పోతన వ్యక్తిత్వ ప్రశంస :
పోతన మహాకవి పేరును.. ఆయన రచించిన భాగవత కావ్యాన్ని తలచుకోగలగడమే పెద్ద పుణ్యం.
"రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనైన ,
ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు , విష్ణు వి, భ్రాజిత పాదపద్మములు భాగవతమ్ములు వాని పద్యముల్ , సాజము గానె చిత్తీ కలశమ్మును చుట్టిన భక్తి సూత్రముల్ "
అంటూ ,'మహా సహస్రావధాని', ' పద్మశ్రీ ' డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు పోతన వ్యక్తిత్వం గురించి "సాగర ఘోష " కావ్యంలో ఘనమైన పద్యాన్ని అందించారు,
పోతన మహాకవి విషయంలో ఈ వర్ణన ,ప్రశంస అక్షర సత్యమనే చెప్పాలి .
పోతన మహాకవి కవిత్వాన్ని నమ్ముకున్న వాడే గానే అమ్ముకున్న వాడు కాదు .
రాజులు తనను ఆహ్వానించి విలువైన రత్న ధనరాశులు ఇస్తామని భాగవత కావ్యాన్ని తమకు అంకితం ఇవ్వ వలసినదని ఎంతగా ప్రాధేయపడినా సున్నితంగా నిరాకరించిన ఘనమైన వ్యక్తిత్వం పోతన మహాకవి స్వంతం.
రాజుల ప్రలోభానికి.. ఒత్తిడికి తలొగ్గి పోతన భాగవత కావ్యాన్ని వారికి ఎక్కడ అంకితం ఇస్తాడోననే భయంతో సరస్వతీ దేవి కన్నీరు కారుస్తూ పోతన ఎదుట సాక్షాత్కరించింది.
తాను ధనం కోసం భాగవత కావ్యాన్ని రాజులకు. అంకితం ఇవ్వనని దుఃఖించ వద్దంటూ పోతన సరస్వతీ దేవిని ఊరడించి ఆమె కన్నీరు తుడిచి ఆమెకు సంతోషాన్ని కలుగ చేసాడు.
ధనం కోసం కవిత్వాన్ని కావ్యాన్ని అమ్ముకోవడం తీవ్రమైన అపచారంగా పోతన భావించాడు .
అందుకే ఆయన వ్యవసాయం చేసుకుని జీవిస్తాను తప్ప తన కావ్యాన్ని, కవిత్వాన్ని ధనం కోసం అమ్ముకోబోనని స్పష్టం చేసాడు.
పేరు ప్రతిష్ఠల కోసం ..ప్రచారం కోసం తమ రచనలను దుర్వినియోగం చేసే వారున్న నేటి కాలంలో పోతన వంటి సత్కవులు పుణ్య శీలురు అతి అరుదుగా మనకు కనిపిస్తారు. పోతనను దండించాలని చూసిన రాజులు కాల గర్భంలో కలిసి పోయారు.
పోతన పద్యాలు మాత్రం పండిత..పామర జన నాల్కలపై నర్తిస్తూ భాగవత మకరంద సుధారస మాధురులను పంచుతూ ఆ మహాకవిని..పరమ భాగవతోత్తముని నేటికీ మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి.
కవి నిఖార్సైన వ్యక్తిత్వం కలిగిన వాడయినప్పుడే అతడికి సామాజిక గౌరవం, సత్కీర్తి ప్రాప్తిస్తాయి.
కవిత్వం విలువ నిలబడాలంటే కవులకు ఉన్నతమైన వ్యక్తిత్వం అవసరం.
కవి రచనతో పాటు అతడి వ్యక్తిత్వపు విలువను కూడా సమాజం అంచనా వేస్తుంది.
(ఎం.వి.ఎస్. శాస్త్రి, ఒంగోలు 9948409528)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి