27, అక్టోబర్ 2021, బుధవారం

విద్యతో వినయం వృద్ధి చెందాలి

 *విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు..!!!*


🔸🔸🔸🔸🔹🔹🔹🔸🔸🔸


*మహాకవి కాళిదాసు* ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి *"దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి"* అని అడుగుతాడు....


గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి *‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు?'* అంటుంది....


కాళిదాసు "నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు" అని అంటాడు....


ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి.. 'మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే *ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’* అని అంటుంది....


కాళిదాసు కాసేపు ఆలోచించి"నాకు తెలియదు. గొంతు ఎండి పోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి" అని బతిమాలుకుంటాడు...


" *ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.* ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?" అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....


ఈసారి ‘ *నేను బాటసారి’* ని అంటాడు కాళిదాసు....


అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....


తెల్ల ముఖం పెట్టి మాతా! "నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళిదాసు....


*వాళ్ళు సూర్యచంద్రులు* ’ అని తెలిపి" మరి మీరెవరో సెలవివ్వండి. నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....


కాళిదాసు దీనంగా" నేను అతిథిని"అని బదులిస్తాడు....


"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే. *ఒకటి ధనం, రెండోది యవ్వనం* . అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు"అంటుంది ముసలావిడ....


కాళిదాసు "నా సహన పరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి"అని వేడుకుంటాడు....


*"ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు. వారెవరో శెలవివ్వ గలరా"* అంటూ... బిక్కమొహం వేసిన కాళీదాసుతో *"ఒకటి భూమి, రెండోది వృక్షం"* అని భోద పరచి"ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?" అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....


ఓపిక నశించిన కాళిదాసు" నేను మూర్ఖుడను. ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి" అని సాగిల పడతాడు....


ఆ అవ్వ నవ్వుతూ *"ఇదీ అసత్యమే.* ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు" అని అంటుంది....


ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....


ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. *‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు.కీర్తి, ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’* అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.


*విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి*.

కామెంట్‌లు లేవు: