26, మే 2026, మంగళవారం

పూజ కు

 పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత

ఈ పుష్పాలకు సువాసన తో బాటు ఔషధ గుణములు కూడా వున్నవి .బజారు లో దొరికేవి కొన్ని. పూర్వము అడవులలో నుండి సేకరించి తోటలలో పెంచి పూజకు ఉపయోగించే వారు. చాలా మందికి బంతి ,చేమంతి, జాజి,మల్లె, గులాబీ, సంపెంగ, పద్మము, కనకాంబరం తెలిసినంతగా ఇతర పుష్పాలను కూడా వాడ వచ్చని తెలియదు. 

పద్మము, : దీన్నే తామర కమలము, అరవిందము, నళినము, సరోజము, వారిజము, అని కూడా అంటారు.పుండరీకము, కల్హారము,అంటే తెల్లని పద్మము అని అర్ధము. ఇది విష్ణువు కు, లక్ష్మి కి ప్రీతి పాత్రము.

2. కదంబము/ కడిమి: ఈ రెండు వృక్షాలు కదంబముగా పిలవ బడుతున్నాయి. వ్యాసుడు, మహాకవి కాళిదాసు, శంకర భగవత్పాదులు  పార్వతినికదంబ వన వాసిని , కదంబ ప్రియ  గా వర్ణించారు.    ఈ చెట్లు  అడవిలో  సహజం గా పెరుగుతాయి . పుష్పాలు  సువాసన భరితం గా ఉంటాయి.


3.జపా పుష్పం: మందారం ఈ పుష్పాలను కాళికా మాతకు, శివుడికి ప్రీతి పాత్ర మైనవి గా వర్ణించారు. అంగారకుని జపా పుష్ప వర్ణము కల వాని గా వర్నిస్తారు. జిల్లేడు,మరికొన్ని పుష్పములను కూడా మందారము అని వర్ణించడం జరిగింది. వీటిని కూడా మందారము / దేవకాంచనము/ మోదుగ  అంటారు.  "మందార గంధ సంయుక్తం, చారు హాసం .... అని కృష్ణుని,మందార గంధ యుతం అని అమ్మ వారిని వర్ణించారు. పార్వతిని "మహతీ మేరునిలయా మందార కుసుమ ప్రియా "అని వర్ణించారు 


4. నీలోత్పలము: నల్ల/నీలి కలువ కృష్ణుని కొందరు కవులు నీలోత్పల ద్యుతి (నీలి కాలువ వంటి వర్ణము /కాంతి) గల వాని గా వర్ణించారు. దుర్గా దేవి పూజ కు, నారాయణుని పూజకు విశేషంగా వాడతారు .  

5. కుందము: అడవి జాజి: కాళిదాసు పార్వతి పలు వరుస కుందముల వలె ఉన్నవని వర్ణింప బడినది. సరస్వతి మల్లె వలె తెల్లని వర్ణము కలిగినదని వర్ణించ బడినది.   ఇవి దేవి పూజకు వాడబడుతున్నాయి.  వాసంతి, మాగధి, మొల్లలు అనికూడా పిలుస్తారు. ఇవి సుగంధ భరితము. 

మల్లె, నవమల్లిక ఇవి మనము విరివిగా వాడే , బజారులో దొరికే మల్లె పూలు, అడవిమల్లె,సిరిమల్లె,  శ్రీమల్లె ఇవి కూడా అడవులలో దొరుకుతాయి. సుగంధ భరితము, ఈ మల్లె జాతులన్నీ దేవుని పూజకు ఉపయోగించ వచ్చు     


6. బంధూక పుష్పము:   మంకెన పువ్వు : సూర్యాష్టకం లో-బంధూక పుష్ప సంకాశం - హార కుండల శోభితం; మహా పాప హరం......   తం సూర్యం ప్రణ మామ్య హం   సూర్యుని వర్ణము బంధూక పుష్ప వర్ణము గా వర్ణించారు. దీనిని రామబాణం, నూరువరహాల పూలు అంటారు, దీనికే మంకెన, బంధూకము అనే పేర్లు కూడా వున్నాయి. కావున వీటిని కూడా ఉపయోగించ వచ్చు. ఎర్రని రంగు కలిగిన పుష్పాలను కొందరు మంకెన పూలు గా వ్యవహరిస్తారు. 

లలితా దేవిని "బంధూక కుసుమ ప్రఖ్యా "అని, "జపా పుష్ప నిభా కృతి"అని   వర్ణించారు  


7. అతశీ: కృష్ణాష్టకం లో అతశీ  పుష్ప సంకాశం హార నూపుర శోభితం --- కృష్ణం వందే జగద్గురుం- వాసుదేవుడి అతశీ పుష్ప వర్ణం లో వున్నా డని  వర్ణించారు. ఇవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సహజం గా కనిపించవు. చల్లని ప్రదేశాల్లో పెరుగు తాయి .   


8.వకుళ లేదా పొగడ:  ఈ పుష్పాలు విష్ణువు కు ప్రీతి కరము. సుగంధ భరితము.  కృష్ణుడు బృందావనం లో ఈ పూల సుగంధమును ఇష్ట పడే వాడని వర్ణించ బడినది. విష్ణు పూజకు వాడతారు.తిరుమల లో వెంకటేశ్వర స్వామికి కూడా ఈ పొగడ పూల మాలలు వేస్తారు .


9. మాలతీ: ; బృందావనం లో కృష్ణుని అలరించిన తీగ పుష్పాలు. సుగంధ భరితం. ఇవి మల్లెల్లాగే తెల్లగా సుగంధ భరితం గా ఉంటాయి. అడవుల్లో పెరుగుతాయి.    


10. మాధవి: వీటి కాయలకు 3 రెక్కలుంటాయి, అందువల్ల వీటిని పావురాయి కాయలని కూడా అంటారు .  బృందావనం లో కృష్ణుని అలరించిన తీగ  పుష్పాలు. అడవుల్లో సహజం గా ఉంటాయి .సుగంధ భరితం.   

  11. చంపకము:  ఈ పుష్పాలు విష్ణువుకు పార్వతి కి ప్రీతి పాత్రము. సుగంధ భరితము. వీటిని చాంపేయము, సంపంగి పూలని కూడా పిలుస్తారు. వీటిని పూజకు విరివిగా ఉపయోగిస్తారు.     

12. సేవంతిక: చేమంతి పూలు

13. పారిజాతము :  పొగడ, సేపాలిక, అని కూడా పిలుస్తారు.   

13. అర్క(జిల్లేడు) :; శివునికి అర్కముడు అనే పేరు కూడా వున్నది, సూర్యునికి కూడా అర్కుడు అని పేరు.  తెల్లని పూలు గలవి శ్రేష్టము ఈ పూలను గణపతి, శివ, సూర్య పూజకు మాత్రమే వాడతారు . రధ సప్తమి నాడు సూర్యారాధనకు వాడుతారు.   విష్ణు ఆరాధనకు ఉపయోగించరు.దీని కర్రతో గణపతి విగ్రహాన్ని చేసి పూజ చేస్తారు

15. పలాశ: కింశుక / మోదుగ: దీని పుష్పాల తో హోళీ రంగులు చేసి ఆడుకుంటారు. దీని శాఖ తో చేసిన కర్రను ఉపనయనము సమయం లో వాడతారు .వీటిని మన్మధుని గోర్లు అని కూడా అంటారు.

  16. ద్రోణ: తుమ్మిపూలు; వీటి పూలను కార్తీక మాసం లో మాస శివ రాత్రి, సోమవారం, ఆర్ద్ర నక్షత్రం వున్న రోజుల్లోశివ పూజకు ఉపయోగిస్తారు. వీటి ఆకును ఆకు కూర గా వాడతారు. విష్ణు పూజకు ఉపయోగించరు.

17. అశోకము:  ఈ చెట్టు కింద నే సీతమ్మ వారు రావణుడి చెర లో వుండినదని రామాయణం లో వర్ణించ బడినది. దీనికి వంజులము అని మరియొక పేరు.  ఇది శోక నాశకము గ భావిస్తారు. వీటి పూలను అమ్మ వారి పూజకు వాడతారు. లలితా దేవిని "చంపకాశోకపున్నాగ సౌగంధికా లసత్కచా "అని వర్ణించారు 


18. మామిడి/హిందువుల ఇళ్ళలో మామిడి ఆకులు లేకుండా ఏ పండుగను కానీ శుభ కార్యమును గానీ ఊహించలేము. ఇది అతి పవిత్రమైన వృక్షము. దీని ఆకులనే కాక పుష్పాలను కూడా సరస్వతీ దేవి, వినాయకునికి , లక్ష్మీ పూజకు వాడతారు.


18.  వేప: దీనిని నింబ వృక్షము అని కూడా అంటారు.  వేప పూలను తెలుగు వారు ఉగాది నాడు వాడతారు . వేప చెట్టు ను లక్ష్మీ స్వరూపం గా పూజిస్తారు.  గ్రామ దేవతల పూజలకు ఉపయోగించడము అందరికి తెలిసినదే .

19. కేతకి: దీన్నే మొగలి పూవు అని కూడా అంటారు.

దీన్ని శివ పూజకు తప్ప మిగిలిన దేవతారాధనకు వాడతారు. శివ లింగము ఆది అంతము చూచానని అబధ్దము చెప్పడం వలన పూజకు పనికి రాకుండా పోయింది.

20. పున్నాగ: దీన్ని పొన్న అనికూడా అంటారు. తెల్లని సుగంధ భరితపుష్పాలు ఉంటాయి. వీటిని శివ పార్వతుల పూజకు, విష్ణు పూజకువాడతారు.

21. పాటల/ పాటలీ/కలిగొట్టు పుష్పము: శివ పార్వతుల సమాగమము ఈ చెట్టు కింద జరిగినదనిపురాణములలో వర్ణించ బడినది. అందువలన పసుపు రంగు కల ఈ పుష్పము లుశివపార్వతుల కు ప్రీతి పాత్రము.

లలితా పరమేశ్వరి  "దురా రాధ్యా , దురా ధర్షా పాటలీ కుసుమ ప్రియా "అని కీర్తించ బడింది  


22. కరవీరము/ఎర్రగన్నేరు/కస్తూరిపూలు: వీటిని శివ, పార్వతి, వినాయక పూజకు వాడతారు.  

  

 23. దేవకాంచనము/అడవి గన్నేరు/ దేవ గన్నేరు అనికూడా అంటారు. 


24. మధూకము: దీనినే ఇప్ప/ విప్ప అంటారు. వీటిని పూజకు వాడక పోయినా, ఎండిన పూలను తేనెతో కలిపి  భద్రాచలం వంటి కొన్ని దేవాలయాల్లో ప్రసాదం గా వాడతారు.ఇవి తియ్యగా ఉంటాయి. 


కనకాంబరం, జాజి, గులాబీ , నందివర్ధనం, గన్నేరు,

లింగాక్షతలు/ చిలకముక్కుపూలు,

గిరికర్ణికా-అంటే శంకు పుష్పాలు: 

దేవకాంచనము,  వంటి సుగంధ భరిత పుష్పాలను వాడతారు.

బంతి :  దీన్ని గొబ్బెమ్మలు , బతుకమ్మల ను అలంకరించడానికి వాడతారు ; పురాతన గ్రంధాలలో దీని ప్రస్తావన లేదు. 

తంగేడు, గురుగు, గుమ్మడి , బీర ,  పూలను ప్రధానం గా బతుకమ్మ(తెలంగాణాలో  ) పూజించడానికి , గొబ్బెమ్మలను(ఆంధ్ర లో ) పూజించడానికి వాడతారు.

గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే 

విశాలే శైలే  చ  భ్రమతి కుసుమార్ధం జడ మతి 

సమార్పైకం చేతస్సరసిజం ఉమానాథ భవేత్ 

సుఖేనా వ స్థాతుం  జన ఇహ న జానాతి కి మ హో 

అర్ధము: ఓ ఉమా నాథుడా  మంద బుద్ధి గల వారే నీ పూజా పుష్పాల కొరకు లోతైన చెరువుల్లో, జన సంచారం లేని ప్రమాద కరమైన అడవుల్లో, విశాల మైన కొండల్లో తిరుగుతాడు. కానీ హృదయ సరోవరం లో పూచిన ఒక పద్మాన్ని నీకు సమర్పిస్తే వున్న చోటే సుఖం గా ఉండ వచ్చ్చని ఈ ప్రజలకు తెలియ దంటే విచిత్రం గా వుంది . ఈ పూల న్నిటి కన్నా హృదయ పద్మమే భగవంతునికి ప్రీతి కరము అని భావము .

కామెంట్‌లు లేవు: