🕉 మన గుడి : నెం 1389
⚜ తమిళనాడు : నెడుంగుణం
⚜ శ్రీ యోగ రామచంద్ర ఆలయం
💠 కడు రమణీయమైన ప్రకృతి సౌందర్యం వుట్టిపడే నెడుంగుణం అనే ఊళ్ళో ఒక విభిన్నమైన శ్రీ వైష్ణవాలయం వున్నది.
అదే 'యోగ రాముని' ఆలయం.
💠 ఈ ఆలయంలోని శ్రీరాముడు కోదండం లేకుండా యోగముద్ర ధరిస్తూ దర్శనమివ్వడం ఒక విశిష్టత.
💠 ఈ దేవాలయం తమిళనాడులోని వందవాసికి సమీపమున గల నెడుంగుణం అనే ఊరిలో వుంది.
⚜ స్థల పురాణం
💠 శుకబ్రహ్మ గొప్ప జ్ఞాని,మహాయోగి.
ఇహలోక విషయాలకు అతీతుడై సదా తపోదీక్షలోనే వుండే మహానుభావుడు.
💠 రావణుడిని ఓడించిన తర్వాత, శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు నెడుంగునం కొండ అతని దృష్టిని ఆకర్షించింది.
అక్కడ, చిలుక లాంటి ముఖం కలిగిన, వేద వ్యాసుని కుమారుడు అయిన శుకుడు మోక్షాన్ని కోరుతూ అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని దర్శనం కోరి తపస్సు మొదలుపెట్టాడు.
💠 శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమత్సమేతంగా శుక మహర్షి ఆశ్రమానికి విచ్చేసాడు.
వచ్చిన అతిధులందరికీ ఆ రోజు ఆతిధ్యమివ్వాలని శుకముని ఆశించి రాముడిని కోరారు.
వారికి ఒక పూట భోజనం పెట్టాలని అనుకుని శ్రీ రాముని ఆహ్వానించారు మహర్షి.
💠 రావణ సంహారం అయిన వెంటనే సీతాదేవితో అయోధ్యకు రాకపోతే అగ్ని ప్రవేశం చేసే ప్రయత్నంలో భరతుడు వున్నాడు.
శ్రీరామునికి ఎటూ పాలుపోని స్థితి. శుక మహర్షి కోరికను కాదనలేడు. అటు సోదరుడు భరతుని కాపాడాలి.
💠 ధర్మసంకటంలో పడిన రామునికి ఒక ఆలోచన తట్టింది.
వెంటనే హనుమంతునికి తన అంగుళీయకమును యిచ్చి తాము అయోధ్యకు వస్తున్న వార్తను భరతునికి తెలిపి వెంటనే తిరిగి రమ్మని హనుమంతుని ఆదేశించాడు.
💠 రామాజ్ఞ మేరకు హనుమ వాయువేగంతో భరతుని వద్దకు వెళ్ళి విషయం తెలిపి, అతనిని సమాధానపరచి తిరిగి వచ్చాడు.
💠 శుక మహర్షి తను సేకరించిన అపురూపమైన వేదార్ధ తాళపత్ర గ్రంధాలను శ్రీరామునికి యివ్వగా, రాముడు వాటిని వినయంగా అందుకొని హనుమంతునికి యిచ్చి చదివి వినిపించమన్నాడు.
💠 తక్షణమే హనుమంతుడు
రామునికెదురుగా పద్మాసనంలో కూర్చుని ఆ తాళపత్రాలను చదివి వినిపించగా అందులోని వేదశాస్త్రార్ధాలను విని ఆనందించిన
శ్రీరాముడు 'ముక్తికోపనిషత్తు 'అనే ఉపనిషత్తుని హనుమంతునికి ఉపదేశించాడని ఈ ఆలయ చరిత్ర తెలుపుతున్నది.
💠 ప్రాచీనకాలంలో అరిటాకుకి
మధ్యలో ఇప్పుడు వున్నట్టు
సగభాగం చేస్తూ ఈనె వుండేది కాదట.
💠 హనుమంతుడు వేరు,తాను వేరు కాదని భావించే రాముడు హనుమంతునికి తనతో
సమాన అంతస్తుని యివ్వాలని సంకల్పించాడు.
💠 శుక మహర్షి ఆశ్రమంలో భోజనం చేసేటప్పుడు ఇద్దరూ ఒకే అరిటాకులో భోజనం చేయడానికి హనుమంతుని కూడా ఆశీనుని చేసి ఒకే ఆకులో వారిద్దరూ ఒకే సమయంలో భోజనం చేయడానికి వీలుగా అరిటాకు
మధ్య ఒక గీతని గీశాడు రాముడు.
💠 ఆనాడు అరిటాకు మధ్యలో గీసిన గీతే ఈనాడు అరిటాకులో మధ్యగా ఈనెగా మారిందని చెపుతారు. ఈ సంఘటన ఈ ఆలయం వున్న స్థలంలోనే జరిగినదని స్థలపురాణం విశదీకరిస్తోంది
💠 శుక మహర్షి ప్రార్ధనని మన్నించి శ్రీరాముడు ఒక పూట ఆయన ఆశ్రమంలో వుండి ఒక పొడవాటి రాతిమీద ఆశీనుడైనందున, ఈ ప్రాంతం ప్రసిధ్ధిచెంది 'నెడుంకున్డ్రు ' అని పిలువబడినది.
💠 శుకుడు తన ఆశ్రమంలోనే శ్రీరాముడు విడిది చేసిన భంగిమలోనే ఒక విగ్రహం ప్రతిష్టించి, తన నివాసాన్ని ఆలయంగా చేసుకుని పూజలు చేయసాగారు శుకమహర్షి.
శ్రీరాముడు కూర్చున్న భంగిమలో ఉన్న ఏకైక ఆలయం ఇదే.
💠 యోగ రాముడి ఆలయం విద్యా ప్రయోజనాలను కోరుకునే ప్రార్థనా స్థలంగా మరింత గౌరవించబడుతుంది.
భక్తులు జ్ఞానం, సంతోషకరమైన వివాహం, సంతాన వరం, కుటుంబ ఐక్యత, మతిమరుపు నుండి నివారణ మొదలైన వాటి కోసం కూడా భగవంతుని ఆశీర్వాదాలను కోరుకుంటారు.
💠 ఆదిలో చాలా చిన్నదిగా వుండే ఈ రాముని ఆలయాన్ని కృష్ణదేవరాయలు తన కాలంలో చాలా అభివృద్ధి పర్చారు.
💠 ఆరు అంతస్తుల రాజ గోపురం,బలి పీఠం,వేయి కాళ్ళ మండపం గల ఈ ఆలయం గర్భగుడి ముందు 9 అడుగుల ఎత్తున ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా
నిలబడివుండడం చూస్తాము.
💠 గర్భగుడిలోని శ్రీ రాముడు కోదండం ధరించకుండా యోగ భంగిమలో సింహాసనం మీద ఆశీనుడై వుండగా, ఆయన
ఒక హస్తం జ్ఞాన ముద్రనుపట్టి
హృదయానికి సమీపమున వుంటుంది.
మరియొక హస్తం తొడమీద
వుంటుంది.
💠 ఆయనకి ఎడమ వైపున సీతాదేవి చేతిలో తామర పుష్పం ధరించి ఆశీనురాలై వుంటుంది.
కుడిప్రక్కన లక్ష్మణుడు , రామునికి ముందు హనుమంతుడు నేల మీద ఆశీనుడై తాళపత్రాలలోని
బ్రహ్మసూత్రాలను చదువుతున్న భంగిమలో కనిపిస్తారు.
💠 విజయరాజు అన్నది యోగరామ దేవాలయంలోని ఉత్సవమూర్తి పేరు.
💠 చక్రతాళ్వారు, కల్యాణ వేంకటేశ పెరుమాళ్, సంజీవి హనుమాన్, ఆళ్వారులు మొదలైన వారి కోసం ప్రధాన మందిరం చుట్టూ అనేక అందమైన సన్నీధులు ఉన్నాయి.
💠 ఈ ఆలయ తీర్థాన్ని శుక తీర్థం లేదా సూర్య తీర్థం అని కూడా పిలుస్తారు .
💠 శ్రీ రామనవమి వైశాఖ నక్షత్రాన గరుడసేవ,శ్రీకృష్ణ జయంతి , కార్తిక దీపం,హనుమజయంతి, మొదలైన
పండుగలు వైభవంగా
జరుపుతారు.
శ్రీ రామనవమి ఉత్సవం
ఘన వైభవంగా జరుపుతారు.
💠 తిరువన్నమలై నుండి 55 కి.మీ
రచన
©️ Santosh Kumar
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి