10, అక్టోబర్ 2021, ఆదివారం

విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు

 నిజం గా జరిగిన సంఘటన




విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు..


ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది..


1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది..


విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు..


అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి..


అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది..


అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లీ అమ్మ.. తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు అంటాడు..


కొంత దూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అనగా వెనక నుండి సమాదానం లేదు అదేంటీ అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో అదేంటీ అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటీ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగా లో పెట్టాను చూడు అంటుంది.. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, పదిరూపాయల నోటు మరో పక్క ఉన్నాయి.


వెంటనే ఆయనకి అర్ధమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్నఅమ్మ అని..


దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరు పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగగా వారికీ జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్ధమవుతుంది...


ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి


ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు..

కామెంట్‌లు లేవు: