1, నవంబర్ 2021, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*485వ నామ మంత్రము* 1.11.2021


*ఓం అనాహతాబ్జనిలయాయై నమః*


హృదయమునందలి అనాహతచక్రము అను ద్వాదశ (పన్నెండు) దళముల పద్మమందు రాకినీయోగినీ రూపంలో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అనాహతాబ్జ నిలయా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం అనాహతాబ్జనిలయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు రాకినీస్వరూపిణియైన ఆ పరమేశ్వరి వారికి ఇష్టమగు కోరికలను నెరవేర్చును.


జగన్మాత హృదయమునందు పండ్రెండుదళములుగల అనాహతపద్మమునందు రాకినీయోగిని స్వరూపంలో విలసిల్లుచున్నది. రాకినీయోగిని ఈ విధముగా వివరింపబడినది: రాకినీదేవి పండ్రెండుదళములుగల పద్మమందు శ్యామలవర్ణముతో భాసిల్లుచున్నది. ఆ దేవికి రెండుముఖములుగలవు. నాలుగు బాహువులయందును చక్రము, శూలము, కపాలము, డమరుకములను ధరించియున్నది. ఆ తల్లి మూడునేత్రములు గలిగినదిగా ఉన్నది. సప్తధాతువులలో రక్తధాతునందు విలసిల్లుచున్నది. రాకినీదేవి కాళరాత్రి మొదలగు పండ్రెండు మంది యోగినులచే పరివేష్టింపబడినది. రాకినీదేవికి నేతి అన్నము అనిన ప్రీతి. ఆమె ఉపాసకశ్రేష్ఠులచే నమస్కరింపబడుచున్నది. ఆ దేవి ఇష్టమైన కోరికలు నెరవేర్చునదిగా చెప్పబడుచున్నది. అనాహతాబ్జ చక్రాధిష్ఠానదేవతను వామదేవి అందురు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి యను వాక్కునకు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి యను నాలుగురూపములు ఉండగా పరాస్థానమునందు పుట్టి, పశ్యంతిగామారిన వాక్కు అనాహతాబ్జమునందు మధ్యమ రూపమునకు చేరును. అనాహతాబ్జపద్మము బంగారు రంగులో ఉండును. అనాహతాబ్జ చక్రమునకు అధిధేవత రుద్రుడు. అనాహతాబ్జపద్మమునందుగల పండ్రెండు దళములందు క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ అను పండ్రెండు వర్ణములు పండ్రెండు శక్తిరూపములుగా ఉండును. *అనాహతాబ్జనిలయా* యను 485వ నామ మంత్రము నుండి *మహావీరేంద్రవరదా* యను 493వ నామ మంత్రమువరకూ రాకినీదేవియొక్క విశేణములు వివరింపబడినవి. 


రాకినీదేవి స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అనాహతాబ్జనిలయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: