26, మే 2026, మంగళవారం

భోజనం

 *భోజనం* 


“మనం బతకడానికి తినాలి. తినడానికి బతక కూడదు” లాంటి నీతి సూత్రాలు ఎన్ని వున్నా, మనం బతికేది తినడానికే నన్నది నగ్నసత్యం. అలారం లేక పోయినా ఠంచను గా రోజుకి మూడు పూటలా, ఒక్కోసారి అంతకంటే ఎక్కువగా మన పొట్ట పెట్టే ఆకలి కేకలు అందరికీ అనుభవమే. బతకడానికి గాలి, నీరూ కూడా అవసరమే కానీ వాటిలో వెరైటీ లేదు. పైగా సులభంగా దొరుకుతాయి. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ భోజనం అలా కాదే! ఎన్నెన్ని రకాలు, ఎన్నెన్ని రుచులు, ఎంతెంత ఖరీదులు? ఇప్పుడు వాటి జోలికి వెళ్లొద్దు కానీ.. .. ఆగండి. అది జోలి కాదు. జోలె. అంటే బిచ్చగాళ్లు తమ సంపాదన (బియ్యం, కూరలు వగైరా) వేసుకుని భుజానికి తగిలించుకునే సంచీ. అంటే వాళ్ళు సంపాదించుకున్న తిండికి పోటీగా రావద్దని చెప్పడం. చూశారా, భోజనం మన మామూలు మాటల్లో కూడా ఎంతగా పాతుకుపోయిందో ? 


సరే. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఈ భోజనం చేసే అలవాటు గురించి. ఆది మానవులు ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు వేటాడుకుని/పళ్ళు, దుంపలు కోసుకుని లేదా ఏరుకుని ఎవరి తిండి వాళ్ళు తినే వాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని అడవి జంతువులు అలాగే తింటాయి. కొన్నాళ్ళకి గుహలలో నివాసం మొదలెట్టి,నిప్పు కనిపెట్టిన తర్వాత, ఆడవాళ్ళని గుహలో ఉంచి, మగవాళ్ళు వేటకెళ్ళి ఏ జంతువునో చంపి తీసుకు రావడం, దాన్ని ఆడవాళ్ళు కాల్చడం తరవాత అందరూ కలిసి దాన్ని భోంచేయడం అలవాటయ్యింది .  

 

రాను రాను ఈ అలవాటు కాస్తా ముదిరి ముదిరి ఆడవాళ్ళని వంటింటికి పరిమితం చేసేదాకా వచ్చింది. వేటాడడం కొంచెం రిస్క్ తో కూడుకున్నది కాబట్టి మగాళ్ళు ముందు తినాలని, ఎక్కువ తినాలని రూలు పెట్టేశారు. తర్వాత్తరవాత వ్యవసాయం చెయ్యడం నేర్చుకుని, చావు రిస్క్ లేకుండా చేసుకుని, ఆ తర్వాత పొలం కౌలుకి ఇచ్చి వంటికి పనిలేకుండా చేసుకున్నా మగవాళ్ళు తమ ప్రియారిటీ మాత్రం వదులుకోలేదు. సుష్టుగా భోంచేయడం మాత్రం మానలేదు.     


ఆ తర్వాత అంటే ఒక 100-150 సంవత్సరాల క్రితం ఒక్కొక్కళ్ళకీ కనీసం అరడజను మంది పిల్లలు వుండడం, మగవాడికి భోంచేయడం తప్ప వేరే పని లేకపోవడంతో అందరూ కలిసి మూడు పూటలా ఒకేసారి తినడం అలవాటైంది. ఆ టైమ్ లోనే “ మూలుగులు మునపటి లాగా, భోజనాలు ఎప్పటిలాగా”, “ అందరికీ ఏదో రోగమే కాని అడ్డెడు గిన్నికి ఏ రోగమూ లేదు” లాంటి సామెతలు పుట్టాయి. తరవాత మెల్లిగా చదువులు,వుద్యోగాలు మొదలై, మూడు పూటలూ కలిసి తినడం వీలుపడక రోజుకి కనీసం ఒక సారైనా కుటుంబం అందరూ కలిసి, కింద కూర్చునే భోంచేయడం మొదలయ్యింది. అల్లరి చేసే పిల్లలని, బాగా చదువుకోని పిల్లలని తండ్రి మందలించడానికి భోజనాలు చేసేటప్పుడే కుదిరేది. 


నెమ్మ నెమ్మదిగా జీవన విధానంలో మార్పులు జరిగి కింద కూచోడం మానేసి టేబుల్ మీద తినడం మొదలైంది. బాసింపట్టు వేసుకుని కూర్చోడం అలవాటు పోయింది. ఈ టైమ్ లోనే టివి వచ్చింది. భోజనం ప్లేసు కాస్తా టేబుల్ నించి టీవీ ముందు సోఫా/కుర్చీ లోకి మారింది. తర్వాత మొబైలు వచ్చింది. ఎవరికి వాళ్ళు తమ గదిలో మంచం మీద రీల్స్ చూస్తూ తినడం అలవాటైంది. ఒకప్పుడు అమ్మ ఆప్యాయంగా వడ్డిస్తూ ఎవరైనా సరిగా తినకపోతే గుర్తించేది. ఇప్పుడు అందరూ ఎవరికి వారు వడ్డించుకుంటూ ఎటో చూస్తూ ఏదో తినెయ్యడమే. 


ఆది మానవుల కుటుంబాలు కూడా రోజూ అందరూ కలిసి భోంచేసేవారు. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఎప్పుడు తింటారో ఎవరికీ తెలియదు. వాళ్ళు వేడి వేడి గా తినే వారు. వీళ్ళు ఎప్పుడో వండి ఫ్రిట్జ్ లో పెట్టినవి తింటున్నారు. ఒక సారి విన్నాను - అమెరికాలో వంట చేసే ఆమె వారానికి ఒక రోజే వస్తుందట. అప్పుడే ఆ వారంలో ఏడు రోజులకీ, 14 పూటలకీ సరిపడా వంట చేసేసి, ఆ గిన్నెల మీద వారాల పేర్లతో సహా రాసేసి ఫ్రిట్జ్ లో పెట్టి వెళ్ళిపోతుందట! 


మన దేశంలో ఇప్పుడు చిన్నచిన్న పట్టణాలలో కూడా స్వీగ్గీలు,జోమాటోలు వచ్చేశాయి. ఇక కర్రీ పాయింట్ల సంగతి అందరికీ తెలిసిందే. వీధికో రెండు వుంటున్నాయి. అన్నీకలిసి వంటింటిమీద దాడి చేస్తున్నాయి.ఇంట్లో వంట వండే కళ అంతరించిపోతోంది. దానితోబాటే అంతకంటే ముఖ్యమైన వడ్డించే కళ కూడా అదృశ్యమైపోతోంది. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అందరూ కూర్చుని, ఆ ఇంట్లోవాళ్ళు కొసరి కొసరి వడ్డిస్తుంటే తిన్నప్పటి తృప్తి, టేబుల్ మీద అన్నీ పెట్టేశాము, మీకు కావలసినవి పెట్టుకు తినండి అనడంలో ఖచ్చితంగా వుండదు.


భోజనం అంటే కేవలం కడుపు నింపడానికే కాదు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగడానికి, ఒంటరితనం ఫీలవకుండా ఉండడానికి కూడా. ఇంగ్లీష్ లో ఒక సామెత చెబుతారు -ది వే టు ఎ మేన్స్ హార్ట్ ఈజ్ త్రూ హిస్ స్టమక్ అని. అంటే ఒక మనిషి హృదయానికి దారి పొట్టలోంచేనని. అందుకే కాబోలు కొత్త అల్లుడికి అత్తారింట భోజనంలో అంత రాచమర్యాదలు చేస్తారు. ఇంట్లో రోజుకి ఒకసారైనా ఫామిలీ మొత్తం కలిసి కూర్చుని, టీవీ,మొబైల్స్ చూడకుండా, కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తే ఆ ఆనందమే వేరు. ఆ తినేది కూడా ఇంట్లోనే వండుకుని తింటే ఆ అనుభూతే వేరు. అందరికీ ఆ ఆనందం, అనుభూతి లభించాలని కోరుకొందాం.

కామెంట్‌లు లేవు: