( " శివ " అను రెండు అక్షరములు ఉచ్చరించినంత మాత్రాన సమస్త పాపములు నశించును - ధర్మ రక్షకుడు,ఈ జగత్తుకు ప్రభువు, అయిన శివుని ఎవడు నిందిస్తున్నాడో వాడి నాలుకను కోసివేయవలెను - సతీదేవి దక్షప్రజాపతితో )
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను. మరల మరల నమస్కరిస్తున్నాను).
--------
" శివునకు హవిర్భాగం లేకుండా యజ్ఞము చేస్తున్న
శివ ద్వేషి అయిన దక్షప్రజాపతితో, సతీదేవి ఇలా అన్నది.
"తండ్రీ! శివుడు సమస్త జీవులకు ప్రియమైన ఆత్మస్వరూపుడు.
తనకు ప్రియమైన వాడు గాని,అప్రియమైన వాడుగాని లేనివాడు.
ఎవ్వరియందు వైరభావము లేనివాడు.
ఈ జగత్తులో శివునికంటే శ్రేష్ఠుడు ఎవడు లేడు.
ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు, కారణమైన వాడు.
అటువంటి శివునిపై నీవు తప్ప మరి యెవరు విరోధము వహించెదరు?
సత్పురుషులు ఇతరుల దోషములను గూడా గుణములు గానే గ్రహించెదరు.
కాని నీవంటి అసూయాపరుడు ఇతరులలోని మంచి గుణములలో గూడా దోషములనే చూస్తాడు.
గుణ,దోషములను, యథార్థముగా చూచువాడు మధ్యముడు.
మహాత్ములు ఇతరుల దోషములను పట్టించుకొనకుండా,వారి అల్పగుణములను కూడా గొప్పవిగా స్వీకరింతురు.
శివుడు అటువంటి మహాత్ముడు.
సర్వోత్తముడైన ఆ శివుని అవమానించి నీవు మహా పాపమును చేశావు.
శ్లో//నాశ్చర్య మేతద్య దసత్సు సర్వదా
మహద్వినిన్దా కుణపాత్మ వాదిషు/
సేర్ష్యం మహాపూరుష పాద పాంసుభి
ర్నిరస్త తేజస్సు తదేవ శోభనమ్//
(నశించే శరీరమునే ఆత్మ అని భావించే అసత్పురుషులు, మహాత్ములను నిందించడములో ఆశ్చర్యమేముంది!
మహాత్ములు,తమ నిందను సహిస్తారు.
బ్రహ్మాదులు శిరస్సున ధరించే వారి పాద ధూళి మాత్రము మహాత్ముల నింద సహించదు.
ఆ పాద ధూళి అసత్పురుషులను నశింపజేస్తుంది.
అది మంచిదే గదా!
అనగా మహాత్ములను నిందించిన వారు తమ కృత్యముల వలన తామే నశిస్తున్నారు.
దుర్మార్గులు నశించడము లోకానికి క్షేమమే గదా!
ఆ విధంగా దుర్మార్గులు మహాత్ములను నిందించడం లోక క్షేమం దృష్ట్యా మంచిదే).
శ్లో// యద్ద్వ్యక్షరం నామగిరేరితం నృణాం,
సకృత్ప్రసంగా దఘమాశు హంతి తత్/
పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం,
భవానహో ద్వేష్టి శివం శివేతరః//
( ఎవరి నామము "శివ" అను రెండు అక్షరములు కలిగి వేదములలో ప్రసిద్ధి చెంది ఉన్నదో,
ఎవరి నామము మానవులు కేవలము ప్రసంగ వశమున ఒక మారు ఉచ్చరించినంత మాత్రమున వారి పాపములను నశింప జేయునో,
అనుల్లంఘ్యనీయమైన శాసనము కలవాడు,
పవిత్రమైన యశస్సు కలవాడు,
అయిన ఆ శివుని,
అమంగళ స్వరూపుడవైన నీవు మాత్రమే ద్వేషించు చున్నావు.ఎవరూ ద్వేషించరు).
సతీదేవి దక్షప్రజాపతి తో ఇంకా ఇలా అన్నది.
" తండ్రీ! తుమ్మెదలు మకరందము కోసము పద్మములను సేవిస్తాయి.
అలాగే బ్రహ్మానందమనే మకారందాన్ని ఆస్వాదించడానికి బ్రహ్మాది మహాత్ములందరు శివుని పాదపద్మములను సేవిస్తున్నారు.
ఆ శివుని పాదపద్మములు భక్తజనులకు మనోవాంఛిత వస్తువులను నిరంతరము వర్షించు చుండును.
విశ్వబంధువగు అట్టి శివుని నీవు ద్వేషించుచున్నావు.
శ్లో//కిం వా శివాఖ్య మ శివం న విదుస్త్వదన్యే,
బ్రహ్మాదయ స్తమవకీర్య జటాః శ్మశానే/
తన్మాల్య, భస్మ, నృకపాల్య వస త్పిశాచై
ర్యే మూర్ధభి ర్దధతి తచ్చరణావ స్పృష్టమ్//
(శ్మశానభూమి యందలి మానవ కపాల మాలను,చితాభస్మమును, ఎముకలను, ధరించేవాడు అని శివుని నీవు నిందించావు.
జడలను విరబోసుకుని భూత, ప్రేత,పిశాచములతో బాటు శ్మశానములలో నివసిస్తాడు అన్నావు.
పేరుకు మాత్రమే శివుడు, కానీ వాస్తవానికి అశివుడు ( అమంగళుడు ), అని కూడా నిందించావు.
బ్రహ్మదేవుడు మొదలైన మహాత్ములందరూ నీవు దూషించిన శివుని పాదముల నిర్మాల్యమును భక్తితో శిరస్సు మీద ధరిస్తున్నారు.
పాపం!వారందరూ నీ అంత విజ్ఞానం ఉన్నవారు కాదు కాబోలు ! )
ధర్మ రక్షకుడు,ఈ జగత్తుకు ప్రభువు, అయిన శివుని ఎవడు నిందిస్తున్నాడో వాడి నాలుకను కోసివేయవలెను.
అందుకు సమర్ధుడు కాకున్నచో, ఆ శివ నింద వినకుండా, చెవులు మూసుకుని, అక్కడనుండి వెళ్లిపోవలెను.
అటుల చేయలేక పోతే ప్రాణములు విడిచి పెట్టవలెను.
ఇదే ధర్మము.
శ్లో//అతస్తవోత్పన్న మిదం కలేవరం,
న ధారయిష్యే శితికంఠ గర్హిణః/
జగ్ధస్య మోహాద్ధి విశుద్ధి మంధసో,
జుగుప్సిత స్యోద్ధరణం ప్రచక్షతే//
(అందువలన శివ ద్వేషివైన నీ నుండి పుట్టిన ఈ దేహమును ఇటుపై నేను ధరించను.
పొరబాటున తినకూడని అన్నము తిన్నచో,దానిని వమనము చేయుటయే అందుకు విరుగుడు).
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
15-2-'26.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి