23, జూన్ 2024, ఆదివారం

నీతి కథ

 *#నిజాయితి___దురాశ*

××××××××××××××

విశ్వనాథ్ ఎవరికో డబ్బు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి బ్యాంక్ నుండి క్యాష్  విత్ డ్రా చేయడానికి వెళ్ళాడు. విత్ డ్రా స్లిప్ లో 1,00,000 అని వ్రాసి రెండు వైపులా సంతకం చేసి ఇచ్చాడు. ఇతడే విశ్వనాథ్ అనేది ఖచిత పరచుకున్న క్యాషియర్ డబ్బు ఇచ్చేశాడు. 

 క్యాషియర్ ఇచ్చిన డబ్బును అక్కడే పక్కన నిలబడి లెక్కిస్తే అందులో 1,00,000 రూపాయలకు బదులు 1,20,000 ఉన్నాయి. విశ్వనాథ్ క్యాషియర్ ముఖాన్ని ఒకసారి చూశాడు. ఇదేమీ తెలియనట్లుగా అతడు మరొక వ్యవహారం లో నిమగ్నమై ఉన్నాడు. విశ్వనాథ్ మెల్లిగా డబ్బును బ్యాగ్ లో పెట్టి అక్కడినుండి వెళ్ళిపోయాడు. 

నేను ఈ రకంగా చేసింది సరా, తప్పా అనే ప్రశ్న ఆయన మనసును కొరకడం ప్రారంభమైంది. ఒకసారి ఈ డబ్బును తిరిగి ఇచ్చేయాలి అని మనసు చెబితే, మరొకసారి వేరే ఎవరికైనా నేను ఈ రకంగా ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళు వెనక్కు ఇచ్చేవారా అనే ప్రశ్న   ఎదురైంది. ఎవరు ఇస్తారు ? ఎవరూ ఇవ్వరు అని మనసు చెప్పింది. కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అని విశ్వనాథ్ తీర్మానించుకున్నాడు. 

  కాసేపటికే మళ్ళీ డబ్బు గురించే ఆలోచన. క్యాషియర్ ఇపుడు ఈ డబ్బును తన చేతినుండి కట్టాల్సి వస్తుంది. అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందోననే ఆలోచన వచ్చింది. మరో క్షణంలో , బ్యాంక్ వారికి మంచి జీతం వస్తుంది, ఉండనీలే, అదృష్టం కొద్దీ లభించిన డబ్బును ఎందుకు ఇవ్వాలి అన్నది మనసు. 

    బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసేవారు తక్కువమంది. కాబట్టి నాకు ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చామనేది వారికి తెలిసిపోతే, నన్నే అడిగితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. అయితే, ఒకసారి నా చేతికి డబ్బు వస్తే అది నాదే గదా అని మనసు మరొక దిశలో ఆలోచించింది. ఇలా అనేక సార్లు జరిగి సాయంత్రం నాలుగు గంటలు దాటింది. 

    అపుడు మరొకసారి ఆలోచించాడు విశ్వనాథ్. అపుడు మనసు ఇతరుల తప్పు కారణంగా లాభం పొందడం సరి కాదు. ఈ 20,000 రూపాయలు నా నిజాయితీకి ఎదురైన ఒక పరీక్ష అంతే . ఇందులో గెలవాలా, ఓడాలా అన్నదే ముఖ్యం అన్నది. దాంతో ఒక క్షణమూ ఆలోచించకుండా విశ్వనాథ్ బ్యాంక్ కు పోయాడు. 

    అక్కడ క్యాషియర్ తల మీద చేతులు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. చెమటలు పట్టి ఉన్నాయి. డబ్బును కౌంటర్ లో పెట్టి విషయం చెప్పాడు విశ్వనాథ్. క్యాషియర్ ఆ డబ్బును గుండెలకు హత్తుకుని కళ్ళలో నీరు నింపుకున్నాడు. 

   మీరు ఈ డబ్బు తెచ్చి ఇవ్వకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఈరోజు పెద్ద మొత్తాలకు సంబంధించిన డ్రా లు జరిగాయి. కాబట్టి ఎవరికి ఎక్కువ మొత్తం వెళ్ళిందనేది తెలియడం లేదు. మీరు తెచ్చి ఇవ్వకపోయుంటే నా జీతంలో నుండి దాన్ని వసూలు చేసేవారు. ఇప్పటికే పిల్లల స్కూలు ఫీజులకు అప్పు చేశాను. ఇపుడు ఈ మొత్తమూ కట్టాల్సివచ్చి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. థ్యాంక్స్ సర్. పది నిమిషాలలో పని ముగించి వస్తాను. కలసి కాఫీ త్రాగుదాం అన్నాడా క్యాషియర్. 

అపుడు విశ్వనాథ్ ' అదేమీ వద్దు. నేనే మీకు పార్టీ ఇస్తాను. అవసరమైతే మనమిద్దరమూ మన భార్యలనూ పిలుద్దాం' అన్నాడు. 

     క్యాషియర్ కు ఆశ్చర్యం. మీరెందుకు పార్టీ ఇవ్వాలి, నేను కదా ఇవ్వాల్సింది అన్నాడు. 

     అపుడు విశ్వనాథ్ మీరు 20,000 ఎక్కువగా ఇచ్చినందున ఈ రోజు నేనెంత దురాశాపరుడిని అనేది నాకు తెలిసొచ్చింది. చివరకు నేను ఈ దురాశను వదలి వేయగలను అన్నది కూడా ప్రూవ్ అయింది. అటా ఇటా అనే గందరగోళం నుండి నేను గెలిచాను. ఇలాంటి అవకాశం ఇచ్చింది మీరు. అందుకు కృతజ్ఞతగా ఈ పార్టీ అన్నాడు. 

ఇలా కూడా ఆలోచించవచ్చా అని అవాక్కయ్యాడు క్యాషియర్.


నేటి సమాజానికి ఈ నీతి కథ అవసరం ఎంతో ఉంది..

easy money కి ఆశపడే వారు ఎక్కువుగా వున్నారు..

నీతి గా ఆలోచించేవారి సంఖ్య తగ్గింది.


మీ.... మాస్టారు...!!!

కామెంట్‌లు లేవు: