23, మే 2024, గురువారం

చివరి సందేశం

 *🌹🌹 పరమాత్మ చివరి సందేశం 🌹🌹*


            *ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు...*


                *శ్రీ కృష్ణుడు బలరాముడితో "అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి" అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్యసఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.*


              *ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి "కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి" అన్నాడు.*


              *అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.*


               *ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.*


               *దీని తర్వాత ఇంక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.*


           *“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.*


                 *కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరుతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.*


              *ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.*


               *కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెలచేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.*


                *కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.*


                *అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.*


              *ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదముకొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.*


                *మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.*


            *ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.*


                *ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.*


             *కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.*


            *ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.*


            *కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.*


              *కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరునియందు భేదమును చూస్తారు.*


             *కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. "ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో"*


             *కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను,ఉంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా. ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, ఇంద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.*


            *ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం ...*


           *ఈ సందేశం మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.*

కామెంట్‌లు లేవు: