16, జూన్ 2026, మంగళవారం

శ్రీమన్నారాయణీయము

  *శ్రీమన్నారాయణీయము*


*89వ దశకము - వృకాసురవధ - భృగు పరీక్షణము - ఎనిమిదవ శ్లోకము*


*331. సుప్తం రమాంకభువి పంకజలోచనం త్వాం*

*విప్రే వినిఘ్నతి పదేన ముదోత్థితస్త్వమ్*

*సర్వం క్షమస్వ మునివర్య ! భవేత్ సదా మే*

*త్వత్పాదచిహ్నమిహ భూషణమిత్యవాదీః*


*భావము :*

*ప్రభూ ! ఒకప్పుడు సరస్వతీ నదీతీరమందున్న మహర్షులకు, త్రిమూర్తులయందు మిక్కిలి సాత్వికుడెవ్వడనే సందేహం కలిగింది. ఈ విషయము తెలుసుకోవటానికై వారు భృగుమహర్షిని నియోగించారు. అప్పుడతడు బ్రహ్మలోకానికి వెళ్లి ఆయన యెడ అనాదరం చూపగా, అతనిపై బ్రహ్మదేవునికి కోపము కలిగింది. దానికి అతడు ఏ విధంగానో ఓర్చుకున్నాడు. కైలాసానికి వెళ్లి శంకరునిపై చులకన భావంతో ప్రవర్తించగా, ఆయనకు కోపము కలిగి భృగు మహర్షిని చంపబోయాడు. అప్పుడు పార్వతీదేవి శంకరుని వారించింది. చివరికా మహర్షి నీ దగ్గరికి వచ్చాడు.*


*శ్రీపతీ ! ఆ సమయంలో, పద్మాలవంటి కన్నుల గల నీవు, రమాదేవి యొక్క ఒడిలో నిద్రిస్తున్నావు. అప్పుడు భృగుమహర్షి తన కాలితో నిన్ను తన్నాడు. నీవు నిద్ర నుండి లేచి, ఏమాత్రమూ కోపించక, "మునివర్యా ! నా తప్పులన్నింటినీ క్షమించు. నీ పాదచిహ్నం నాకెప్పుడూ ఆభరణంగా ఉంటుంద"ని మిక్కిలి ఆదరంతో, ప్రశాంతంగా పలికావు.*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: