8, ఫిబ్రవరి 2021, సోమవారం

పంచ_సరోవరాలు__దేవాలయాలు

 #పంచ_సరోవరాలు__దేవాలయాలు..


మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేద కాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు '#పంచ_సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి:


1. #మానస_సరోవరం 

2. #పంపా_సరోవరం 

3. #పుష్కర్‌_సరోవరం

4. #నారాయణ_సరోవరం

5. #బిందు_సరోవరం


1. #మానస_సరోవరం


సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆది దంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.


ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండు మంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గర దాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నది దాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒకసరస్సు సృష్టించాడు. హంస రూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.


ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగ ప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూ వుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలా రకాల వ్యాధులను నయం చేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మ వృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.


మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగు భాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.


ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్ని భుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొర పెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్క చోట పడతాయి. అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.


మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర తీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.


ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.

చాలామంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు... ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు. ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్‌ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీ యాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.


ఈ యాత్రకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్‌ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్‌ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానస సరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.


2. #పంపా_సరోవరం


పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణ కాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీ తీరంలో మాతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.

సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపా సరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది. "శ్రీ రామచంద్రమూర్తి.! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలి నయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్య లోకాలకు చేరుకుంటాను. స్వామీ, మాతంగ ముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురు చూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.


"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షి గణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్త సాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది.


అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.


రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.


హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలో నున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.


3. #పుష్కర_సరోవరం 


పద్మ పురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమయ్యాడట.

ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పణాలను చేస్తుంటారు.


 4. #నారాయణ_వన_సరోవరం


ఈ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది.


ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, అశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివ పరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం.


ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువ బడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.


భుజ్‌ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండు గంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.


5. #బిందు_సరోవరం


గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.


ఓ పురాణ కథనం ప్రకారం, స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్త వయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనంద భాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.


కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిది మంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజ చేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్ర భాగ్యాన్ని కలిగించాడు.ఆ పుత్రుడే కపిలుడు.


ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృ దేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృ దేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.


బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌ జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి.


అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందు సరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.


ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచ సరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద #పంచ_సరోవరాల దర్శనం ఉభయ తారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృ దేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. 


ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసిక తీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధుర సంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు. ‌


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


సేకరణ

ఇప్పటికైనా తెలుసుకో..*

 *ఇప్పటికైనా తెలుసుకో..*


🍁🍁🍁🍁


 *మా కురు ధన జన యౌవన గర్వం* 

*హరతి నిమేషాత్కాలః సర్వం |*

*మాయామయమిదమఖిలం హిత్వా*

*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||*

   --- భజగోవిందం నుండి...


ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.



ధనము ఉన్నాదని.. అనుచర గణం ఉన్నాదని.. యౌవనం ఉన్నదని గర్వించే వారికి సూచన...

ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు. అహంకరిస్తాడు. శాశ్వతమనుకొని భ్రమ పడతాడు.


ధన జన యౌవన గర్వం...


కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు. వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి. ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు. అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు.


కొందరికి జనగర్వం...


తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు. తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది. తన శ్రేయోభిలాషులు ఎవరో ఎంత మందో.


ఇక కొందరికి యౌవన గర్వం...


యవ్వనం శాశ్వతం అనుకుంటారు. శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి/ఆమె గర్వం.. ఆ గర్వంలో అతడు/ఆమె మంచి.. చెడూ.. గమనించరు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. అహంభావంతో ఉంటారు. ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు.


హరతి నిమేషాత్కాలః సర్వం...


ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేరు. కొన్ని సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి. నాకేం.. కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించిన వాడు మరు క్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది.


ఇప్పుడు ఏమైంది ఆ గర్వం.. నీ ధనం నిన్ను రక్షిస్తుందా.. నీ జనం నిన్ను రక్షిస్తారా.. అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం ఎక్కిరిస్తూ ప్రతీ జీవి మీదికి వచ్చి కూర్చుంటుంది.


కాబట్టి ఇదంతా మాయా జాలం అని, క్షణికమైనవని భావించు. అంటే అనుభవించు తప్పులేదు. కాని వాటితో సంగభావం పెట్టుకోకు...


🌸జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁

డింగోరాజ్యం-బూర రాజ్యం*

 *✍🏼 నేటి కథ ✍🏼*



*డింగోరాజ్యం-బూర రాజ్యం*



అనగా అనగా రెండు రాజ్యాలుండేవి- డింగో రాజ్యం, బూర రాజ్యం. డింగో రాజ్యపు రాజు మురారి, బూర రాజ్యపు రాజు అరవిందస్వామి. మురారి, అరవింద స్వామి ఇద్దరూ మంచి మిత్రులు అవ్వటంతో రెండు రాజ్యాలూ ఎలాంటి తగాదాలు లేకుండా కలసి మెలసి ఉండేవి. రెండు రాజ్యాల ప్రజలూ ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా మిత్రభావంతో మెలగేవారు.


ఇలా ఉండగా ఒక సారి బూర రాజ్యపు రాజు తన దేశంలో ఒక గొప్ప కోవెల కట్టించాలని తలపెట్టాడు. గుడికి విశాలమైన ప్రాంగణం, ముందు పెద్ద కోనేరు, ప్రపంచంలోనే కనీ విననంత పెద్ద గాలిగోపురం- ఇలాంటి ప్రణాలికలతో ఒక గొప్ప గుడి నిర్మాణం మొదలైంది. అయితే పని ప్రారంభం అయిననాడే ఒక అద్భుతం జరిగింది: పంచలోహాలతో చేసిన వేణుగోపాల స్వామి విగ్రహం ఒకటి, బయట పడింది!


కొన్ని వందల సంవత్సరాల క్రితం డింగో రాజ్యమూ, బూర రాజ్యమూ కలిసి ఒకే 'డింగోబూర' రాజ్యంగా ఉండేవి. వేణు గోపాల స్వామి చలవ వల్ల డింగో బూర రాజ్యంలో అంతా సుభిక్షంగా ఉండేది. కానీ ఏనాడైతే స్వామి ఆలయం పడిపోయిందో, ఆ సంవత్సరమే రాజ్యం రెండు ముక్కలైంది; వానలు కురవక, కరువు ఏర్పడింది; అందరికీ‌ కష్టాలు, నష్టాలు మొదలయ్యాయి. ఆ తరపు రాజులు ఎంత వెతికినా మళ్ళీ వేణుగోపాల స్వామి విగ్రహం దొరకనే లేదు!


మళ్ళీ ఇన్నేళ్ళకు, తనకే విగ్రహం దొరికినందుకు అరవింద స్వామి ఎంతో సంతోష పడ్డాడు. స్వామి కోవెల పూర్తైతే మళ్ళీ తమ రాజ్యానికి పూర్వ వైభవం వస్తుంది! అందుకని, ఆయన కోవెల పనులు త్వరగా పూర్తిచేయమని ఆదేశాలు జారీ చేశాడు.


అయితే, అక్కడే ఉన్న డింగో రాజ్యపు గూఢచారి ఈ విషయాన్ని తక్షణమే తమ రాజు మురారికి చేరవేశాడు. "వేణుగోపాల స్వామి విగ్రహం ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం మొత్తం ఐశ్వర్యంతో నిండి ఉంటుంది.. మరి ఆ వైభవం బూర రాజ్యానికే ఎందుకు దక్కాలి; తాము వారికి ఎందులో తీసిపోయాము? మా ఇలవేల్పూ ఆ స్వామే- కనుక, విగ్రహం మాకే దక్కాలి" అని డింగో రాజు, సభికులు తీర్మానించారు. దాని ప్రకారమే మురారి అరవింద స్వామికి కబురు పంపాడు: "మీరు ఆ విగ్రహాన్ని మాకు ఇవ్వండి. దానికి తగిన డబ్బు చెల్లిస్తాం" అని.

అరవింద స్వామి, బూర రాజ్యపు మంత్రులూ ఇందుకు ఒప్పుకోలేదు. "మేం ఇవ్వం" అని కబురు పంపారు- "విగ్రహం మా రాజ్యంలోనే దొరికింది కాబట్టి, అది మాకే చెందుతుంది" అని. మాటలు చిలికి చిలికి గాలివాన అయ్యాయి. డింగో రాజ్యం వారు బూర రాజ్యం మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించేశారు. రెండు రాజ్యాలూ ఘోరంగా పోరాటం చేశాయి. ఆ యుద్ధం జరిగే చోట రక్తం‌ ఏరులై పారింది. ఇరుపక్షాల్లోనూ వేలమంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా విజయం ఇద్దరిలో ఎవరినీ వరించలేదు- ఇంకా చాలా ధననష్టం, ప్రాణ నష్టం జరిగితే తప్ప, యుద్ధం ముగిసేట్లు లేదు.



గుడారంలో‌ చికాకుగా అటూ ఇటూ తిరుగుతున్న అరవింద స్వామికి, దూరంగా ఇద్దరు పిల్లలు కనబడ్డారు. వాళ్ల దగ్గర ఒక రొట్టెముక్క ఉన్నది. అన్న 'ఆ రొట్టె నాదే' అంటున్నాడు. తమ్ముడు 'అది నాకే కావాల'ని ఏడుస్తున్నాడు. ఒక దశలో ఇద్దరూ కలబడి కొట్టుకోవటం మొదలు పెట్టారు. అంతలో వాళ్ళ అమ్మ వచ్చి, అన్న చేతిలోంచి రొట్టెను తీసుకొని, దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరికీ‌ ఇచ్చింది.


అది చూశాక అరవింద స్వామికి కనువిప్పైంది. "వేణుగోపాల స్వామి విగ్రహం కోసం, అది తేనున్న ఐశ్వర్యం కోసం ఇంతమంది అమాయకుల ప్రాణాలు బలి కావలసిన అవసరం లేదు. రెండురాజ్యాలకూ మధ్యలో దివ్యమైన మందిరాన్ని నిర్మించి, స్వామిని అందులో ప్రతిష్ఠిస్తే, రెండు రాజ్యాలకూ మేలు జరుగుతుంది కద! తనకు ఇంతవరకూ ఈ ఆలోచన ఎందుకు రాలేదు?" అని ఆయన యుద్ధాన్ని విరమించి, మురారికి ఈ విషయమై ఆలోచించమని కబురు పంపాడు.


అప్పటికే యుద్ధంవల్ల కలిగే చెడు పరిణామాలను చూసిన మురారి, ఈ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడు. త్వరలో రెండు రాజ్యాల నడుమన ఒక భవ్య మందిరం తయారైంది. వేణుగోపాల స్వామి చలవ వల్ల, రెండు రాజ్యాలలోనూ శాంతి సామరస్యాలు మళ్ళీ నెలకొన్నాయి.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

మాండవ్యముని

*📖 మన ఇతిహాసాలు 📓*



*మాండవ్యముని వృత్తాంతం*



మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాడవ్యుని చూసి " మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు " అని ప్రశ్నించారు.అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరిని నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి పోయింది. ఆ తరవాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో " మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు. " అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో " పదునాలుగేళ్ళ వరకూ పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందు వలన ఇక మీదట పదునాలుగేళ్ళ బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గ్రర్భమందు జన్మించెదవు కాక " అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు.


9⃣4⃣4⃣1⃣7⃣6⃣4⃣4⃣7⃣7⃣

ఆణిముత్యం

 *💎 నేటి ఆణిముత్యం 💎*



బంగారు కుదువ బెట్టకు

సంగరమున బాఱిపోకు సరసుడవైనన్

అంగడి వెచ్చము లాడకు

వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ!36


*భావం:*


నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే నేను చెప్పే నీతిని శ్రద్ధగా విను. అవసరానికి బంగారం తాకట్టు పెట్టకు. యుద్ధరంగం నుంచి పారిపోవద్దు. ఇంటికి కావలసిన నిత్యావసరాలను దుకాణంలో అప్పుపెట్టి తీసుకోవద్దు. మంచి,చెడు విచక్షణ లేనివానితో స్నేహం చేయవద్దు.


*ప్రతిపదార్థము:*


సరసుడవు + ఐనన్ అంటే ఆనందంగా ఉండాలనుకుంటే; బంగారు అంటే బంగారాన్ని; కుదువన్ + పెట్టకు అంటే తాక ట్టు పెట్టవద్దు; సంగరమునన్ అంటే యుద్ధభూమి నుంచి; పారిపోకు అంటే పలాయనం చేయకు. అంగడిన్ అంటే దుకాణంలో; వెచ్చములు + ఆడకు అంటే ఇంటికి కావలసిన నిత్యావసరాలను అరువు మీద తీసుకోవద్దు.


వెంగలితోన్ అంటే విచక్షణ లేనివానితో; చెలిమి అంటే స్నేహం; వ లదు అంటే మంచిదికాదు; వినరా అంటే వినవయ్యా. ప్రతివారూ జీవితంలో పైకి ఎదగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటించడం వల్ల జీవితం హాయిగా నడుస్తుంది. అంతేకాక కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెడుతుంది. ఇందులో... బంగారం తాకట్టు పెట్టవద్దు, దుకాణంలో అరువుకి సరుకులు తీసుకోవద్దు... ఈ రెండింటినీ పాటిస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావు. అలా కాకపోతే అప్పులపాలవుతారు. అందువల్ల వీటిని పాటించమని చెప్పాడు. యుద్ధరంగంలో రాజు పారిపోతుంటే సైనికులు బలహీనులైపోతారు. వారిని శక్తిమంతులుగా ఉంచాలంటే రాజు తప్పనిసరిగా యుద్ధం రంగం నుంచి పారిపోకూడదు. చెడ్డవానితో స్నేహం చేయడం వల్ల ఎన్ని నష్టాలో అందరికీ తెలిసినదే. తాడిచెట్టు కింద నిలబడి పాలు తాగినా కల్లు తాగినట్లే భావిస్తారు. అందువల్ల మంచిపద్ధతులను అలవర్చుకుంటే జీవితం హాయిగా సాగుతుందని కవి ఈ పద్యంలో వివరించాడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

పుణ్యక్షేత్ర దర్శనం - 99*

 *తీర్థయాత్ర - పుణ్యక్షేత్ర దర్శనం - 99*

🙏🌺🌺🌺🌺🌻💐🌻🌺🌺🌺🌺🙏


*ఒ’మనే’శ్వరుడు.. ఒమన్ లో గుజరాత్ మోతీశ్వరుడు*


*ఒమాన్​లో ఏకైక శైవమందిరం*


*లింగరూపంలో పరమశివుడు*

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️


 *సుల్తానేట్ ఆఫ్ ఒమన్* దేశంలో ఒకే ఒక్క శైవ మందిరం *మోతీశ్వర స్వామి ఆలయం.* ఇక్కడ ఆ పరమ శివుడు లింగరూపంలో అత్యంత వైభవోపేతంగా విరాజిల్లుతున్నాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చి కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణం మధ్య అరేబియా మహాసముద్రం తీరాన, మనకు ఆ పరమశివుడు ఎంతో సుమనోహరంగా దర్శనమిస్తున్నాడు.


*ఆలయాన్ని కట్టించింది ఇండియన్లే*


సుమారు 125 ఏళ్ల క్రితం ఇండియాలోని గుజరాత్ కచ్​ప్రాంతం నుంచి భాటియా కుటుంబానికి చెందిన కొందరు,  వ్యాపార అవసరాల రీత్యా అరేబియా సముద్రం మీదుగా ఒమాన్, మస్కట్ ప్రాంతాలకు వచ్చారు. ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. ఆ సమయంలో ఆ పరమశివుడికి మందిరం కట్టించాలన్న ఆలోచనతో తోచినంత ధన సహాయం, అప్పటి సుల్తాన్ రాజు సహకారం, స్థానిక వనరులతో నిర్మాణపనులు చేపట్టారు. ఉత్తరభారతంలో ఉన్న దేవాలయాల నమూనాల తరహాలో ఈ క్షేత్రం రూపుదిద్దుకుంది. నాటి నుంచి నేటి వరకు హిందువులు ఈ ఆలయాన్ని దర్శించుకుని శివయ్యను పూజిస్తున్నారు.


*ముఖ్యమైన పర్వదినాల్లో..*


ఇక్కడి ఆలయంలో వెలిసిన పరమశివుడిని దర్శించుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతోంది. ఈ పుణ్యక్షేత్రం సుల్తాన్ రాజు గారి కోట పక్కనే ఉంది. కోట ప్రధాన ప్రాకారం గుండానే గుడికి వెళ్లేందుకు దారి ఉంది. సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో శివుడు, హనుమంతుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేస్తుంటారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన పండగలు, ఉత్సవాలు, వసంత పంచమి, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, శ్రావణమాసం, గణేష్ చవితి, ఇహ శివరాత్రి పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకుంటారు. ఈ సమయంలో సుమారు 20వేల మంది భక్తులు ఆ పరమశివుడిని దర్శించుకుంటారు. 


మోతీశ్వర స్వామి ఆలయ ఆవరణలో రెండు చిన్న దుకాణాలు ఉన్నాయి. అక్కడే ఆ పరమశివుడికి సమర్పించుకోవడానికి అవసరమైన పూజాసామగ్రి దొరుకుతుంది. ఇక్కడ షాపులు నిర్వహించేవారు, శైవక్షేత్రం కాపలాదారులంతా స్థానికంగా నివసించే అరబ్బులే కావడం విశేషం..


*ఎన్నో విశిష్టతలు*


ఆలయంలోకి ప్రవేశించగానే ప్రాంగణంలో ఎడమ వైపున పెద్దరావి చెట్టు ఉంది. అక్కడే ఒక గోముఖ ఆకారంలోనుంచి వచ్చే నీటి ధార కింద చిన్నకుండి, ఎదురుగా మారేడు, ఆలయం కుడివైపున బిల్వవృక్షం, కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేకస్థలం, ప్రసాదం కౌంటర్, లోపలికి ప్రవేశించే ముందు ఒక బావి ఉంది. పైన ఇనుప కవచంతో కప్పబడి ఉంటుంది. లోపల కొబ్బరి ఊట మాదిరిగా నీటిధార ప్రవహిస్తూ ఉంటుంది. 


ఆలయం లోపల వెళ్లగానే మనకు మూడు చిన్నచిన్న గుళ్లు కనిపిస్తాయి. ముందుగా మనకు ఆదిమోతీశ్వర మహాదేవ్ కనిపిస్తాడు. లింగేశ్వరుడికి ఎదురుగా నందీశ్వరుడు, లింగాకారంలో పైన సర్పతొడుగు, వెండికవచం ఉంటుంది.


*నిత్య అభిషేకప్రియుడు*


గుడిలోపల మొత్తం ఏసీని బిగించారు. లోపలికి కాలు అడుగు పెట్టంగానే హిమమంత చల్లగా ఉంటుంది. రేనోవేషన్​లో భాగంగా వాస్తుశాస్త్రరీత్యా ఇటీవల నిర్మించిన మోతీశ్వర మహాదేవ్ మందిరం ఉంటుంది. ఆ తర్వాత మూడవ గుడి హనుమాన్ గుడి, రాతి విగ్రహం, ఆ పక్కనే చిన్న శనీశ్వరుడి విగ్రహం ఉంటుంది. హనుమాన్ కు ఎదురుగా ఒక పెద్ద సీతారాముల చిత్రపటం, అక్కడే చిన్న నీటి ఫౌంటెన్ ఉంది. గుడి మొత్తం దేదీప్యమానంగా విద్యుత్ దీపాల వెలుగుల్లో వెలుగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. 


ఆ పరమేశ్వరుడికి పవిత్రమైన అగ్ని హారతి రూపేణా శుద్ధమైన, పావనమైన నీళ్లు, పాలు, పూలు, బిల్వపత్రాలు, ప్రసాదం సమర్పిస్తారు. చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడానికి చిన్న ఖాళీప్రదేశం ఉంది. ఆలయం ప్రాంగణంలో సేదదీరడానికి చిన్న చిన్న అరుగులను వేసి ఉంచారు. ఆలయ ఆవరణలో ఎడమ వైపున కొద్దిదూరంలో ఒక పెద్దహాలు ఉంది. ఇక్కడే భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, ధ్యానం వంటి చేస్తుంటారు.


*దర్శించుకోవడం ఎలా..?*


భారత్​నుంచి వెళ్లే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముఖ్యంగా పాస్​పోర్ట్, ఒమాన్ దేశపు విజిట్ వీసా ఉండాలి. కొంత రుసుము కడితే ట్రావెల్ ఏజెన్సీవాళ్లు అన్ని వసతులు సమకూరుస్తారు. సులువైన విమాన మార్గం ఉంది. ఇండియాలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి మస్కట్ కు విమాన సర్వీసులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఒమన్ ఎయిర్, ఇండిగో.. ఇలా పలు విమానయాన సంస్థల విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మస్కట్ ఎయిర్​పోర్ట్​నుంచి టాక్సీలో ఆలయం వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి 35కి.మీ. దూరంలో ఉంటుంది. అరగంటలో అక్కడికి వెళ్లవచ్చు. ఈ ఆలయంతో పాటు దేశంలోని చుట్టుపక్కల రమణీయ ప్రదేశాలను సందర్శించాలంటే లక్ష రూపాయలు ఖర్చవుతాయి.


*దర్శించుకున్న ప్రధాని మోడీ*


2018 ఫిబ్రవరి 12న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒమాన్ పర్యటనలో భాగంగా ఆది మోతీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 


ఇంకెందుకు ఆలస్యం ఎన్నో విశిష్టతలు ఉన్న రమణీయ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోండి.


*ఓం నమశ్శివాయ*


🙏🌺🌺🌺🌺🌻💐🌻🌺🌺🌺🌺🙏

సేకరణ: శ్రీ  భళ్లమూడి హనుమద్ రామకృష్ణ,  వాడపల్లి.

🍁♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️🍁

మన మహర్షులు- 13

 మన మహర్షులు- 13


 కర్దమ మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


బ్రహ్మదేవుడు, గంధర్వుల్ని, అప్సరసల్ని, సిద్ధుల్ని,  కిన్నెరల్ని, కింపురుషుల్ని సృష్టించాక ఋషుల్ని సృష్టించాడు. 

వీళ్ళందర్ని ప్రజాసృష్టికి ఉపయోగించుకున్నాడు బ్రహ్మ. అందులో ఒక ఋషి మన కర్ధమ మహర్షన్నమాట.


కర్దమ మహర్షి కృతయుగంలోని వాడు.


ఒకసారి కర్దముడు సరస్వతీ నదీ తీరంలో ఒక ఆశ్రమం కట్టుకుని విష్ణుమూర్తి దర్శనం కోరి తపస్సు చేశాడు. 


పదివేల సంవత్సరాలు అలా తపస్సు చేశాక విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏంకావాలో కోరుకో అన్నాడు. 


కర్దమ మహర్షి విష్ణుమూర్తిని చూసి ఆనందం పట్టలేక సాష్టాంగ నమస్కారం చేసి స్వామీ ! నేను వివాహం  చేసుకోవాలని తపస్సు చేశాను సృష్టి కార్యానికే గాని సుఖాలకోసం కాదు. నీ అనుమతి ప్రకారమే నేను కోరుకున్నాను అన్నాడు


కర్దముడి మాటలు విని విష్ణుమూర్తి మహర్షీ ! నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. బ్రహ్మవర్త దేశపురాజు భార్యతో కలిసి నీ దగ్గరకు వచ్చి వారి కూతుర్ని నీకిచ్చి పెళ్ళి చేస్తారు. నీకు తొమ్మిది మంది కూతుళ్ళు వాళ్ళకు గొప్ప మునులు పుడ్తారు తర్వాత నువ్వు నాలోనే లోకాలన్ని వున్నాయనీ, నీలో కూడ నేనే ఉన్నానని తెలుసుకుని నన్నే పూజించు. నాఅంశతో నీ భార్య వలన నేనే కొడుకుగా నీకు పుడతాను అని చెప్పాడు


కర్దముడు మళ్ళీ తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 స్వాయంభువుడు భార్య శతరూపతోను, కూతరు దేవహూతితోను కలిసి వచ్చి తన కూతుర్ని పెళ్ళి చేసుకోమని  అడిగాడు...అపుడు కర్ధముడు తనకు సంతానం కలిగిన తరువాత సన్యాసం తీసికొంటానని చెప్పాడు..


దేవహూతి తన భర్త అయిన కర్ధముడికి సేవచేస్తూ ఉండిపోయింది. 


కొంతకాలం తర్వాత వాళ్ళకి తొమ్మిదిమంది కూతుళ్ళు పుట్టారు. కర్దముడు పిల్లలు పుట్టారు కనుక సన్యాసం తీసుకుని తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతానని చెప్పాడు. 


దేవహూతి ఆడపిల్లలు

పెళ్ళిళ్ళయి అత్తవారిళ్ళకు వెళ్ళేవరకు తనకు ఒక కొడుకు పుట్టేవరకు ఉండమని భర్తని వేడుకుంది. 


కర్దముడు కొడుకు కావాలంటే విష్ణుమూర్తిని ధ్యానం చెయ్యమని చెప్పాడు.


కొంతకాలం తర్వాత దేవహూతికి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే కొడుకుగా పుట్టాడు .అతనికి కపిలుడు అని నామకరణం చేశారు.


 మరీచి మొదలయిన మునులతో కలిసి వచ్చి కపిలుడు దేవదేవుడని లోకాల్ని ఉద్ధరించడానికే పుట్టాడని ,కర్దముడి కూతుళ్ళకు మునులనే ఇచ్చి పెళ్ళి చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు బ్రహ్మ


బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే కర్దముడు తన తొమ్మిదిమంది కూతుళ్ళకు మునులతో వైభవంగా పెళ్ళి చేశాడు.


 కపిలుణ్ణి కనిపెట్టుకుని దేవహూతీ కర్థములు ఉండిపోయారు.


 కొంతకాలం గడిచాక కర్దముడు దేవదేవుడే తన కొడుకుగా ఇంట్లో ఉన్నాడని కొడుకయిన కపిలుడికి నమస్కారం చేసి స్వామి ! ఆదివిష్ణువయిన నువ్వే నా ఇంట్లో పుట్టావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నా మనస్సు నీలోనే లగ్నం చేసి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కర్దముడు


కపిలుడు "నేను నీకు మాట ఇచ్చినట్లే నీకు కొడుకుగా పుట్టాను. మునులందరికి తత్త్వజ్ఞానం గురించి చెప్తాను. నువ్వు కూడ కోరికలు వదిలేసి భక్తి కలిగి నన్ను మనస్సులో తలచుకుంటూ మోక్షాన్ని పొందు "అని చెప్పాడు


కర్దముడు కపిల మహర్షికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఆశ్రమానికి వెళ్ళి పరబ్రహ్మని మనస్సులో నిలుపుకుని లోకమంతా భగవంతుడే వ్యాపించి ఉన్నాడని తెలుసుకుని మోక్షాన్ని పొందాడు.


ఇదీ..కర్దమ మహర్షి జీవితచరిత్ర!


విష్ణుమూర్తికే తండ్రి అయిన కర్ధముడు ఎంత గొప్పవాడో కదా...


సనాతన ధర్మంలోని పలు గ్రంథాల్లో ఈ మహర్షి పేరు ప్రస్తావితమైనది.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

వివాహంలోని కార్యక్రమాలు :

 వివాహంలోని కార్యక్రమాలు :


1. కన్యావరణం:

2. పెళ్ళి చూపులు

3. నిశ్చితార్థం:

4. అంకురార్పణం:

5. స్నాతకం:

6. సమావర్తనం:

7. కాశీయాత్ర:

8. మంగళస్నానాలు:

9. ఎదురుకోలు:

10. వరపూజ:

11. గౌరీపూజ:

12. పుణ్యాహవాచనం:

13. విఘ్నేశ్వరపూజ:

14. రక్షా బంధనం:

15. కొత్త జంధ్యం వేయడం:

16. గౌరీ కంకణ దేవతాపూజ:

17. కౌతుక ధారణ:

18. కంకణ ధారణ:

19. మధుపర్కము:

20. వధువును గంపలో తెచ్చుట:

21. తెరచాపు

22. మహా సంకల్పం:

23. కన్యాదానం:

24. వధూవరుల ప్రమాణములు:

25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:

26. స్వర్ణ జలాభిషేకం:

27. చూర్ణిక:

28. వధూవర సంకల్పం:

29. యోక్త్రధారణం:

30. మాంగల్య పూజ:

31. మాంగల్య ధారణ:

32. అక్షతలు-తలంబ్రాలు:

33. బ్రహ్మముడి:

34. సన్నికల్లు తొక్కడం:

35. కాళ్లు తొక్కించడం:

36. పాణి గ్రహణం:

37. సప్తపది:

38. లాజహోమం:

39. యోక్త్రవిమోచనం:

40. స్థాలీపాకం:

41. ఉంగరాలు తీయడం:

42. బొమ్మని అప్పగింత:

43. నాగవల్లి:

44. ధ్రువనక్షత్రం:

45. అరుంధతి నక్షత్ర దర్శనం:

46. అప్పగింతలు:

47. అత్తమామలకు వధువు పూజ:

48. ఫలప్రదానం:

49. పానుపు:

50. మహదాశీర్వచనం:

51. వధువు గృహప్రవేశం:

52. కంకణ విమోచన:

53. గర్భాదానం:

54. పదహారు రోజుల పండుగ

55. అల్లెం.

ప్రఙ్ఞానం

 ప్రఙ్ఞానం లో ప్ర గురించి వివిధ రూపములుగా వేద సూత్ర ప్రకారం తెలుపు చున్నది. ప్ర ఆపః ఆపోవా ఇదగ్ం సర్వం... ఆదిత్యహృదయంలో అపాం మిత్రః... మంత్ర పుష్పం యెూపాం పుష్పం వేద... యెూ అపాం.... వేంకటేశ సుప్రభాతం అపాం నిధిరధిష్టాయ .... అపాం నిధిః అధిష్టాయ.... అపాం అన్నది నిధి యైతే  నిధి వస్తు తత్వ మా లేక పంచభూతాత్మకమైన జీవ తత్వ మా లేక జీవులు లేక జీవ మూలమైన ప్రకృతి యా లేక ప్రకృతి రూపంలో వున్న శక్తి లక్షణమా! వీటి మూలమైన ఆపః జీవనాధారమైన నీటిరూపమా లేక దానికి మూలమైన అగ్ని తత్వ మా! దీనినే అనగా ప్ర అనే ఙ్ఞానమును తెలియుటయే మెూక్షమని అసలు మానవ జన్మయే పై విషయమును  తెలియుటకు ముఖ్యఉద్దేశ్యం. అందుకు ప్రతీ కర్మను జాగ్రత్తగా చేయవలెను. ఫలమును ఆశించకుండా చేయుటే జీవ లక్షణము.  కర్మ ఫలము అనుభవించుట యనునది ఏజన్మలోనైనా అనుభవించవలసినదే. లేనియెడల అది ఆత్మను తద్వారా దేహమును ఉపాధిగా చేయుచునే యుండి జన్మ ఎత్తుతునే యుండును. ఎవరు ఎన్ని చెప్పినా కర్మ ఫలములు వాసన రూపములో అనుభవించుటకు రెడీ గా మానవ జన్మ యే మూలము. కర్మ ఫలము అనగా జీవ రూపములో దేహమును ఆశ్రయించుట. దీనికి ప్రత్యక్ష కర్మ సాక్షి వేంకటేశ్వర రూపంలో వున్న అపాం నిధికి మూలమైన మిత్ర ,వరుణ రూపంలో గల సూర్య శక్తి మాత్రమే.మనకు ప్రత్యక్షంగా కనిపించే ప్రతీ పదార్ధ తత్వ లక్షణమునే సూత్ర పూర్వకంగా విభజించుట.దీనినే సులువుగా ఇహము పరము అని ఈ అనగా శక్తి పూర్ణమైన హవిస్సు గా అనగా పదార్ధ శక్తిగా మారుట.పరము అనగా యీ విషయమును సూక్మంగా ఆత్మ తెలియుట. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

సుభాషితమ్

 🌸 *సుభాషితమ్* 🌸

 🙏 *!!శుభోదయమ్!!* 🙏

శ్లో|| దయయా సర్వభూతేషు, సంతుష్ట్యా యేనకేన వా -

సర్వేంద్రియోపశాంత్యా చ, తుష్యత్యాశు జనార్దనః!!!!!!! 


తా|| అన్ని జీవులయందు దయ, ఉన్న దానితో సంతృప్తి, ఇంద్రియ నిగ్రహం అనే సుగుణాలు కలవారికి దైవం వెంటనే ప్రసన్నుడౌతాడు....... 

🙏✨💖🌷