2, సెప్టెంబర్ 2024, సోమవారం

శ్రీ కృష్ణ పరమాత్ముని చివరి సందేశం...

 శ్రీ కృష్ణ పరమాత్ముని చివరి సందేశం...


ద్వాపరయుగం ఇంకా కొద్ది కాలంలో ముగిసిపోయి, కలియుగం రాబోతుందనగా ఒకరోజున జరిగిన కృష్ణ, ఉద్ధవుల సంభాషణ:

 

 శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.


ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.


ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతిగా ఉండేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకు ఏదయినా ఉపదేశం చెయ్యి”అన్నాడు.


అప్పుడు కృష్ణపరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవునితో ప్రస్తావన చేశాడు.*


ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.


దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుని అడ్డుపెట్టి చెప్పాడు.


“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.


కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు ప్రారంభం అవుతాయి. అవి, ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.


ఎవ్వరూ కూడా తమతప్పు తాము తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో అస్సలు చెయ్యరు.


కోర్కెలచేత, అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెలచేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.


కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. వేదాన్ని విడచి, అంతా తమ ప్రతిభే అని నమ్ముతారు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి పుట్టగొడుగుల్లా పుట్టే అనేక వేరు, వేరు మార్గములలో నడుస్తూ అదః పాతాళ దారుల్లో నడుస్తూ వెళ్ళిపోతారు.


అల్పాయుర్దాయంతో జీవిస్తారు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.


ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి అసలే ఉండదు. 


మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి. అది తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు.


ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. దానితో, ప్రజలు రాజుల మీద తిరగబడతారు.


ఎవరుకీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. డబ్బు ప్రాధాన్యంగా నిలుస్తుంది. అది ఎలాంటి సంపాదన అయినా కూడా!


కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.


ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఉన్నత ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటిని దర్శించటం కంటే, ఆడంబర ప్రాధాన్యత హెచ్చుగా ఉంటుంది.


కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, ఆలయంలోని దైవాన్ని చూడరు. మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి, అని అనుకోరు.


 హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.


కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా ఒట్టిదని తెలుసుకో. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో! 


కలియుగంలో గాని, ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను. ఉంటాను. ఇది తెలుసుకో! విశ్వసించు ఉద్ధవా! ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, ఇంద్రియ నిగ్రహము, మాట మౌనం మనసు మౌనంతో ధ్యానంలో కూర్చొనుటే, ఈశ్వరుని సేవించుట అని తెలుసుకో! ఇలా ధ్యానం, అభిషేకం మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెడతారో వారు శాంతి అనే మెట్లెక్కటం మొదలుపెడతారు.


ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఇచ్చిన చివరి సందేశం...


ఈ సందేశం ఉద్ధవునికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.


విని, ఆచరించి తరిద్ధాము🙏


సేకరణ

కామెంట్‌లు లేవు: