చక్రం వరకు సప్త చక్రాలలో యోగశక్తి రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని సంకల్పించి వెలుపలికి రమ్మన్నాడు.
శ్రీమహాలక్ష్మి ఋషికన్య రూపంలో దత్తాత్రేయుడి శరీరం నుండి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించింది. దత్తాత్రేయుడు ఆమెను ‘అనఘా’ అని సంభో దిస్తూ "నీవు నా శక్తివి. నా లోపల యోగశక్తిగా నీవు ఉన్నప్పుడు నేను "దత్తాత్రేయ యతి" గా ఉంటాను. నేను ఇలా గృహస్థ రూపం ధరించినప్పుడు నీవు నా అర్ధాంగి "అనఘాదేవి" ఔతావు. నేను "అనఘుడను" అవుతాను.
నన్ను పూజించే పుణ్యాత్ములకు ‘ఋషిపత్ని’ గా నాతో కలసి దర్శనమిస్తావు" అని ఆమెను తన అంకపీఠం మీద కూర్చో బెట్టుకుని నీటిపై తేలుతూ దత్తాత్రేయుడు తీరానికి చేరుకున్నారు.
దత్తాత్రేయుడు పరబ్రహ్మమని, అవతార పురుషుడు అని విశ్వసించి చిత్తశుద్ధితో తపస్సు చేసిన వారికి దత్తాత్రేయుడు ‘సచ్చిదానంద సద్గురు బ్రహ్మము’ గా, అనఘాదేవి దత్త యతీశ్వరుల అర్ధాంగిగా దర్శనమిచ్చారు.
చిత్తశుద్ధి లేని మునులకు దత్తుడు అనఘాదేవి సామాన్య దంపతులుగా కనిపించారు. వారు దత్తుడి దర్శనం కోసం అనవసరంగా సమయం వ్యర్థం చేసుకున్నామని అనుకుంటూ వెళ్లిపోయారు. పర బ్రహ్మముగా, అవతార పురుషుడిగా భావించి దర్శించిన మునులు దత్తదంపతులకు పాదాభివందనం చేశారు.
శ్రీ గురుదత్తులు దివ్యాశీస్సులు ఇస్తూ "మునులారా! గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే శివుడు. కనుక త్రిమూర్తుల స్వరూపమైన గురువు నిరంజన నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. ఈవిధంగా గురువుని భావించి ఆత్మార్పణ చేసుకున్న వారే ఉత్తమ శిష్యులు అవుతారు.
సద్గురువుకి శిష్యుడు, శిష్యుడికి సద్గురువు తప్ప మిగిలిన ప్రపంచం అంతా నిమిత్తమాత్రంగా కనిపిస్తుంది. ఇటువంటి భావనతో నన్ను విశ్వసించి పూజించే భక్తులను నేను దత్తత చేసు కుంటాను. నా భక్తులు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా నిర్మల భక్తితో నన్ను స్మరించిన వెంటనే దర్శనమిస్తాను. కష్టాలు తొలగిస్తాను. వారి అంత్యదశలో మోక్షము ప్రసాదిస్తాను.
నన్ను విశ్వసించని విశ్వాసరహితులకు నా దర్శనం లభించదు. బ్రహ్మకల్ప మహాప్రళయం సంభవించే వరకు నేను విశ్వమంతా ఉంటూ నా భక్త జనులను కాపాడుతాను" అని అనుగ్రహ భాషణం చేశారు. మునులందరు "జయహో దత్తగురు దేవా! శ్రీ గురుదత్తా!" అంటూ తన్మయత్వంతో నమస్కరించారు.
దత్తాత్రేయుడు వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.
అప్పటి నుంచి శ్రీ గురుదత్తులు సహ్యాద్రి పర్వతం నివాసం చేసుకుని ఉన్నారు. ప్రతిరోజు ప్రదోషం కాలములో కాశీనగరంలో గంగా స్నానం చేసి గాణుగాపురంలో ధ్యానం చేస్తారు. తిరిగి కుఱుక్షేత్రంలో ఆచమనం చేసి వచ్చి మధ్యాహ్నం గాణుగాపురంలో అనుష్ఠానం చేస్తారు.
ధూతపాపేశ్వరంలో భస్మధారణం, కరహాటలో సంధ్యావందనము, కొల్హాపురంలో భిక్ష, పండరీపురంలో తిలకధారణ, పాంచాలేశ్వరంలో భోజనం, బదరికాశ్రమంలో శ్రవణం, గార్నర్ లో విశ్రాంతి, పశ్చిమ సముద్ర తీరంలో సాయంసంధ్య ఆచరిస్తూ దత్తాత్రేయుల వారు నిత్యసంచారియై నిరంతరం తన భక్తులను అనుగ్ర హిస్తుంటారు...
*(సశేషం)*
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి